![]() |
![]() |
.webp)
సౌత్ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు ఖుష్బూ. అభిమానులకి, తనకి మధ్య ఉన్న సినీ అనుబంధం వయసు మూడుదశాబ్దాలపైనే. సెకండ్ ఇన్నింగ్స్ లోను తన సత్తా చాటుతున్న ఖుష్భుకి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు అవంతిక కాగా చిన్న కుమార్తె ఆనందిత. అయితే లావుగా ఉండే ఆనందిత సన్నబడటంపై సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆమె బరువు తగ్గడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని, ఓజెంపిక్, మౌంజారో వంటి ఖరీదైన బరువు తగ్గించే మందులను వాడిందని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ దుష్ప్రచారంపై ఆనందిత తాజాగా జెఎఫ్డబ్ల్యు (JFW) పాడ్కాస్ట్లో మాట్లాడుతూ నేను ఎవరినో సంతోషపెట్టడానికి బరువు తగ్గలేదు. ఈ మార్పు వెనుక ఏడేళ్ల సుదీర్ఘ నిరంతర శ్రమ దాగి ఉంది. చిన్నతనం నుండి నేను నా సోదరి అవంతిక కాస్త బొద్దుగా ఉండేవాళ్ళం. వయసు పెరుగుతున్న కొద్దీ ఊబకాయం (Obesity) కారణంగా కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలని ఎదుర్కొన్నాం. కేవలం ఫిట్గా మారాలనే బలమైన సంకల్పంతోనే 2018 బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేసాం. అయితే, ఈ ప్రక్రియ రాత్రికి రాత్రే జరగలేదని, దీని కోసం దాదాపు 7 సంవత్సరాల పాటు కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామాలు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో మూడు సంవత్సరాల పాటు ప్రపంచానికి దూరంగా ఉన్నప్పుడు నా శరీరంలో ప్రధానమైన మార్పులు వచ్చాయి. ఆ సమయంలో మేము పడ్డ కష్టాన్ని ఎవరూ చూడలేదు.
సెలబ్రిటీల పిల్లలుగా పుట్టడం వల్ల తాము ఎదుర్కొన్న మానసిక వేదనను ఆనందిత ఈ సందర్భంగా పంచుకున్నారు. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో చురుగ్గా మారిన తరుణంలో నా బరువు, రంగుపై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. మా అమ్మ ఎంతో అందంగా ఉంటుందని, కానీ తాను మాత్రం తల్లి అంత అందంగా లేనంటూ వచ్చిన కామెంట్లు నన్ను ఎంతగానో బాధించాయి. అప్పట్లో లావుగా ఉన్నావని ఎగతాళి చేసిన వారే, ఇప్పుడు కష్టపడి సన్నబడితే సర్జరీలు చేయించుకుందంటూ కథలు అల్లుతున్నాఋ . సోషల్ మీడియాలో వచ్చే ద్వేషాన్ని ఎవరూ ఆపలేరని తనకు అర్థమైందని, అందుకే ఈ విమర్శలను తాను పట్టించుకోవడం లేదని తేల్చి చెప్పారు.
Also read: Dhurandhar: దురంధర్ వెలుతురు, నీడలు కూడా ప్రధాన పాత్రధారులని మీకు తెలుసా!
ఆనందిత కేవలం ఒక సెలబ్రిటీ కూతురిగానే కాకుండా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 19 ఏళ్ల వయసులోనే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె, ప్రముఖ దర్శకుడు మణిరత్నం పర్యవేక్షణలో 'పొన్నియిన్ సెల్వన్ 2' చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగస్వామి అయ్యారు. ఆ తర్వాత కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇటీవల జూన్ 12న థియేటర్లలో విడుదలైన 'డబుల్ ఆక్యుపెన్సీ' అనే వెబ్ సిరీస్ ద్వారా క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఆమె అరంగేట్రం చేశారు. ప్రస్తుతం 'మీసయ మురుక్కు 2' చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉండే పని ఒత్తిడి, శారీరక శ్రమ కారణంగానే తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వచ్చిందని, అందుకే పూర్తి ఆరోగ్యకరమైన పద్ధతుల్లోనే ఫిట్నెస్ సాధించానని ఆనందిత స్పష్టం చేశారు.

![]() |
![]() |