![]() |
![]() |

టాలీవుడ్ ఆల్ టైం హిట్ పెయిర్ వెంకటేష్-సౌందర్య నటించిన చిత్రాలలో 'పెళ్ళి చేసుకుందాం' ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్ పై సి.వెంకట్రాజు, శివరాజు సంయుక్తంగా నిర్మించారు. 1997, అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. (Pelli Chesukundam)
28 సంవత్సరాల తర్వాత 'పెళ్ళి చేసుకుందాం' సినిమా మళ్ళీ థియేటర్లలో '4K'లో అలరించడానికి సిద్ధమవుతోంది. వెంకటేష్ జన్మదిన కానుకగా డిసెంబర్ 13న.. సాయిలక్ష్మీ ఫిలిమ్స్ ద్వారా వరప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో తెలుగులో 300 కోట్ల క్లబ్ ఫౌండర్ హీరోగా చరిత్ర సృష్టించిన వెంకటేష్ బాబు నటించిన ఆణిముత్యాల్లో ఒకటైన "పెళ్ళి చేసుకుందాం" చిత్రాన్ని 4K లో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఫ్రెష్ గా తీసుకువచ్చే అవకాశం లభించడం గర్వంగా ఉంది. మన రెండు రాష్ట్రాల్లో ఉన్న విక్టరీ ఫ్యాన్స్ తోపాటు... సిసలైన సినీ ప్రేమికులంతా "పెళ్ళి చేసుకుందాం" చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మూడేళ్లపాటు ఈ చిత్రం హక్కుల్ని మేము కలిగి ఉన్నాం" అని అన్నారు.

'పెళ్ళి చేసుకుందాం' చిత్రానికి భూపతి రాజా కథ అందించారు. ఇందులో లక్షాధికారి ఆనంద్ పాత్రలో వెంకటేష్ నటించగా, అత్యాచారానికి గురైన శాంతి పాత్రలో సౌందర్య కనిపించారు.
'పెళ్ళి చేసుకుందాం' కథ ఏంటంటే.. కాళీచరణ్ అనే వ్యక్తి చేసిన హత్యను చూసిన శాంతి, పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. దానికి ప్రతీకారంగా కాళీచరణ్ తమ్ముడు శాంతిపై అత్యాచారం చేస్తాడు. దాంతో తల్లిదండ్రులు శాంతిని ఇంటినుండి వెళ్ళగొడతారు. విషయం తెలిసిన ఆనంద్, శాంతిని ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తాడు. రోజులు గడుస్తున్నకొద్ది ఆనంద్, శాంతి ప్రేమలో పడతాడు. నీ శాంతి అతణ్ణి దూరం పెడుతుంది. వీరి ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి? చివరికి ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారనేది మిగతా కథ.
పోసాని కృష్ణమురళి రచించిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోటి స్వరపరిచిన పాటలన్నీ హిట్ అయ్యాయి. లైలా, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 13న మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
![]() |
![]() |