![]() |
![]() |
ఇద్దరు స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్హాసన్ 46 సంవత్సరాల తర్వాత కలిసి నటించబోతున్నారు. ఈ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మరి ఈ స్టార్ హీరోలు 46 సంవత్సరాల పాటు కలిసి సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం.
తమిళ్లో ఎం.జి.ఆర్., శివాజీ గణేశన్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హీరోలు రజినీకాంత్, కమల్హాసన్. నాలుగేళ్ళ వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు కమల్. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు రజినీకాంత్. ఈ ఇద్దరూ కె.బాలచందర్ కాంపౌండ్ హీరోలే. ఆయన డైరెక్షన్లో వచ్చిన చాలా సినిమాల్లో నటించారు. అలాగే బయటి నిర్మాతల సినిమాల్లోనూ కలిసి చేశారు. అయితే ఒక దశలో ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించకూడదని డిసైడ్ అయ్యారు. అలా అనుకోవడమే కాదు, ఆ విషయాన్ని ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇద్దరూ కలిసి నటించకూడదు అనే నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది.
1979లో వచ్చిన అల్లావుద్దీనుమ్ అర్పుత విలక్కుం చిత్రం ఈ స్టార్స్ విడిపోవడానికి కారణం. అప్పటికి కమల్హాసన్ రెమ్యునరేషన్ రెండున్నర లక్షలు. రజినీకాంత్ రెమ్యునరేషన్ ఒకటినర్న లక్షలు. అయితే ఈ సినిమాకి మాత్రం కమల్కి 1 లక్షల 75 వేలు, రజినీకి 1 లక్ష ఇచ్చారు. ఇద్దరికీ కలిపి 2 లక్షల 75 వేలు ఇచ్చారు. ఒక హీరోకి ఇచ్చే డబ్బుతో ఇద్దరు హీరోలు వస్తున్నారన్న భావనలో ఆ నిర్మాత ఉన్నారని గ్రహించారు రజినీ, కమల్. దీంతో కలిసి నటించడం వల్ల ఇద్దరికీ నష్టం జరుగుతోందని తెలుసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇకపై తామిద్దరూ కలిసి నటించడం లేదని ప్రకటించారు.
కమల్హాసన్తో విక్రమ్, రజినీకాంత్తో కూలీ చిత్రాలు బ్లాక్బస్టర్స్ రూపొందించిన లోకేష్ కనకరాజ్.. ఈ ఇద్దరితోనూ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ రజినీకి, కమల్కి కథ వినిపించాడు లోకేష్. కూలీ కంటే ముందే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాకి ప్లాన్ చేశారు లోకేష్. కానీ, కొన్ని కారణాల వల్ల అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయి త్వరలోనే సెట్స్పైకి వెళ్తుందని సమాచారం. ఈ చిత్రాన్ని రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
![]() |
![]() |