
పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్కళ్యాణ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎంతో సమర్థవంతంగా ఆ పదవిలో కొనసాగుతున్న పవన్కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం తీసుకొని దాన్ని అమలులో పెట్టారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం మహిళల కోసం ప్రత్యేక బహుమతులు పంపించారు. శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో పంపిన పసుపు, కుంకుమ, చీరలు అందజేశారు. పవన్ తరఫున ఆయన వదిన, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి శ్రీమతి పద్మజ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పంపిణీ చేశారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీరలు కానుకగా అందజేశారు. కొణిదెల పద్మజ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, బొట్టు పెట్టి మరీ సారె అందించారు.
పురూహూతిక అమ్మవారి సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. పిఠాపురం ఆడపడుచులతో కలసి పద్మజ వరలక్ష్మీ వ్రతం ఆచరించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ఘనంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే పురూహూతిక అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. వందలాదిగా తరలివచ్చి భక్తి శ్రద్దలతో వ్రతం ఆచరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మూడు బ్యాచులుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో భవాని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకు ముందు పద్మజ పురూహూతిక అమ్మవారిని, శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో తలపెట్టిన సామూహిక వరలక్ష్మి వ్రత పూజలకు అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు. వ్రతం ఆచరించే ఆడపడుచులందరికీ అమ్మవారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు.