Home  »  News  »  ‘వ్యూహం’కు బ్రేక్‌.. జనవరి 11 వరకు సస్పెన్షన్‌లో సెన్సార్‌ సర్టిఫికెట్‌!

Updated : Dec 29, 2023

ఒకప్పుడు సినిమాలతో ఆడుకున్నాడు రామ్‌గోపాల్‌వర్మ, తను చేసే సినిమాలతో సంచలనాలు సృష్టించాడు. ఇప్పుడు అదే సినిమా రామ్‌గోపాల్‌వర్మతో ఆడుకుంటోంది, కాంట్రవర్సీని క్రియేట్‌ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ‘వ్యూహం’ సినిమా వర్మకు మరో షాక్‌ ఇచ్చింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ అవ్వాల్సి ఉండగా సెన్సార్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చివరికి డిసెంబర్‌ 29న రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు ఎనౌన్స్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ కూడా స్టార్ట్‌ చేశారు.  ఇక రిలీజే తరువాయి అనుకుంటున్న టైమ్‌లో కోర్టు బ్రేక్‌ వేసింది. సినిమాను విడుదల చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. సిబిఎఫ్‌సి జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెన్షన్‌లో ఉంచుతూ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జనవరి 11కు వాయిదా వేసింది.  ‘వ్యూహం’కు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పార్టీ జెండాలు, నేతల పేర్లతో చిత్రం తీశారని, ఇది పలు పార్టీల నేతలకు పరువు నష్టం కలిగించేదిగా ఉందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది మురళీధర్‌రావు వాదించారు. నిర్మాత-దర్శకుడి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రిట్‌ పిటిషన్‌ మెయింటెనబుల్‌ కాదు. ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 29(ఏ) ప్రకారం ఈ పిటిషన్‌ వేసే అర్హత పిటిషనర్‌కు లేదు. ఎవరి పరువుకు నష్టం కలుగుతుందని భావిస్తే.. వారే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి.  చిత్రం చూడకుండానే పరువుకు నష్టం వాటిల్లుతుందని.. ఊహించి పిటిషన్‌ వేయడం ఆక్షేపణీయం. గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంపై కొందరు ఇదే హైకోర్టును ఆశ్రయించగా, చిత్రం చూడకుండానే ఆరోపణలు చేయడం సరికాదంటూ పిటిషన్‌ను ద్వి సభ్య ధర్మాసనం కొట్టివేసింది.

తొమ్మిది మందితో కూడిన కమిటీ కూర్చొని చిత్రాన్ని చూసి ఏకగ్రీవంగా సర్టిఫికెట్‌ జారీ చేసింది.  వ్యక్తులను, పార్టీలను కించపరిచే విధంగా ఉంటే సివిల్‌ కోర్టులో వారు పరువు నష్టం దావా వేసుకోవాలి. హైకోర్టులో వేయడం తప్పుబట్టాల్సిన అంశం. పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. అనంతరం సీబీఎఫ్‌సీ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) వాదనలు వినిపిస్తూ.. సినిమాటోగ్రాఫ్‌ చట్టం, ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ మార్గదర్శకాలు, ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం భావ ప్రకటన హక్కును పరిగణనలోకి తీసుకుని రివైజింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా ‘యు’ సర్టిఫికెట్‌ మంజూరు చేసిందని వెల్లడిరచారు. వాదనలు విన్న న్యాయమూర్తి... సీబీ ఎఫ్‌ సి జారీ చేసిన సర్టిఫికెట్‌ను వచ్చే నెల 11 వరకు సస్పెన్షన్‌లో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.