![]() |
![]() |

కన్నడ 'బాహుబలి'గా పేరు తెచ్చుకున్న చిత్రం 'కేజీఎఫ్'. వంద కోట్ల గ్రాస్ రాబట్టడమే గొప్ప విషయంగా భావిస్తున్న కన్నడ పరిశ్రమకు.. వెయ్యి కోట్ల కలకు పునాది వేసిన చిత్రం 'కేజీఎఫ్'. పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టి కన్నడ సినిమాపై పడేలా చేసిన చిత్రం 'కేజీఎఫ్'. ఈ చిత్రం విడుదలై నేటికి ఐదేళ్లు.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ 'కేజీఎఫ్'. ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లు. కన్నడ పరిశ్రమ మార్కెట్ పరంగా అప్పటికది పెద్ద బడ్జెట్. యశ్ కెరీర్ లో అప్పటికి ఒకే ఒక్క రూ.50 కోట్ల గ్రాస్ ఫిల్మ్ ఉంది. అప్పటికి ప్రశాంత్ నీల్ కూడా దర్శకుడిగా 'ఉగ్రం' అనే ఒక్క సినిమానే తీసి ఉన్నాడు. అయితే 'ఉగ్రం'తో మెప్పించిన ప్రశాంత్ నీల్ ప్రతిభ మీద నమ్మకంతో.. 'కేజీఎఫ్' ఏదో మ్యాజిక్ చేస్తుందని కన్నడ సినీ ప్రియులు ఎదురుచూశారు. కానీ బయట పరిశ్రమల్లో ఎలాంటి అంచనాల్లేవు. పెద్దగా అంచల్లేకుండానే 2018, డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'కేజీఎఫ్'. కన్నడతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది.

ఇతర భాషల ప్రేక్షకులకు అప్పటికి యశ్, ప్రశాంత్ నీల్ గురించి తెలియనప్పటికీ.. వారి కలయికలో వచ్చిన 'కేజీఎఫ్'కి కనెక్ట్ అయ్యారు. కోలార్ గోల్డ్ మైన్స్ ను ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ కథను తయారు చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ చూపించిన కేజీఎఫ్ ప్రపంచం, అందులోని పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాకీ భాయ్ గా హీరో యశ్ ఎలివేషన్స్ కి యాక్షన్ ప్రియులు ఫిదా అయ్యారు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. రూ.250 కోట్ల గ్రాస్ రాబట్టి కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా, 'కేజీఎఫ్-2' కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూసేలా చేసింది. అలా కన్నడ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన కేజీఎఫ్ విడుదలై.. నేటికి ఐదు వసంతాలు పూర్తయింది.
![]() |
![]() |