1970ల్లో `దసరా బుల్లోడు`గా సరదాలు పంచిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు.. 1992లో `కాలేజీ బుల్లోడు`గానూ భలేగా ఎంటర్టైన్ చేశారు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శరత్ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామాలో ఏయన్నార్ తో పాటు రాధిక, యమున, హరీశ్, జీనత్, రాజ్ కుమార్, సత్యనారాయణ, బ్రహ్మానందం, బాబూ మోహన్, నర్రా వెంకటేశ్వరరావు, సారథి, కల్పనా రాయ్, వై. విజయ, అత్తిలి లక్ష్మి ముఖ్య పాత్రల్లో అలరించారు. డిస్కో శాంతి ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేశారు.
కథాంశం విషయానికి వస్తే.. పారిశ్రామికవేత్త అయిన గోపాల కృష్ణ (ఏయన్నార్) నిరక్షరాస్యుడు. కొడుకు రాజా (హరీశ్)ని దారిలోకి తెచ్చుకోవడం కోసం 50 ఏళ్ళ ప్రాయంలో కాలేజ్ బాట పడతాడు. ఇంతకీ గోపాల కృష్ణ అనుకున్నది సాధించాడా? లేదా? అన్నది మిగిలిన సినిమా. బి. వెంకట్రావు కథను అందించిన ఈ చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణ స్క్రీన్ ప్లే, సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు.
రాజ్ - కోటి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సాహిత్యమందించారు. ``అందమా ఇలా అందుమా``, ``చమ చమ చమ``, ``ఎంతో మధురం ఈ జీవితం``, ``ర్యాగింగ్ ఆట``, ``ఏమీ హాయిలే`` అంటూ సాగే ఇందులోని గీతాలు రంజింపజేశాయి. శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ పతాకంపై పి. బలరామ్ నిర్మించిన `కాలేజీ బుల్లోడు`.. 1992 జూలై 2న విడుదలై ప్రజాదరణ పొందింది. కాగా, నేటితో ఈ చిత్రం 30 వసంతాలు పూర్తిచేసుకుంది.