![]() |
![]() |

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూన్ 23న సినిమా విడుదల కానుంది. శుక్రవారం రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ''నేను విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు తీశా. నాకు తెలంగాణపై అవగాహన లేదు. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది గురించి విన్నాను. అప్పుడు కొండా మురళి పేరు ప్రత్యేకంగా అనిపించింది. నేను రియలిస్టిక్, రస్టిక్ సినిమాలు తీశా. మురళి, సురేఖ క్యారెక్టర్లు నాకు స్పెషల్ గా అనిపించాయి. అంతకు ముందు అటువంటి పాత్రల గురించి వినలేదు, చదవలేదు, చూడలేదు. వాళ్ళ గురించి తెలిశాక... సినిమా తీయాలని రీసెర్చ్ చేశా. కొండా ఫ్యామిలీని కలిశా. సినిమా తీయాలని అనుకుంటున్నట్టు చెప్పాను. నా తల్లిదండ్రుల కథ కాబట్టి నేనే ప్రొడ్యూస్ చేస్తానని కొండా దంపతుల కుమార్తె సుష్మితా పటేల్ చెప్పారు. నాకు హ్యాపీ అనిపించింది. వాళ్ళ కథ అంటే వాళ్ళ ప్రాపర్టీ కదా! వెంటనే ఓకే చెప్పా'' అని అన్నారు.
కొండా సుష్మితా పటేల్ మాట్లాడుతూ ''సినిమా తీస్తానని రాము గారు మా దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. మా తల్లిదండ్రుల కథ అందరికీ తెలియాలని అనుకున్నాను. అమ్మానాన్న ఇద్దరూ స్టూడెంట్ లీడర్లుగా స్టార్ట్ అయ్యారు. తర్వాత రాడికల్ నేపథ్యం వైపు ఆకర్షితులు అయ్యారు. రాజకీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎదగాలని నాన్న చాలా తాపత్రయపడ్డారు. కొండా మురళి, కొండా సురేఖ ప్రస్థానం అంత ఈజీ కాదు. చాలా ఒడిదుడుకులతో, పెత్తందార్ల చేతుల్లో నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయారు. బంతి ఎంత కిందకు కొడితే, అంత పైకి వస్తుందన్న రీతిలో.... సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర నేతగా ఎదిగారు. ఇవన్నీ జనాలకు తెలియాలి. నా చిన్నతనం నుంచి రాము గారు నా ఫెవరేట్ డైరెక్టర్. ఆయనతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఆయనకు థాంక్యూ'' అని చెప్పారు.
త్రిగుణ్ మాట్లాడుతూ ''కొండా మురళిగారి పాత్రలో... నేను ఇలా కనిపిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇటువంటి యాక్షన్ రోల్ చేస్తానని అసలు ఊహించలేదు. అయితే, రొమాంటిక్ సినిమాలు కాకుండా యాక్షన్ ఫిలిమ్స్ చేయాలని నా ఫస్ట్ హీరోయిన్ జెనీలియా చెప్పింది. ఆమె విజన్ ఈ రోజు నిజం అయ్యింది. నా పేరు, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్... రాము గారు చాలా మార్పించారు. నేను హైదరాబాదులో పెరిగా. వరంగల్ రాజకీయాలు, అక్కడి పరిస్థితుల గురించి తెలియదు. రాము గారు కథ చెప్పినప్పుడు అక్కడికి వెళ్లి చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. కొండా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే... అందరూ బావుండాలని కోరుకుంటారు. అందరూ ఒక్కటేనని భావిస్తారు. ఆ ఆలోచన కోసమైనా వాళ్ళు బావుంటారు. జూన్ 23న సినిమా వస్తుంది. థియేటర్లలో చూడండి.'' అని అన్నారు.
ఇర్రా మోర్ మాట్లాడుతూ "సురేఖ గారి పాత్రలో నేను నటించగలనని నమ్మిన రామ్ గోపాల్ వర్మ గారికి థాంక్స్. కొండా ఫ్యామిలీ సభ్యులకు థాంక్స్. మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు సినిమా చూసి తమ తమ అభిప్రాయం చెబుతారని ఆశిస్తున్నా'' అని అన్నారు.
![]() |
![]() |