![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జై భీమ్'. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 2న విడులై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే మరోవైపు ఈ సినిమాని వివాదాలు చుట్టుముడుతున్నాయి. తమ వర్గాన్ని అవమానించారంటూ కొందరు మూవీ టీమ్ పై బెదిరింపులకు దిగుతూ రాజకీయాలకు తెరదీస్తున్నారు. ఈ క్రమంలో 'సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్' సూర్యకు మద్దతుగా నిలిచింది.
'జై భీమ్' సినిమా విషయంలో పీఎంకే నేత, మాజీ మంత్రి అన్బుమణి రామ్ దాస్ వ్యవహరిస్తున్న తీరుని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తప్పుబట్టారు. "జై భీమ్ సినిమాలో ఉపయోగించిన వన్నియార్ కమ్యూనిటీ లోగోని తొలిగించాలని రామ్ దాస్ డిమాండ్ చేశారు. నిజానికి తొలగించాల్సిన అవసరంలేదు. సినిమా సెన్సార్ అయ్యే వచ్చింది. కానీ సూర్య వివాదం ఎందుకని ఆ లోగోని తొలగించారు. అంతేకాదు ఏ వర్గాన్ని అవమానించే ఉద్దేశం తమకి లేదని చెప్పారు. లోగో తొలగించినప్పటికీ.. సూర్య వన్నియార్ కమ్యూనిటీ మొత్తానికి క్షమాపణ చెప్పాలంటూ రామ్ దాస్ కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకొచ్చారు. అసలు సూర్య క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఆయన ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు" అని కాట్రగడ్డ అన్నారు.
రామ్ దాస్ మేధావి అని, కానీ ఆయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థంకావట్లేదని కాట్రగడ్డ అసహానం వ్యక్తం చేశారు. సూర్య మనసున్న మనిషి అని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని గుర్తు చేశారు. సూర్య ఏ రాజకీయ దురుద్దేశంతో జై భీమ్ సినిమా తీయలేదని, కేవలం యదార్థ సంఘటనల ఆధారంగా ఆ సినిమా తీసారని కాట్రగడ్డ అన్నారు. ప్రపంచమంతా ప్రశంసిస్తున్న ఈ సినిమాపై వివాదం చేయడం కరెక్ట్ కాదని, ఇకనైనా ఈ వివాదానికి ముగింపు పలకాలని కాట్రగడ్డ హితవు పలికారు.
![]() |
![]() |