యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్రేక్షకులకు బాహుబలి గుర్తొస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి తీసిన యుద్ధ కావ్యం చూపించిన ప్రభావం అటువంటిది. ప్రభాస్ అంటే బాహుబలి. ఇది ఫిక్స్. ఇందులో మరో సందేహం లేదు. సినిమా వచ్చిన తరువాత ప్రేక్షకులకు అన్నయ్య బాహుబలి అయ్యారు గాని... తనకు మాత్రం చిన్నప్పటినుంచి ప్రభాస్ అన్న బాహుబలి అని రెబల్ స్టార్ కృష్ణం రాజు కుమార్తె సాయి ప్రసీద చెప్పారు. ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నయ్యతో అనుబంధాన్ని ఇలా వివరించారు.
"రక్షా బంధన్ రోజున తప్పకుండా ప్రభాస్ అన్నయ్యను నేను, చెల్లెళ్లు కలుస్తాం. మేమంతా సరదాగా బోలెడన్ని కబుర్లు చెప్పుకొంటాం. మా కుటుంబమంతా ఆహార ప్రియులే. అన్నయ్య మా కోసం బాగ్య నగరంలోని బెస్ట్ రెస్టారెంట్స్ నుంచి బెస్ట్ ఫుడ్స్ తెప్పిస్తారు. బోలెడన్ని గిఫ్ట్స్ ఇస్తారు. ప్రతి ఏడాది అప్పటికీ లేటెస్ట్ ట్రెండ్ లో ఏది ఉంటే దాన్ని బహుమతిగా ఇస్తుంటారు" అని సాయి ప్రసీద తెలిపారు.
ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రానికి సాయి ప్రసీద కూడా ఓ నిర్మాత. తాను చెన్న చిత్ర నిర్మాణం లోకి రావడం వెనుక అన్నయ్య ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె పేర్కొన్నారు.