సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'ను పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ చివరి ఫ్రేమ్ వరకు చూశాడట! ఈ విషయాన్ని అకీరా తల్లి రేణుదేశాయ్ తెలిపారు.
"నెట్ ఫ్లిక్స్ లో నేను, అకీరా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా చూశాం. తన తండ్రి (పవన్ కళ్యాణ్), పెదనాన్న (చిరంజీవి), కజిన్స్ (రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్) కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన పదహారేళ్ల కుర్రాడికి డిఫరెంట్ వేలో తీసిన సెన్సిటివ్ సినిమా నచ్చదని అనుకున్నాను. పది పదిహేను నిమిషాల తరువాత టీవీ రూమ్ నుండి వెళ్ళిపోతాడని అనుకున్నా. కానీ, సినిమాలో వినోదం, చక్కగా తీసిన విధానం అకీరాను కట్టిపడేసింది. లాస్ట్ ఫ్రేమ్ వరకు చూసేలా చేసింది" అని రేణుదేశాయ్ అన్నారు.
మంచి సినిమాకు ప్రేక్షకుల వయసుతో పనిలేదనీ... యువత మాస్ యాక్షన్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు అని అనుకోవడం పొరపాటు అని రేణుదేశాయ్ అభిప్రాయపడ్డారు. "మాస్ యాక్షన్ అంశాలు ఉంటే యువత ఎంజాయ్ చేస్తారనీ, లేకపోతే వాళ్ళు సినిమాలు చూడరని దర్శకులకు చెబుతారు. మంచి సినిమాకు దర్శకుడు వయసుతో పని లేదని నేను నమ్ముతాను. మేం మంచి సినిమాలు తీయాలి. ఏం చూడాలని అనుకుంటున్నారో ఆలోచించే నిర్ణయం ప్రేక్షకులకు ఇవ్వాలి" అని రేణుదేశాయ్ అన్నారు.