టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల ఆక్సిజన్ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న కరోనా బాధితుల కోసం రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సుకుమార్.. ఇప్పుడు తాను చదువుకున్న స్కూల్ కోసం భారీ సహాయం చేశారు.
తాను చదువుకున్న తూర్పుగోదావరి జిల్లా మట్టపర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో తన తండ్రి తిరుపతినాయుడు పేరుతో సుకుమార్ రూ. 18 లక్షలతో భవనం నిర్మించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ తో కలిసి సుకుమార్ దంపతులు ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. తన తండ్రి పేరుతో స్కూలు భవనం నిర్మించి, ప్రారంభించిన క్షణాలు మర్చిపోలేనివంటూ భావోద్వేగానికి గురయ్యారు. మట్టపర్రు గ్రామాభివృద్ధికి ఎలాంటి సాయం కావాలన్నా తాను ఎప్పుడూ ముందుంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప'తో బిజీగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. లాక్ డౌన్ అనంతరం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్.. ఇటీవల సుకుమార్ డెంగ్యూ భారిన పడటంతో వాయిదా పడింది. మూవీ షూటింగ్ తిరిగి సెప్టెంబరులో ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.