సినిమా టైటిల్కు న్యాయం చెయ్యాలని హీరో శర్వానంద్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తోన్న సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. రష్మిక మందన్న నాయికగా నటిస్తోన్న ఈ మూవీలో చెన్నైకు చెందిన నటీమణులు ముగ్గురు.. రాధిక, ఊర్వశి, ఖుష్బూ.. కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ ముగ్గురు చెన్నై తారలతో పాటు సత్యకృష్ణ కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు.
మధ్యాహ్నం లంచ్ను తన ఇంటి నుంచి తెప్పించిన శర్వానంద్.. ఆ వంటకాలను స్వయంగా ఈ ఆడవాళ్లకు వడ్డించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను రాధిక, ఖుష్బూ తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశారు.
"ఒక కొత్త తెలుగు ఫిల్మ్ షూటింగ్ను ప్రారంభించాం. మా హీరో శర్వానంద్ ఇంటి నుంచి తెప్పించిన రుచికరమైన ఫుడ్తో స్టార్ట్ చేయడం కంటే మరింత ఫన్ ఏముంటుంది. అంతేకాదు, నా ఇద్దరు ఫేవరేట్లు రాధిక, ఊర్వశిలతో కలిసి నవ్వులు పంచుకున్నాను." అని తన ఖుష్బూ రాసుకొచ్చారు.
ఆమె ఏ సినిమా సెట్స్పై ఈ ఆనందకర క్షణాలు అనుభవించారో వెల్లడించలేదు కానీ, రాధిక మాత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సెట్స్పై ఇది జరిగినట్లు వెల్లడించారు.
"హీరో శర్వానంద్ ఫుడ్ను తీసుకువచ్చినప్పుడు షూటింగ్స్ ఫన్గా ఉంటాయి. మేమంతా కారవాన్లను వదిలి, అందరం ఒకచోట కూర్చొని ఖుష్బూ, ఊర్వశిలతో కలిసి టైమ్ను ఎంజాయ్ చేశాం." అని ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్లో రాశారు.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, ఆర్సీఎమ్ రాజు ఇతర పాత్రధారులు.