దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్ మృతి చెందారు. ఆరు సంవత్సరాల క్రితం ఒక రోడ్ యాక్సిడెంట్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్నుంచీ నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన ఆయన తిరుపతిలోని తన ఇంట్లో ఆదివారం చివరి శ్వాస విడిచారు. గిరిధర్ వయసు 64 సంవత్సరాలు. గిరిధర్ స్వస్థలం చిత్తూరు జిల్లాలోని ఇరంగారిపల్లె అనే పల్లెటూరు.
సినిమాల మీద పిచ్చితో పాతికేళ్ల వయసులో 1982లో గిరిధర్ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. ఎ. కోదండరామిరెడ్డి, ఈవీవీ సత్యనారాయణ, గుణశేఖర్ లాంటి పేరుపొందిన దర్శకుల దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. పవన్ కల్యాణ్ గుడుంబా శంకర్, అన్నవరం, మహేశ్బాబు 1.. నేనొక్కడినే, అల్లు అర్జున్ వరుడు సినిమాలకు కో డైరెక్టర్గా వ్యవహరించారు.
1999లో వచ్చిన 'శుభముహూర్తం' గిరిధర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. వినోద్ కుమార్ హీరోగా, ఆమని, ఇంద్రజ హీరోయిన్లుగా నటించిన ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.
ఆ తర్వాత నటుడిగా మారిన గిరిధర్ 100% లవ్, ఎక్స్ప్రెస్ రాజా, శ్రీమంతుడు, సర్దార్ గబ్బర్సింగ్ లాంటి సినిమాల్లో నటించారు. గిరిధర్ మృతి పట్ల తెలుగు చిత్రసీమ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.