మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడు కలకంటాడు. అయితే, కొందరికే ఆ స్వప్నం సాకారమవుతుంది. అలా.. కలని నెరవేర్చుకుంటున్న దర్శకుల జాబితాలో కె.ఎస్. రవీంద్ర (బాబీ) కూడా చేరుతున్నాడు. `పవర్` (2014), `జై లవ కుశ` (2017), `వెంకీమామ` (2019) చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బాబీ.. త్వరలో చిరుని డైరెక్ట్ చేయబోతున్నాడు. అది కూడా.. వింటేజ్ మెగాస్టార్ ని జ్ఞప్తి తీసుకొచ్చే విజిల్ వర్తీ ఎలిమెంట్స్ ఉన్న మూవీతో. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు బాబీ.
`గ్యాంగ్ లీడర్`, `రౌడీ అల్లుడు`, `ఘరానా మొగుడు` వంటి చిత్రాల్లో తను చిరులో ఏది చూసి విజిల్స్ కొట్టాడో.. సరిగ్గా అలాంటి ఎలివేషన్స్ అన్నీ తమ కాంబినేషన్ మూవీలో ఉంటాయని బాబీ అంటున్నాడు. అంతేకాదు.. ఒక స్టార్ కి, అతని అభిమానిని మధ్య అనుబంధం స్ఫూర్తిగా మెగాస్టార్ తో తను చేయబోయే సినిమా ఉంటుందని తెలిపాడు. అలాగే, దసరా నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని ముక్తాయించాడు.
మరి.. తన అభిమాన కథానాయకుడుతో బాబీ చేస్తున్న ఈ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చనున్నాడు.
అన్నట్టు.. ఆగస్టు 1 బాబీ పుట్టినరోజు. ఈ సందర్భంగానే చిరు కాంబో మూవీ విశేషాలు చెప్పుకొచ్చాడీ టాలెంటెడ్ డైరెక్టర్.