RELATED NEWS
NEWS
డాలస్‌లో గాంధీ మెమోరియల్ దగ్గర ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

 

డాలస్‌లో గాంధీ మెమోరియల్ దగ్గర ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం



 

డాలస్, టెక్సాస్: మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎం.జి.ఎం.ఎన్. టి) ఆధ్వర్యంలో డాలస్ (ఇర్వింగ్) లో ఆదివారం జూన్ 17న జరిగిన “నాల్గవ అంతర్జాతీయ యోగా దినోత్సవ” వేడుకల్లో

300 మందికి పైగా యువతీ, యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి  కాన్సుల్ అశోక్ కుమార్, ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఎం.జి.ఎం.ఎ.న్.టి కార్యదర్శి రావు కల్వల అందరికీ స్వాగతం పలుకుతూ ఈ గాంధీ మెమోరియల్ దగ్గర యోగ దినోత్సవం జరుపుకోవడం ఇది నాల్గవ పర్యాయమని, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో అందరూ ఉత్సాహంగా యోగ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి సహకరించిన భారత కాన్సులేట్ అధికారులకు, ఇర్వింగ్ సిటీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

 



ఎం.జి.ఎం.ఎన్. టి  బోర్డు ఆఫ్ డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్ కార్యవర్గ సభ్యులను అందరికీ పరిచయం చేశారు.

ఎం.జి.ఎం.ఎన్. టి ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ 5,000 సంవత్సరాల క్రితం రిషికేష్ యోగాకు జన్మస్థలం అయ్యిందని, 2014 లో ఐక్యరాజసమితి జూన్ 21 ని యోగా దినోత్సవంగా ప్రకటించడంతో

ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయని తెలిపారు. గాంధీ మహాత్ముడు కూడా యోగాకు, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, ఈ రోజు అదే గాంధీ స్మారక స్థలంలో యోగా దినోత్సవం జరుపుకోవడం సముచితంగా ఉందని అభిప్రాయపడ్డారు.

 



కాన్సుల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్, మహాత్మా గాంధీ మెమోరియల్ డాలస్ తో కలిపి యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజ్య సమితి జూన్ 21 యోగా దినోత్సవాన్ని పాటించడం చారిత్రాత్మక విషయమని, నిత్యం అందరూ యోగా అభ్యసించాలని పేర్కొన్నారు.

 



ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ మాట్లాడుతూ ఈ విశాలమైన థామస్ జెఫెర్సన్ పార్కులో సుందరమైన మహాత్మా గాంధీ మెమోరియల్ ను ఏర్పాటు చేసిన సభ్యులందరకూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్కువ సంఖ్యలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా యోగాలో పాల్గొనడం చూసి సంతోషిస్తున్నాని, సిటీ తరపున ఏ సహాయం చేయడానికైనా ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

ఎం.జి.ఎం.ఎన్.టి   కో-చైర్మన్ కమల్ కౌషల్ యోగా ప్రాముఖ్యాన్ని వివరించి, యోగా శిక్షకుడు విజయ్ మరియు వారి బృందంతో యోగా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించ వలసినదిగా ఆహ్వానించారు.  దాదాపు గంటకు పైగా జరిగిన ఈ యోగా శిక్షణలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

 



ఇదే వేదిక పై ప్రతిష్ఠాత్మకమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో’ ప్రథమ స్థానం సాధించిన కార్తీక్ నెమ్మాని ను, ద్వితీయ స్థానం పొందిన నైన మోడీ, తృతీయ స్థానంలో వచ్చిన అభిజయ్ కొడాలిలను,

వారి తల్లిదండ్రులను, ఈ పిల్లలకు శిక్షణ ఇచ్చిన ‘జియోస్పెల్ అకాడమీ’ నిర్వాహకులు విజయ్ రెడ్డి, గీత మంకులను ఎం.జి.ఎం.ఎన్. టి   ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, ఇతర బోర్డు సభ్యులతో కలసి ఘనంగా సన్మానించారు.

ఎం.జి.ఎం.ఎన్.టి  కోశాధికారి బి. ఎన్. రావు ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన అధికారులకు, కార్యకర్తలకు, మీడియా వారికి, బాంబే ఫోటోగ్రఫీ వారికి, మ్యూజిక్ మస్తీ వారికి, హర్యానా సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 



యోగాలో పాల్గొన్న వారందరికీ యోగ్యతా పత్రాలు మరియు అల్పాహారం అందజేశారు. 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;