Previous Page Next Page 
మనసున మనసై పేజి 34


    మనీషాని కూడా అమెరికా పంపి చదివించాలని అనుకున్నాడు గాని ఆమె ఇష్టపడకపోవడంతో డిగ్రీ చేసింది గల గల ఇంగ్లీషు మాట్లాడుతుంది ఫరవాలేదని సర్దిపుచ్చుకున్నాడు.
    ఇద్దరమ్మాయిల తరువాత ఇంటర్ చదువుతున్న కొడుకుని బిజినెస్ మేనేజ్ మెంటు అమెరికా పంపి చదివించాలని ఆయన తపన-ఈ నేపథ్యంలొ చదువుకుని బ్యాంక్ మేనేజర్ అయిన దివాకర్ తనని గౌరవిస్తూ మంచి సలహాలు ఇస్తూ మాట్లాడటం ఆయనకి నచ్చింది. కుటుంబ మిత్రునిగా కలిపేసుకోడానికి ఆయన సందేహించలేదు.
    మనీషా దివాకర్ చనువుగా మాట్లాడుకున్నా అభ్యంతరం తెలపలేదు. కొడుకు ఆషీష్, వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు, షికార్లు తిరిగినా వద్దనలేదు. మనీషాతో వంటరిగా అంటే సందేహించి పంపరని ఆషీష్ తో కూడా మాటలు, స్నేహం కలిపి ఎక్కడికెళ్ళినా అతన్ని తీసుకుని వెళ్ళేవాడు దివాకర్. అతనికి కావాల్సింది మనీషా సాన్నిధ్యంలో ఎక్కువ సేపు గడపడం. ఏకాంతం కోరే సమయం ఇంకా రాలేదు. దానికింకా సమయం పడ్తుందని అతనికి తెలుసు తొందరపడకూడదని ఓపిగ్గా ఎదురు చూసి మనీషా మనసు గెలుచుకోవాలన్నది అతని ధ్యేయం.
    ఇలాంటి పరిస్థితిలో గోపాలకృష్ణ జయంతితో పెళ్ళి ప్రస్తావన తీసుకురావడం అతనికేం రుచించలేదు. మనీషా ఎక్కడ జయంతి ఎక్కడ-ఇద్దరికీ ఏ విషయంలోనూ పోలికే లేదు. మనీషాని చూడక ముందయితే కాస్త ఆలోచించేవాడేమో.
    గోపాలకృష్ణ మాట్లాడిన మర్నాడు జయంతిని కాస్త పరీక్షగా చూశాడు. రంగు చామనఛాయ. హైట్ ఫైవ్ త్రీ - (మనీషా ఫైవ్ ఫైవ్) కళ్ళజోడు-గంజి పెట్టిన బెంగాల్ కాటన్ చీర పొందిగ్గానే కట్టుకున్నా మనీషా వేసే ఖరీదయిన సల్వార్ కుర్తాల ముందు ఆగలేదు. చేతికి రెండు బంగారు గాజులు, మెడలో సన్నగొలుసు, జుత్తుక్లిప్ పెట్టుకుంది.
    మనీషా జుత్తు బాబ్ ఎంత చక్కగా మెడెగరేసి తోసుకుంటుంది. శంకంలాంటి మెడ, అసలా రంగు.... ముట్టుకుంటే మాసిపోయే ఆ రంగు అబ్బే మనతెలుగు వాళ్ళకెక్కడ వస్తుంది. ఆ అమ్మాయి చేతులకి ఆ నాజూకుతనం ఏదో-దూరం నించి చూస్తే ఏదో మొత్తం మీద స్మార్ట్ గానే వుందనిపించినా విడివిడిగా చూస్తే కనుముక్కుతీరుగాని నాజూకుతనం కాని ఏమీ లేవు జయంతికి.
    అద్దాల తలుపులోంచి జయంతిని చూస్తూ మనీషాతో పోల్చుకున్నాడు. ఈ మాత్రం అందానికి పెద్ద గోపాల్ ని తిరస్కరించడమా-ఎందుకో ఆ విషయం. జయంతి పొగరనిపించి రుచించలేదు. పెద్ద ఈవిడేం అనుకుంది తన గురించి. బాగా బుద్దిచెప్పాడు గోపాల్ అనుకున్నాడు.
    అన్ని కలిసి బేరీజు వేసుకుంటే జయంతి నసలు కన్సిడర్ చెయ్యాలనిపించే కేసు కాదని తేల్చుకున్నాడు. ఆ మాటకొస్తే తల్లితండ్రి చూపించిన రెండు మూడు సంబంధాలు అమ్మాయిలు జయంతి కన్నా బాగానే వున్నా తనకి నచ్చలేదనేశాడు.
    ఖర్మ ఎందుకో తెలుగు వాళ్ళలో అట్టే రంగు, పొడవు వున్న అమ్మాయిలే కనపడరు అని విసుక్కున్నాడు మనసులో. ఏమయినా మనసులో మనీషాని పోనివ్వకూడదన్న అభిప్రాయం మరోసారి బలపర్చుకున్నాడు.
    
                                  * * *
    
    దివాకర్ చాలా మారిపోయాడు, తనని అసలు పట్టించుకోడం లేదు. తన ఉనికే గుర్తించని వాడుగా అయిపోయాడని, దానికి కారణం మనీషాతో అతని స్నేహం అన్నది గుర్తించి అసూయతో జయంతి హృదయం మండుతోంది. ఇదివరకు ఏ ఆఫీసు కాగితం, ఏ సందేహం సలహా కావాల్సినా తనని పిలిచి అడిగే వాడు. ఇప్పుడు అటెండరుని పిలిచి ఫైలు తెమ్మంటాడు.
    రోజులో కనీసం ఓ అరగంట అతను ఫోనులో మాట్లాడడం... మాట్లాడుతున్నప్పుడు మొహంలో అతని హావభావాలు తమనించి ఆ మాట్లాడేది మనీషాతో అని అర్ధమై జయంతి మొహం ముడుచుకుపోయేది.
    ఆ రోజు ఇంట్లో గోపాలకృష్ణ చేత తన విషయం మాట్లాడించి సంబంధం ఫిక్స్  చేయిస్తామని అందరూ అనుకున్నారు. తరువాత ఏమయిందో ఎవరూ తనతో ఏం చెప్పకపోవడంతో మరీ అసహనంగా ఉక్రోషంగా వుంది. ఎవరినడగాలి.
    తనంతట తాను అక్కయ్యనిగాని, దమయంతిని గాని ఎలా అడగగలదు. అసలు గోపాలకృష్ణ అడిగాడో లేదో-ఉత్త మాటలే అన్నీ-అతనిమీద కోపం తెచ్చుకుంది. మొత్తం మీద జయంతికి చాలా అసహనం. అసంతృప్తి మధ్య చిరాగ్గా వుంది.
    వంటరితనం ఆమెని చుట్టుముట్టి అదోరకం నిరాశ నిస్పృహలకి గురి చేస్తోంది గాని అహం అడ్డువస్తుంది.
    తల్లి తండ్రి తనని గట్టిగా రమ్మని అడగకపోవడంతో అభిమానం అడ్డువస్తోంది. ఆఫీసులో వున్నంతసేపు దివాకర్ తనని పట్టించుకోవడం లేదన్న ఉక్రోషం ఇంట్లో వంటరితనం జయంతి శాంతిని హరిస్తోంది.
    దానికి తగ్గట్టు మరో రెండు రోజుల తరువాత జరిగిన సంఘటన జయంతి అహాన్ని బాగా దెబ్బతీసింది. ఆ రోజు పదకొండున్నరవేళ మనీషా ఇంకో అమ్మాయితో కల్సి బ్యాంకుకి వచ్చి తిన్నగా మేనేజరు కేబిన్ లోకి వెళ్ళింది. ఆమెతో పాటు మంచి సుగంధం అంతటా వ్యాపించింది. అంతే కుతూహలంగా చూశారు. గదిలో దివాకర్ అట్టహాసంగా వాళ్ళని ఆహ్వానించడం, హడావిడిగా ఆర్భాటంగా కూల్ డ్రింకులు ఆఫర్ చేయడం, వాళ్ళిచ్చిన కాగితాలు చూడడం, గాజు తలుపులోంచి జయంతి గమనించింది.

 Previous Page Next Page