Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 24

    అవును, అతను తనను అన్నలా ప్రేమిస్తాడు. అన్న చెల్లెల్ను ప్రేమించడంలేదూ? తన నెందుకు ప్రేమించడు? మంజరి తల్లి దొరసాని. తన తల్లి దాసిది. అందుకు.
    తనను అన్నలా ప్రేమిస్తాడా? ఎందుకు ప్రేమించడు? ప్రేమిస్తాడు. తానంటే ఎంత దయ అతనికి! ప్రేమించకుంటే? ప్రేమించకున్నా పూజిస్తుందతన్ని దేవునిలా. దేవుడు అందర్నీ ప్రేమిస్తున్నాడా? అయినా, అందరూ దేవుణ్ణి పూజించటంలేదూ? పాణినుండి తండ్రివంటి, అన్న, దేవునివంటి ప్రేమను సంపాదించాలనుకుంది. కోర్కెల్ను బలిచేయాలనుకుంది.
    నిన్నటి రాతిమనిషి నేడు దేవత అయిపోయింది.
    అలా అనుకునేసరికి ఆవిడ మనస్సు తేలికయింది. అంధకారం పటాపంచలై వెన్నెల విరిసింది. ఆమె ఆనందంలో తబ్బిబ్బయింది.
    "పాణి నాకు అన్న" అనుకుంది. "అన్నా" అని అతన్ని కౌగిలించుకోవాలనుకుంది. ఆ ఊహ ఆమెను ఆనందసాగరంలో ఓలలాడించింది.
    ఉరికంబాన్నెక్కే దేశభక్తునిలా ఆవిడ హృదయం గర్వంతో పొంగిపోయింది.
    త్యాగంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లేదేమో!
                                                                     x        x        x
     బొడ్డుమల్లె చెట్టుకింద రాలిన పూలలో కూర్చుని పూలనూ, వాటి కాడల్నూ, వాటి నిర్మాణ వైచిత్రినీ పరిశీలిస్తున్న పాణి "అన్నయ్యా" అనే పిలుపువిని అటుపక్క చూశాడు. ఒళ్ళు జలదరించింది.
    వనజ పూలబుట్ట పట్టుకొని నుంచుంది.
    "నన్నా వనజా" ఆశ్చర్యంగా అడిగాడు.
    "అవునన్నయ్యా!" మళ్ళీ అదే మాట.
    పైట చెరగు నోట్లో పెట్టుకొని పరిగెత్తిన్నాటినుంచీ ఏదోమార్పు కనిపిస్తూంది నవజలో. అది ఈ నాటికిలా పరిణమించిందనుకున్నాడు పాణి.
    "వనజా!"
    పూలు చేత్తో పట్టుకొనే తలెత్తి చూసింది.
    "నేనంటే ప్రేమలేదా?"
    తలూపింది ఉన్నట్లుగా.
    వనజ కళ్ళల్లో నీరు నిలిచింది.
    "నేను నీకు తగినదానినికాను. నువ్వు దేవుడివి. బండవంటి నన్ను మనిషిని చేసినవు. గొడ్డువంటిదాన్కి ప్రేమ చూపినవు. నువ్వే నాకు అన్నవు. దేవుడివి, తండ్రివి.  అటువంటి నీకు మచ్చపడ్డ నా మనసెట్టిద్దును? నా పుటక దరిద్రపుది. నా బతుకు దరిద్రంది.
    "లగ్గమై నెన్క పెన్మిటితోని అత్తోరింటికి పోతాంది మా అవ్వ గీ ఊరునుంచి. దొరోరు గడీ ముంగల కూకొనుంటే ఆడోల్లు ముంగల్నుంచి పోగూడదు. మా అమ్మ పెన్మిటి కెరికెలేక దొర ముంగల్నుంచే ఎల్లి పోయిండు. మా అవ్వ ఆడనే నిలబడ్డది. దొర చూసిండు . మాదార్సాబు నడిగిండు ఎవరిని? తెమ్మంటరా అంటడిగిండు మదార్ సాబ్. దొర లేచి గడీల కొచ్చిండు. పెళ్ళం వస్తలేదని పెన్మిటి చూసిండు. మా అవ్వకాడికి పోయిండు. ఇద్దరు కల్సి ఊరిబైటికెల్లిన్రు. మదర్సాబు ఉరికిండు. పిలిచిండు. దొర పిలుస్తాండు అన్నడు. పెళ్ళం నుండమంటని పెన్మిటి బైలెల్లిండు. 'దొర దాన్నీ పిలుస్తాండు' అన్నడు మదర్సాబు. 'అడమనిషితో నేం పనుంది. నేనొస్తగద' అన్నడు పెన్మిటి. మదర్సాబు నవ్విండు. 'మొగాల్లతో నేంపనిర దొరకు. ఆడోల్లతోటే పని' అన్నడు. మా అవ్వ చెప్పబట్కే ఎరికైంది. దాని పానాలు పైపైన పోయినట్లయిందంటిది. పెన్మిటి మదార్సాబు కాళ్ళమీద పడ్డడు. 'రచ్చించురి, కొత్త పెళ్ళం' అంటని బతిమలాడిండు. 'ఎట్ల పోనిస్తన్రా? దొరకంట్ల పడ్డనక పోతాది ఆడది' అని నడ్వమంటిని ఉరిమిండు మదార్సాబు. అవ్వ ఉరుకు పుచ్చుకున్నది. మదార్సాబు ఉరికిండు, పట్టుకున్నడు. గుంజుకొచ్చిండు. పెన్మిటికూడ వచ్చిండు దొర కాళ్ళమీద పడ్డామని. 'ఈడెందుకొచ్చిండురా. గుంజి పారేయండి' అన్నడు దొర. పాటక్ల (గేటులో) నిలబడి ఏడ్చి ఏడ్చి పోయిండు పెన్మిటి. అవ్వను గుంజ్కపోయిన్రు... మా అవ్వ గడీల్నే ఆడబాపయ్యింది. ఈ దొరే మా అయ్య.
    "చిందొర్సాని కండ్లకి నా కండ్లకు పోలికలున్నయన్నరు. అప్పుడు గిదంత యాదికొచ్చింది. ఏడుపొచ్చింది. గిదింత చెపితే నువ్వు నన్నేమనుకుంటవోనని ఉరికిపోయిన" అని కన్నీరు రాల్చింది. పయిటతో కండ్లు తుడుచుకుంది.
    స్థాణువులా వింటున్నాడు పాణి.
    "ఈ గడీల్నె పెరిగిన. పెద్దదానైన. దొరసాని తమ్ముడు ఇంద్రరెడ్డి కన్నెచెర ఇడిపించిండు. ఆటెనక ఎందరు రెడ్డోరొచ్చిన్రో అందరి అర్రలకి (గదులకు) పోయిన. ఎంతమందికాడికి పోయిననో అన్ని మచ్చలున్నాయి మనసు మీద. నువ్వొచ్చినంక మనిసినని ఎరికైంది. పెన్మిటి ఉండాలనుకున్న. నీమీద మనసైంది. నువ్వు గూడ దయ చూపినవు. నువ్వు నన్ను ప్రేమిస్తాన్నవనుకున్న. అట్లనే తాయారుతనికి పోవద్దన్న, నువ్వు పట్నం పోతే నిద్రపోలేదనుకో! కండ్ల పోలికల్చెప్పిన దినంనుంచి నా కథ తెలుస్తదని నీ కండ్ల బడకుండ తిరిగిన. బాగ ఇశారించిన. దేవునసువంటి నీకు మచ్చపడిన మనసు ఇయ్యొద్దనుకున్న. నీ ప్రేమ లేకుండా బతకలేననుకున్న. నీకు చెల్లెల్నైదమనుకున్న. అన్నా అని కావలించుకోవాల్ననుకున్న" అని కన్నీరు జలజలా రాల్చింది.
    సారంగపాణి కళ్ళు చెమ్మగిల్లాయి.
    'చెల్లీ' అని చేతులు చాచాడు.
    "అన్నా!"
    మండే సారంగపాణి గుండెలకు ఆ పిలుపు పన్నీరయింది.
    "వనజా! నువ్వు మనిషిని కావు, దేవతవు."
    'మా అన్న మంచివాడు' అని కన్నీరు రాల్చింది.
    పాణి భుజం తడిసింది.
                                                13
    చుట్ట కాలుస్తూ పరధ్యానంతో పడుకొని ఉన్న రామారెడ్డిగారు మంజరి తన పక్కన నుంచున్నది గూడా గమనించలేదు, ఆమె పిలిచేదాకా. మంజరి మంచం మీద తండ్రిదగ్గర కూర్చొని 'నాయ్నా! వీణ ఎంత మంచిగ మోగుత దనుకున్నవ్' అన్నది.
    'నీకు మోగించొస్తదా?' ఆశ్చర్యంగా అడిగారు రెడ్డిగారు.
    'ఏలు తీగమీద పెడ్తనా, రాగమొస్తది. ఎంత బాగా వస్తదనుకున్నవ్! రా చూపిస్తా' అని తండ్రి చేయి పట్టుకొని వీణ ఉన్న గదిలోకి లాక్కొనిపోయింది. తాను వీణ ముందు కూర్చొని తన ముందు తండ్రిని కూర్చోమన్నది. ప్రేమతో తీవల్ని కదిలించసాగింది.
    'గ్o గ్o గ్o' అని మ్రోగాయి త్రీవలు. వాటిల్లో స్వరం లేదు. ఐనా, వచ్చీరానీ పాప పలుకుల్లా హృదయానికదో ఆనందాన్నిస్తున్నాయి. వీణ శాస్త్రబద్దంగా పలికిస్తే ఎంత ఆనందంగా ఉండాలి అనుకున్నారు రెడ్డిగారు.
    కొంతసేపు అలా తంత్రుల్ని మ్రోగించి 'నాయ్నా, వీణ చెప్పించవా?' అనడిగింది మంజరి యాచిస్తున్నట్లు.
    'చెప్పిస్తనమ్మా, ఎందుకు చెప్పించను?'
    'ఆ, దినాం అట్లనే అంటున్నవు. రేపట్నుంచి నేర్చుకుంట...'
    ఎవరికీ లొంగని రామారెడ్డికి కూతురు పట్టుబడితే లొంగాల్సి వస్తుందని తెలుసు. 'అట్లనే' అన్నాడు.
    'మా నాయ్న మంచివాడు' అంటూ గంతులేస్తూ వెళ్ళిపోయింది మంజరి. తన కూతురు ఇంకా పదేళ్ళ పిల్లేనా అన్నట్లుగా చూచారు రెడ్డిగారు.
    పాణిని ఇంట్లో ఉంచుకునేటప్పుడు మంజరికి సంగీతం చెప్పించాలనైతే అనుకోలేదు రామారెడ్డిగారు. కాని అతని సంగీతం రాళ్ళను కరిగించేట్లుంది. ఎదుటివాని గుండె కరిగించాలని ఎవరికుండదు? ఆడవారికి ఆ కోర్కె ఎక్కువ. తరువాత మంజరి అనేకసార్లు అడిగింది. 'రేపు' అంటూ దొర్లించేస్తున్నాడు తను. అది గోడమీద రేపని తనకు మాత్రమే తెలుసు కాని, మంజరి ఇప్పుడు గట్టిగా పట్టుబడుతూంది. మంజరి తనకు ఒక్కగానొక్క కూతురు. ఆమె కోరితే గగన కుసుమాన్నయినా తెచ్చియ్యాలి. ప్రస్తుతం ఆమె కోరింది గగనకుసుమమూ కాదు, కుందేటికొమ్మూ కాదు - సంగీతం నేర్చుకోవడం. ఆ కాస్త కోర్కె తీర్చలేడా తాను? కాని.... ఇంతవరకు ఒక్క యువకుని ముఖం సైతం చూడని మంజరి పాణి ముందు కూర్చుని సంగీతం నేర్చుకోవాలి. పాణి అతని మనోఫలకం మీద వెలిశాడు. అతడు అందమయినవాడు. యువకుడు. చురుకయినవాడు. స్త్రీ హృదయం వెన్నలాంటిది. మనసు చంచలమయినది. యౌవనం సహనం లేనిది. ఇంకేవేవో ఇలాంటి ఆలోచనలే వచ్చాయి. బుర్ర వేడెక్కింది. ఇంక ఆలోచించలేకపోయారు. సారంగపాణి గదికి బయలుదేరారు.
    సంగీతం అతనికి టానిక్కులా పనిచేస్తూంది. బుద్దిని చురుకుపరుస్తూంది. లోకాన్ని మరిపించి, మనసును మురిపిస్తూంది.
    'పంతులూ! ఇయ్యాళ కొత్త సంగీతం వినిపించాలి' అంటూ గదిలో అడుగుపెట్టారు.
    మంచం మీద కూచుని ఫిడేలును శ్రుతి పెడుతున్న పాణి కొంచెం తబ్బిబ్బై లేచి నుంచొని నమస్కరించి 'వీణ వాయించమంటారా?' అన్నాడు....
    "వీణా!" అని అడిగారు రెడ్డిగారు. వీణను గురించిన ఆలోచన తన కెందుకు రాలేదో అర్ధం కాలేదు. ఇన్ని రోజుల్నుంచి ఇంట్లో పడివుంటే ఎందుకు వినాలనిపించలేదు తనకు? వీణ ఎలా పలుకుతుందో? ఎంత రసం కనిపిస్తూంధో చూడాలనుకున్నారు.
    'అవును' సారంగపాణి జవాబు.
    'సరే.... వాయించు.'
    ఎంకటి వీణ తెచ్చాడు. పాణి శృతిపెట్టి ఆలపించసాగాడు.  'గ్o గ్o గ్o' అంటూంటే హృదయం వీణ మీటినట్లయింది రెడ్డిగారికి. అమృతం కురుస్తున్నట్టూ వెన్నెల విరుస్తున్నట్లూ అనిపించింది.
    సంగీత జ్ఞానమూ, భక్తివినా, సన్మార్గము కలదే ఓ మనసా

 Previous Page Next Page