నేను చేయాలనుకుంటున్న ప్రయోగానికి ఈ నలుగురు చాలా అవసరం ఫెంటాస్టిక్ కాంబినేషన్. అభిలషణీయమైన కలయిక.
వీళ్ళంతా అనుకోకుండా సెల్వరాజ్ ఏడ్ ద్వారా నాకు ప్రత్యక్షంగా తారసపడటం నా అదృష్టం.
ఇలా కలవకున్నా నేను వారిని రప్పించేవాడిని. యాదృచ్చికం నన్నిప్పుడు అదృష్టవంతుడిని చేసింది.
నేనీ మంత్రి పదవిలో ఎన్నాళ్ళుంటానో నాకే తెలీదు అసలీ పార్టీ ఎన్నాళ్ళు అధికారంలో వుంటుందో కూడా ఎవరూ చెప్పలేరు.
ప్రజలు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారో.....ఏ పార్టీని అధికారంలోకి పంపిస్తారో చెప్పలేము.
కనుక ఎక్కువ కాలయాపన క్షేమం కాదు. ఎవరికోసమో..... ఇంకెవరో వస్తారని ఎదురు చూడటం అవివేకం.
కనుక వీరితోటే ఆ ప్రయోగాన్ని ఆరంభిస్తాను నువ్వేమంటావు?" మంత్రి ఆర్యభట్టు జ్ఞానివేపు చూస్తూ అన్నాడు.
"గుడ్ సెలక్షన్. వాళ్ళు ఖచ్చితంగా ప్రయోగానికి బాగా ఉపయోగపడగలరు. నా ఆలోచనలు సయితం నీ కలలకు దగ్గరగానే వున్నాయి. ముందుగా విమలేం చేస్తాడో చూద్దాం. అతని ఆలోచనలకు మన ఊహలని జోడిద్దాం. అవి కలహించుకోక, కలసిపోయి ఒక ధ్యేయం కోసం, పరిశ్రమిస్తే మన కలలు వాస్తవాలవుతాయి."
* * * * *
"మరో రెండు గంటల్లోపే నీక్కావల్సిన మనుష్యులు దొరికి పోబోతున్నారు. మన స్నేహానికి గుర్తుగా నేనిస్తున్న కానుక ఇది తంబీ" వరదరాజన్ పాన్ నములుతూ అన్నాడు.
అచ్యుత్ కళ్ళలో మెరుపు.....
అయితే సరీగ్గా అదే సమయానికి విమల్, మేఖల ఇచ్చిన టెలిగ్రామ్స్ ని అందుకుని హడావిడిగా బయలుదేరి రైల్వేస్టేషన్ కి వెళ్ళి ఆంద్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ ని కేచ్ చేశారు అభిరామ్, క్రాంతి.
* * * * *
"ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్చగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై, ఇరుకయిన గోడల మధ్య మగ్గిపోదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యంనుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడ అవిరామమైన అన్వేషణ, సంపూర్ణతవేపు చేతులు చాస్తుందో,
ఎక్కడ పరిశుద్ద జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో,
తలపులో, పనిలో నిత్యవిశాల పధాలవైపు, ఎక్కడ మనస్సు పయనిస్తుందో!
ఆ స్వేచ్చా స్వర్గంలోకి తండ్రీ!
నా దేశాన్ని మేల్కొంచేట్టు అనుగ్రహించు"
నూతన శక ఆవిర్భావం కోసం, నూతన ప్రపంచ ఆవిర్భావం కోసం, తన మేధస్సును పణంగా పెట్టి, 'మేనిఫెస్టో'ని తయారు చేసి, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న ఆర్యభట్టు గంభీరమయిన గొంతులోంచి వేదమంత్రాల్లా వినిపించాయి ఆ పంక్తులు.
"మైడియర్ యంగ్ ఫ్రెండ్స్.....ఇవి నా వాక్యాలు కావు.....నాలాంటి తపనతో, విశ్వకవి, ఇండియాలో మొట్టమొదటి నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాధ్ ఠాగూర్ దేశానీకిచ్చిన 'గీతాంజలి' ఇది. ఇదే నా మేనిఫెస్టో.
'న్యూ ఇండియా నిర్మాణం'
NEW INDIA
ఆశ్చర్యపోతున్నారా! అది నా కలని అనుకొంటున్నారా కాదు జాగ్రత్తగా వినండి.
నా ఆత్మ ఆవిష్కరించిన అపురూపమైన వాస్తవాన్ని, ఈ రోజున నేను గర్వంగా, హుందాగా మీ ముందుంచుతున్నాను. ఎందుకంటే నా కలని నిజమ్చేసే 'ఫ్యూచర్ పీపుల్' మీరు. లీవ్....ఇకనుంచీ మీ నలుగురు బృందం పేరు 'ఫ్యూచర్ పీపుల్"
ఒక్కక్షణం ఆగాడు ఆర్యభట్టు. ఆ క్షణంలో ఆయన విశ్వాసాన్ని అమ్మోహితం చేయగలనన్న ధీమాతో వున్న విశ్వ హిప్నటిస్టులా ఉన్నాడు.
ఆయన ఎదురుగా కూర్చున్న-
ఆ నలుగురు-
మేఖల, అభిరామ్, క్రాంతి, విమల్.....
ఆల్ రడీ వాళ్ళు 'న్యూ ఇండియా'లో వున్నారు. ది గ్రేట్ పేట్రియాట్, ది గ్రేట్ ఎకనమిస్ట్, ది గ్రేట్ పిలాసఫర్, ది గ్రేట్ హ్యూమన్ బీయింగ్.
ఆర్యభట్టు ఆత్మశక్తి అది. నిమంత్ర శక్తి కూడా!
ఆర్యభట్టు తన ఉపన్యాసాన్ని కొనసాగించారు.
"కొన్ని వందల శతాబ్దాల చరిత్ర కలిగిన దేశం ఇది. కొన్ని కోట్ల మంది ప్రతీ ఏటా బాధ్యతా లేకుండా పుట్టుకొస్తున్న దేశం. మనది విశాలమైన దేశం, పవిత్ర నదులున్న దేశం. అంగళ్ళలో రత్నాలమ్మిన దేశం. సత్యాగ్రహమనే ఒక ఆయుధంతో బ్రిటీష్ వాళ్ళని తరిమేసిన దేశం.....అయినా పేదరికంతో మగ్గుతున్న దేశం.....కొన్ని గ్రామాలకు బస్సు కూడా వెళ్ళడానికి రోడ్ లు లేని దేశం మనది.....తాగటానికి గుక్కెడు నీళ్ళు కూడా దొరకని దేశం.
ప్రపంచంలో ఏ దేశాన్నయినా తీసుకోండి.....శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆ దేశ కృషి మనకు స్పష్టంగా కన్పిస్తుంది. ఇక్కడ.....ఏదీ అభివృద్ధి....? ఇవాళ మనం వెళుతున్న రైలు మనది కాదు....విమానం మనది కాదు....బస్సు మనది కాదు.... కారు అమ్నది కాదు.....రిక్షా మనది కాదు.....సైకిల్ మనది కాదు.....వార్తలు వినే రేడియో మనది కాదు.....చూసే టెలివిజన్ మనది కాదు.....అన్నీ విదేశీ శాస్త్రజ్ఞులు కనిపెట్టినవే......వాటినన్నిట్నీ ఈ దేశం నుంచి బహిష్కరించి, చూడండి..... ఎలా ఉంటుందీ దేశం...... ఏం మనమేధస్సు కుంటుపడిందా? మన శాస్త్రజ్ఞత ఏమైపోతోంది? అట్టడుగు దేశాలు నిరంతర శ్రమతో ఆకాశమార్గాన ప్రయాణము చేస్తుంటే, అతి విశాల, పురాతన దేశం అధోగతి పాలవుతోంది..... ఎందుకని....? అయినా ఎన్నాళ్ళిలా....?
ఈనాడు మన దేశాన్ని చూసారా! ఒకడు జీవితాంతం తన పొట్టగడపడం కోసమే బతుకుతాడు. ఇంకొకడు జీవితాంతం ఆస్థులు సంపాదించుకోడానికే బతుకుతాడు.....వేరొకడు బతుకంతా తనపదవిని నిలుపుకోవడానికి బతుకుతాడు..... ప్రతి ఒకక్రు ఒక అబ్సెషన్ తో మగ్గిపోతున్నారు.
ఈ దేశాన్ని పది కాలాలు పచ్చగా వుంచడానికి
ఎవ్వడూ బతకడు....
ఒకడు సోమరిపోతులా సంవత్సరాల తరబడి వుండడానికి ఇష్టపడతాడు తప్ప ఒక గంట పని చెయ్యడానికి ఇష్టపడడు. కనీసం ఈ దేశంలో వున్న వాళ్ళల్లో నాలుగవ వంతు మనుషులు ప్రతిరోజూ పన్నెండు గంటల సేపు, ఆరునెలలపాటు కష్టపడితే చాలు లక్ష్యంలో సగభాగాన్ని మనం సాధించడానికి ఆస్కారముంటుంది. ఉన్న తెలివితేటల్ని ఉపయోగిస్తే చాలు మిగతా సగభాగం పూర్తవుతుంది.
నా 'మేనిఫెస్టో' లోని మొదటి అంశం ఇది.
ఇక రెండవ అంశం: కలుషితమైపోతున్న వ్యవస్థను సక్రమ మార్గంలో పెట్టడం- ఒక్కసారి మీరు నడిరోడ్డు మీదకెళ్ళి చూడండి- ఎన్ని దారుణాలు కనిపిస్తాయో.... పట్టపగలు ఒకణ్ని ఒకడు చితక బదుతుమ్తే, అందరూ కళ్ళప్పగించి చూస్తారు. నడి రోడ్డు మీద ఒకణ్ని కత్తులతో పొడిచి చంపేస్తే ఏ ఒక్కడూ కిక్కురుమనడు. కన్యాకుమారి దగ్గర్నించి, కాశ్మీరువరకూ గూండాయిజం పెట్రేగిపోతోంది. ప్రతి నలుగురిలో ఒకడు గూండాగా, ఖూనీకోరుగా, రేపిస్ట్ గా తయారౌతున్నాడు. వ్యక్తిని వ్యక్తి గౌరవించే దశ మారిపోయి, వ్యక్తిని వ్యక్తి 'బలి'చ్చే ఆటవిక దశలోకి వెళుతోందీ సమాజం. నడి రోడ్డు మీద నడిచెళ్ళే స్త్రీలకు ఎలాగూ భద్రత లేకపోగా, ఇంట్లోని గృహిణులకు కూడా భద్రత కరువయ్యే పరిస్థితి ఎదురౌతోంది. ఈ అభద్రతా రాహిత్యానికి కారణం ఏమిటి? సంవత్సరంలో సగం రోజులు బంద్ లకు, ధర్నాలకు, నిరసనలకు పోతాయి. ఒక పార్టీకి చెందిన ఒక బచ్చా కార్యకర్త పోతే బంద్ ఒక రౌడీ ఛస్తే బంద్..... తుమ్మితే బంద్.....దగ్గితే బంద్.... పని దినాలన్నీ బంద్ లుగా మారితే చూస్తూ వూరుకోవటమేనా.....?
పోలీస్ వ్యవస్థగానీ, పొలిటికల్ వ్యవస్థ గానీ, ప్రభుత్వ వ్యవస్థగానీ పటిష్టమైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ప్రజాస్వామ్యం ఎందుకింత నవ్వుల పాలౌతోంది? ధైర్యంగా 'పోలింగ్ బూత్' కెళ్ళి తన స్వేచ్చను ఉపయోగించుకునే 'హక్కు'ను 'కామన్ మేన్' ఎందుకు కోల్పోతున్నాడు. పోలీసులు రాజకీయ నాయకుల చేతుల్లోనూ, రాజకీయ నాయకులు గూండాల చేతుల్లోనూ, గూండాలు 'అండర్ వరల్డ్' దాదాల చెప్పుచేతల్లో నడిచే దుస్థితికి ఈ దేశమెందుకు దిగజారింది? ఈ దేశంలోని 'రౌడీయిజాన్ని' పారద్రోలే రోజు రాదా? ఇదే 'న్యూ ఇండియా' మేనిఫెస్టోలోని రెండవ అంశం.