అది ఒకసారి వెడలగక్కే విషంలో పదోవంతు అయితే ఆరోగ్యకరమైన ఒక బలాద్యున్ని కేవలం రెండు సెకన్లలో చంపేస్తుంది.
అందుకే అది మృత్యువుకు మరో రూపం. దానితో చెలగాటం అసాధ్యం. అందునించి దాన్ని వేరుగా బంధించి ప్రదర్శిస్తున్నాడతడు. దాని విషవాయువు తగలకుండా రెండు గజాల ఇవతలనించి చూచెందుకు చుట్టూ కట్టుదిట్టమయిన ఏర్పాటు చేశాడు. దాన్ని చూచింది వాణి.
"ఓ నాగరాజా! అనల్పమయిన నీ శక్తి మృత్యువుకు మరో పేరు ఏ దురదృష్టవంతుడూ నీ కంట పడకూడదు. నీ జాతి కంట పడకూడదు. నరుల కంట నీవు పడకూడదు" అని చేతులు మోగించింది వాణి.
కార్యకర్తలు ఆమె వంక చిత్రంగా చూచారు. సభా కార్యక్రమాలకు సమయం అతిక్రమించి పోతోందని తొందరించసాగారు.
కార్యకర్తల సూచనల మేరకు పరుగులాంటి నడకతో సభాస్థలికి చేరుకుంది వాణి.
ప్రేక్షకులలో ఒకడుగా చేరిపోయి కూర్చున్న స్వప్న కుమార్ ఆమె కంట పడలేదు.
9
వేదికమీద పెద్దలందరూ ఆశినులైనారు. అధ్యక్షుడు వాణిని వేదిక మీదికి ఆహ్వానించాడు. అప్పటికి వాణి తనను ప్రశ్నలడగవచ్చిన వారికి ఏదో చెప్తోంది.
దూరంనించి స్వప్న ఆ దృశ్యాన్ని కనులవిందుగా చూచుకుంటున్నాడు. అతనిలో పురుష ప్రకృతి తాలూకు కామనలన్నీ జాగృతాలయినాయి. ఆంతర్యపు వాకిళ్ళు తెరుచుకున్నాయి.
పండు వెన్నెలలా పరచుకుంటున్న దీప కాంతుల మధ్య పాము కుబుసంలా మెరుస్తున్న పట్టుచీర కట్టుకుని ఆకాశావీదుల్నించి అప్పుడే దిగివచ్చిన అప్సరసలా కనిపిస్తోంది వాణి. తనను అభిమానించే వారితో మాట్లాడుతున్నప్పుడు తల ఊగించగానే చెవులకు వేలాడుతున్న ఇయర్ డ్రాప్స్ చిత్రంగా ఊగిసలాడుతున్నాయి.
అంతకుమించిన విచిత్రం తన వెనుక సాగుతున్న ప్రాణాపాయమైన స్థితులన్నింటినీ విస్మరించిన ఆమె ముఖముద్ర ఆనంద కేదారాలు వెల్లివిరుస్తున్నాయి. కన్నులు నీలి నక్షత్రాల్లా కాంతి పుంజాలను విరజిమ్ముతున్నాయి.
అధ్యక్షుని ఆహ్వానాన్ని అందుకుని ఆమె వేదికమీడికి వెళ్ళసాగింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు సభకు వచ్చిన సైన్సు విధ్యార్ధినీ విద్యార్ధులు లయబద్ధంగా చప్పట్లుకొట్టటం ప్రారంభించారు.
ఇతఃపూర్వం వాణి రాసిన పరిశోధనా వ్యాసాల్ని సైన్స్ జర్నల్స్ లో చదివిన మేధావులు ఆమెనుచూచి నివ్వెరపోయినారు. అవాక్కయినారు.
అనుభవాలు పండినదానిలా ఎన్నో విషయాలు రాసిన వాణి రెండున్నర పదులయినా నిండని యువతి! వ్యాసాలు చదువుతున్నప్పుడు ఆమె గురించి చేసిన వారి ఊహలన్ని తలకిందులు అయినాయి.
సభకు, వేదికమీది పెద్దలకు నమస్కరించి కుర్చీలో ఒదిగి కూర్చుంది వాణి. ఆమెపక్కనున్నవారు వైజ్ఞానిక లోకంలో హిమగిరిశిఖరాల వంటివారు. విజ్ఞాన సముద్రాలు! సముద్రాల మధ్య ఒదిగిపోతున్న పిల్లకాలువ తాను. అన్ని సాహసాలను ప్రదర్శించిన వాణి అంత సుకుమారంగా వినయ విధేయతలతో ఒదిగిపోతూ కనిపించటం ప్రక్కనున్న మేధావుల్ని అచ్చెరువు పరచింది.
స్వప్న ఏనాడో నిర్నిమేషుడయినాడు. తన ఆరవప్రాణం. తనజీవిత భాగస్వామిని, తన సమార్ధాన్ని పంచుకున్న అర్ధాంగి
ఆ దృశ్యం అతని మనోమయ జగత్తులో మధురపర్వంగా, చిరస్మరణీయమైన అధ్యాయంగా ముద్రితమవుతుంది. కాని ఆ సుకుమారి చుట్టూ క్రమ్మి ఉన్న విషాద మేఘాలు అతని అంతర్లోకాలను విచలితం చేస్తున్నాయి. ఏవో అపశ్రూతులు గుండె గోడల్ని తాకుతున్నాయి. ఆమెను రక్షించలేని నిస్సహాయతకు తమను తామే శపించుకుంటున్నాయి.
ఒకరు వాణి గురించి పరిచయ వాక్యాలు చెప్పారు. ఆ తరువాత కొందరు పొగడ్తలు ప్రారంభించారు. అంతా అయిన తరవాత చివరిసారిగా వాణిని మాట్లాడమని అర్ధించారు.
ఆమె అభిమానులుగా మారిపోయిన విద్యార్దిలోకం మాట్లాడేందుకు వాణి లేవగానే ఒక్కపెట్టున హర్షధ్వానాలు చేశారు.
ఆ దృశ్యం చూచి స్వప్న పులకించిపోయినాడు. అతని శరీరం రోమంచితమయింది. నేత్రాలు చెమరించి అశ్రువులు చెక్కిళ్ళ మీదుగా జారుతున్నాయి. ప్రక్కనున్న వారు అతనివంక విచిత్రంగా చూడసాగారు. తన అజాగ్రత్తకు రవంత సిగ్గుపడి తల దించుకున్నాడు స్వప్న.
తీగలు బిగించిన వీణను మెట్లు సవరించినట్లుగా మాట్లాడుతోంది వాణి.
"ప్రకృతి అనేది మహా శిల్పి అయిన విధాత సృష్టించిన ఒక అద్భుతం. అంతకన్నా అద్భుతమైన మానవ మేధస్సు ఆ రహస్యాలను తెలుసుకోవాలని అనుక్షణం ఆరాటపడుతుంది. అంతర్గతమైన అటువంటి ఆరాటానికి బహిర్గతమైన రూపమే విజ్ఞానశాస్త్రం. ఎందరో మేధావులున్నారు. వీరందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. విద్యార్ధులే తన బిడ్డలుగా, విద్యాబోధన ఒక్కటే జీవిత సర్వస్వంగా భావించిన ప్రొఫెసర్ కృష్ణస్వామి నిర్దేశించిన మార్గంలో నేను పయనించాను.
"ఎన్నో అవాంతరాలు ఎదురు అయినాయి. అవన్నీ అధిగమించి ఈనాటికి ఇలా నిలువ గలిగినానంటే అందుకు నా పరిశోధనల్ని ఆమోదించి, హర్షించి, ప్రోత్సహించిన మీరే కారణం. మీ అందరికీ కృతజ్ఞతలు! అయితే, పరిశోధన అనేదానికి ఒక ముగింపు ఉండదు. శరీరంలో చైతన్యమనేది ఉన్నంత కాలం అది అలా కొనసాగుతూ ఉండవలసిందే.
"ఇందరు మేధావుల మధ్య అల్పజ్ఞురాలనయిన నేను నా వాచాలత్వాన్ని ప్రదర్శించాను. నన్ను మన్నించండి. చాలామంది విద్యార్ధులు, విద్యార్ధినులు తమ సందేహాలను అడగాలని ఎదురు చూస్తున్నారు. మీ ప్రశ్నలు అడిగితే సభాముఖంగా నాకు తెలిసినంతవరకు సమాధానాలు చెప్తాను" అంటూ ముగించింది వాణి.
ఒక విద్యార్ధిని వారి ప్రశ్నలన్నీ సేకరించి వేదిక మీదికి తీసుకువచ్చింది. విద్యాలోకం ప్రతినిధిగా ఆ అమ్మాయి వాణిని ప్రశ్నించసాగింది.
"ఇటువంటి ప్రమాదకరమైన పరిశోధనలు చేయాలని మీరెందుకు నిర్ణయించుకున్నారు?" అందా అమ్మాయి.
మానవ జీవితం మహోన్నతమైన అవకాశం! సృష్టిలోని మిగిలిన ఏ ప్రాణి తన అవసరాలు తీర్చుకుందుకే బతుకుతుంది కాని, తన జీవితానికి ఒక అర్ధాన్ని కల్పించుకోవాలని ప్రయత్నించదు. కాని మనిషి తన జీవితానికి ఒక అర్ధాన్ని కల్పించుకోవాలని ప్రయత్నించగలడు. నేను చేసిన అలాంటి ప్రయత్నమే నా పరిశోధనలు" అని బదులు చెప్పింది వాణి.
"పాములంటే మీకు భయం లేదా?"
"జీవితంమీద దురాశ లేదు."
"తాళపత్రాలలో ఏముందో చదవాలన్న విజ్ఞానకృష్ణ అతని ప్రాణాలను బలిగొంది."
"కుడంగ్ దొరను నాభిమీద కాటు వేశాక కృష్ణ సర్పం ఏమయిందని మీ అభిప్రాయం?"
"విశాల విశ్వాంతరాళంలో అమృతమూర్తిగా ఐక్యతను సాధించుకుంది."
"ప్రొఫెసర్ కృష్ణస్వామి తిరిగి మామూలు మనిషి అవుతారని మీరు అనుకుంటున్నారా?"