గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్త్వైవ పరిదహ్యతే
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః 30
అర్జునుడు అనుచున్నాడు.
కృష్ణా! యుద్దము చేయుటకు సిద్దమైయున్న స్వజనులను చూచుచున్నాను. నా అవయవములన్నియు గడగడలాడుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది. నా దేహపు రోమములు నిక్కబొడిచినవి. గాండీవము చేతినుండి జారుచున్నది. నేను కనీసము నిలువ లేకున్నాను. నా మనస్సు సుడులు తిరుగుచున్నది.
దీపిక:
మానవుడు అనుబంధాల మీదనే జీవించుచున్నాడు. ప్రేమ, అభిమానము, ఆత్మీయత, అనురాగము నరుని ఉత్తమ దశకు చేరుస్తున్నాయి. అనుబంధాలు లేని జీవితము ఎడారి అగుచున్నది. తమవారు, తమ తోడు, తమ నీడ - ఇవియే మానవ జీవితమునకు కాంతిరేఖలు అగుచున్నవి.
కాని, ఎంతటి అనుబంధమైనను, కర్తవ్య పరాయణతను నిరోధించరాదు.
'అతి సర్వత్ర వర్జియేత్'. అతి ఎక్కడనైనా దుష్పరిణామములు కలిగిస్తుంది. అన్నము ఎక్కువ తిన్నా, నీళ్ళు ఎక్కువ తాగినా చెడు ఫలితాలే కలుగుచున్నవి.
అర్జునుడు మహావీరుడు, శూరుడు. శివునితో తలబడినాడు. పాశుపతము సాధించినాడు. అట్టివాడు యింతటి పిరికివాడు అగుట సాధ్యపడని పని. పతఃరాలు యింతటి నీచమునకు దిగజారుట ఏ రచయితా సహించజాలడు.
కాని యీ పిరికితనము, పలాయనవాదము. ఒక మహత్కార్యమునకు ఉపయోగపడినపుడు సమంజసమగును. ఇది కేవలము నేపథ్యము. తెరలేవనున్నది. కృష్ణభగవానుడు, మనవ జాతికి అమృతధారలు అందించనున్నాడు. అట్టియెడ అర్జునుని పిరికితనము క్షంతవ్యమే అగును.
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ!
న చ శ్రేయో - నుపశ్యామి హత్వా స్వజన మహవే 31
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవిన్ద కిం బోగైర్జీవితేనవా 32
ఓ కృష్ణా! నాకు విజయము అక్కర్లేదు. రాజ్యము అక్కర్లేదు. సుఖాలు అక్కర్లేదు. ఇవి అన్ని ఎందుకు, రాజ్యము వినోదము. జీవితము మాత్రము మనకెందుకు.
యేషామర్ధే కాంక్షితం నః రాజ్యం భోగాస్సుఖాని చ
త ఇమే- వస్థితా యుద్దే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ 33
ఆచార్యా పితరః పుత్రాః తథైవ చ పితామహాః
మాతూలాః శ్వశురాః పౌత్రాః శ్యాలా స్సంబంధిన స్తథా 34
ఏతాన్నహన్తు మిచ్చామి ఘ్నతో - పి మధుసూదన!
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకీతే 35
ఎవరి కోసము ఈ రాజ్య కాంక్ష, ఈ ఆనందాలు యీ సుఖాలు, యుద్దమున ధనాలు, ప్రాణాలు పోయిన తర్వాత సాధించునదేమిటి?
ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మామలు, మనుమలు ఇతర బంధువులు యుద్దములో ప్రాణాలు ఒడ్డటానికి, సిద్దముగా యున్నారు.
కృష్ణా! నేను వారిని వధించను. వారు నన్ను వధించినను సరియే! వారినావహించిన ముల్లోకములే అక్కరలేదు. ఈ నేలచెక్క ఎంత?
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్స్యాజ్జనార్ధవ!
పాపమేవాశ్రయే దస్మాన్ హత్వైతా నాతతాయినః 36
జనార్ధనా యీ కౌరవులను చంపి మనము సాధించునది ఏమి? జ్ఞాతులను చంపుట వలన మనకు పాపమే కలుగును గదా!
తస్మాన్నార్హా వయం హన్తుం ఆర్తరాష్ట్రాన్ స్వభాంధవాన్
స్వజనం హి కథం హత్వాసుఖినః స్యౌమ మాధవ 37
మాధవా! ధార్తరాష్ట్రులు మనకు బంధువులు. వారిని వధించుట తగదు. స్వజనులను చంపిన మనకు సుఖమెట్లు కలుగును?
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతనః
కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం 38
వీరిది లోభగుణము. భ్రష్టచిత్తము, కులక్షయము మిత్ర ద్రోహము వలన కలుగు పాపములను తెలియకున్నారు.
కథం న జ్ఞేయ మస్మాభిః పాపాదస్మా న్నివర్తితుమ్
కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్ధన 39
కులక్షయము వల్ల కల్గు దోషము మనకు తెలియును గదా? మనము ఏల దానికి దూరముగా యుండరాదు.
కులక్షయే ప్రణశ్యంతి, కులధర్మా స్సనాతనాః
ధర్మేనష్టేకులం కృత్స్నం అధర్మో- భిభవత్యుత 40
కులక్షయము కలుగుతుంది. అందువలన సనాతన కుల ధర్మాలు నశిస్తాయి. అప్పుడు కులము సాంతము పాపమయమగును.
అధర్మాభిభవాత్ కృష్ణ! ప్రదుష్యంతి కులస్త్రియః
స్త్రీషు దుష్టాసువార్ ష్ణేయ! జాయతే వర్ణ సంకరః 41
కృష్ణా! అధర్మం వ్యాపిస్తుంది.
కులస్త్రీలు పతితలౌతారు.
స్త్రీల దుష్టత్వమువలన వర్ణసంకరము కలుగుతుంది.
సంకరో నరకాయైన కులఘ్నానాం కులస్యచ
పతంతి పితరోష్యేషాంలుప్త పిండోదక క్రియః 42
సంకరము నరకకారణమగుచున్నది. కుల దోషులు, కులము పతితమగుచున్నది. వీరి పితరులకు పిండ ప్రదానము చేయువారుండరు.
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః
ఉత్సాద్యంతే జాతి ధర్మాః కుల ధర్మాశ్చ శాశ్వతాః 43
ఇవి దోషములు. వీటివలన కులవ్యతిరేకులు వర్ణసంకర కారకులగుదురు. శాశ్వతమైన జాతి ధర్మములకు గ్రహణము కలుగును.
ఉత్సన్నకుల ధర్మాణం మనుష్యాణాం జనార్ధన!
నరకే- నియతం వాసఃభవతీ త్యను శుశ్రుమ 44
జనార్దనా! కులధర్మమును కూల్చిన వారికి నరకములో నిరంతర ప్రాప్తి కలుగునని వినుచున్నాము.
అహో బత మహత్పాపం కర్తుం వ్యవస్థితావయమ్
యద్రాజ్య సుఖలోభేనహంతుం స్వజన ముద్యతాః 45
అయ్యో మనము బుద్ధిమంతులమే. మనకు గూడా రాజ్యసుఖ లోభములేనా! స్వజనులను హతమార్చుటకు సిద్దమైయున్నాము. అది ఎంతటి పాపము! ఎంతటి దారుణము!
యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్ర పాణయః
ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ 46
నేను నిరాయుధుడను. ఎదిరింపను. అట్టి నన్ను ఆయుధమును చేబూని ధార్తరాష్ట్రులు యుద్దమున వధించినను నాకు ప్రీతికరమే అగును.
సంజయ ఉవాచ
ఏవ ముక్త్వా - ర్జున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః 47
అర్జునుడు ఆ విధముగా పలికినాడు. ధనుర్బాణములు వదలినాడు రథము వెనుక భాగమున కూలబడ్డాడు. ఏడుపు సాగించినాడు.
దీపిక:
అయ్యా వినండి. అర్జునుడు శ్రీకృష్ణునికి వైరాగ్యమును బోధించుచున్నాడు.
అర్జునుడు శ్రీకృష్ణుని ఎన్నడు తనకంటే పెద్దవానిగా భావించలేదు. సమానునిగా, సఖునిగా, మిత్రునిగా భావించాడు.
అర్జునుడు చెప్పగానే కృష్ణుడు రథమును మరలించి యుద్దము నుండి తప్పిస్తాడు అనుకొన్నాడు. బాలుడు!
ఎవరి స్వభావాలు మహిమలు అవసరమొచ్చినప్పుడే విదితమౌతాయి.
అర్జునుడు తనను ఆచార్యుడుగా పరిగణించుటకు శ్రీకృష్ణుడు పడిన శ్రమ అంతాయింతా కాదు. గురువును సంపాదించుట ఎంత కష్టమో శిష్యుని సంపాదించుటలో కూడా కృష్ణార్జున విషయము విదితమైంది.
ఉభయ సేనా మధ్యమని పూర్వము తెల్సికొన్నాం. అది మానవ జీవితమని యిప్పుడు తెల్సుకొంటున్నాం. యుద్దములో వలె జీవితములో గూడా మంచి చెడుల మధ్య నిరంతర సంఘర్షణ జరుగుతుంటుంది. ఈ సంఘర్షణలో జయాపజయముల గురించి భగవానుడు భగవద్గీతలో బోధించి యున్నాడు.
జీవితము, సత్యము, శివము, సుందరముగా వుండాలని శ్రీమద్భగవద్గీత ఉపదేశము.
భగవద్గీతను అధ్యయనము చేయడము సామాన్య కార్యము మాత్రము కాదు. ఇందులో రామాయణ, భారత, భాగవతముల వలె కథలుండవు. ప్రతిశ్లోకములో జీవితము నగ్నముగా ద్యోతక మవుతుంది.
భగవద్గీతను ప్రత్యక్షము చేసుకొన్నమానవుడు తనలో బ్రహ్మమును, బ్రహ్మలోకమును, దర్శించగల వాడగును. అతను మనవ దశను దాటి దైవ దశకు చేరిన వాడగు చున్నాడు.
ఆత్మవత్సర్వ భూతాని. తన వంటివే సకల భూతములు. తనకు తనను బాధించు కొనువాడు వుండడు. చీమనుండి బ్రహ్మవరకు ప్రాణికి హాని కలిగించనివాడు స్వయముగా బ్రహ్మము అగుచున్నాడు.
గీత ఇవాల్టికి ఎవరికీ పరిపూర్ణముగా దర్శనమివ్వలేదని, నా అభిప్రాయము.
అంశామాత్ర దర్శనముగూడా మహద్దర్శనము అగుచున్నది.
ప్రతిశ్లోకమును, ధ్యానముగా, శ్రద్దగా చదివి అర్ధము చేసుకోవాలి.
అంశామాత్రము ఆశ్రయించినా అతడు మహామహుడు అగుచున్నాడు.
గీత సముద్రము అంతటిది. మనబుద్ధి ద్రోణ ఎంతయో అంతవరకే దర్శనము.
శ్రీకృష్ణభగవానునాకు జయము.
శ్రీమద్భగవద్గీతకు జయము.
అర్జున విషాదమును తొలి అధ్యాయము ముగిసినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః