శిఖండి ఏడ్చినాడు.
యక్షుడు కరిగినాడు.
శిఖండి తన వృత్తాంతమంతయు తెలియజేసినాడు. ప్రస్తుతము కలిగిన ఆపదను వివరించినాడు.
యక్షుడు శిఖండి మాటలు విన్నాడు. బాధ పడినాడు. "శిఖండీ! నీ కథ విచిత్రముగా ఉన్నది. నీ స్త్రీత్వము నాకు ఇమ్ము. నా పురుషత్వము నీవు తీసుకొనుము. నీపని ముగిసిన పిదప పది రోజులకు వచ్చి నా పురుషత్వమును నాకు ఇమ్ము" అన్నాడు. శిఖండిని పురుషుని చేసినాడు. తాను స్త్రీ అయినాడు.
శిఖండి ఎంతో సంతోషించినాడు. స్థూలకర్ణునకు కృతజ్ఞతలు తెలియపరచినాడు. తన ఇంటికి ఆ రాత్రి చేరినాడు. తల్లిదండ్రులకు తన విషయము తెలియపరచినాడు. తాను ప్రస్తుతము పురుష పుంగవుడను అని చెప్పినాడు. ద్రుపద రాజ దంపతులకు ఆపద తప్పినట్లు అయినది. శివదేవుడు చెప్పినది సత్యము అగుచున్నదని గ్రహించినారు. సైన్య సన్నాహములు నిలుపు చేయించినారు. నిద్రపోయినారు.
తెల్లవారినది. ద్రుపదరాజు హేమవర్మకు వార్తను పంపినాడు. ఆహ్వానించినాడు. హేమవర్మ వచ్చినాడు. శిఖండిని చూచినాడు. సంత్రుప్తుడు అయినాడు. కూతురు పంపిన వార్త విని దండెత్తి వచ్చినందులకు సిగ్గుపడినాడు. ద్రుపదునకు క్షమాపణ చెప్పినాడు. సైన్యమును తీసుకుని దశార్ణమునకు వెళ్ళిపోయినాడు.
పదిరోజులు గడచినవి. శిఖండి స్థూలకర్ణుని వద్దకు వెళ్ళినాడు. అతని పురుషత్వమును తీసుకొనవలసినదని కోరినాడు.
"శిఖండీ" స్థూలకర్ణుడు అన్నాడు "ఇక నీ జీవితపర్యంతము నీవు పురుషుడగును, నేను స్త్రీగను ఉండవలసి ఉన్నది. వెళ్ళుము సుఖించుము."
శిఖండికి ఆశ్చర్యము కలిగినది. అందుకు గలకారణము అడిగినాడు. స్థూలకర్ణుడు చెప్పినాడు.
"ఒకనాడు కుబేరుడు వచ్చినాడు. నన్ను పిలిపించినాడు. నేను సిగ్గుపడుచు అతని ముందు నిలిచినాను. అతను నన్ను చూచినాడు. జరిగినది తెలుసుకున్నాడు. "స్థూలకర్ణుడు జీవిత పర్యంతము స్త్రీగానే ఉండుగాక అని శపించినాడు. నేను నీ కథ చెప్పినాను. ఉపకారము చేయుటకే ఇట్లు చేసినానని విన్నవించినాను" అటులయిన శిఖండి జీవిత పర్యంతము స్త్రీగా నుందువు. అటు తరువాత పురుషుడుగానే ఉండిపొమ్ము. నీ లక్ష్యమును సాధింపుము" అన్నాడు.
"స్థూలకర్ణా!" శిఖండి అన్నాడు. "నా వలన నీకు ఈ ఆపద వచ్చినది నేను ఇప్పుడు ప్రాణములు విడుతును. నీవు మరల పురుషుడవు కమ్ము" అన్నాడు.
"శిఖండీ! ఇది దైవ నిర్ణయము. నీ వలన ఒక కార్యము సిద్ధించనున్నది. నేను స్త్రీగా ఉన్నాను సంతోషముగా ఉన్నాను. వెళ్ళుము. నీ కార్యము నెరవేర్చుము" అని శిఖండిని స్థూలకర్ణుడు సాగనంపినాడు.
శిఖండి ఇంటికి వచ్చినాడు. తల్లిదండ్రులతో చెప్పినాడు. శివుని వాక్యము జరిగినదని వారు సంతోషించినారు. ద్రుపదుడు శిఖండిని ద్రోణాచార్యుల వద్దకు పంపినాడు. అక్కడ అతడు అస్త్రవిద్యలు నేర్చినాడు.
ఇది భీష్ముడు దుర్యోధనునకు చెప్పిన కథ. కథ చెప్పి భీష్ముడు అన్నాడు.
"దుర్యోధనా! నేను యుద్దమందు అంగనాపూర్వులను చంపను. స్త్రీలపేర్లు గలవారిని, స్త్రీ వేషధారులను చంపను. నేను అట్టి వ్రతమును పూని ఉన్నాను. కావున అంగనా పూర్వుడు అయిన శిఖండి నామీదకు వచ్చినను నేను బాణము వేయను. చావునకైనను సమ్మతింతును. వ్రతభగ్నుడను అగుటకు సమ్మతింపను".
భీష్ముని మాటలు విన్నాడు దుర్యోధనుడు కొంత చింతించినాడు. అయినాను భీష్ముని వ్రతబద్దతను మనసులో కొనియాడినాడు.
"పితామహా! భీష్మా! పాండవపక్షము నందలి సకల బలములను నిశ్శేషముగా చంపుటకు నీకు ఎంత సమయము పట్టును?" అని దుర్యోధనుడు అడిగినాడు.
"పాండవుల బలములను హతమార్చుటకు నాకు నెల రోజులు పట్టును. కాని నేను పది దినముల పర్యంతము యుద్దము చేతును" అన్నాడు.
దుర్యోధనుడు అడుగగా ద్రోణుడు తనకు నెలరోజులు పట్టునని, కృపాచార్యుడు రెండు నెలలు పట్టునని, అశ్వత్థామ పదిరోజులు చాలునని, కర్ణుడు అయిదు రోజులలోనే అందరిని వధింతునని చెప్పినారు.
కౌరవ సభలో జరిగిన విషయములు చారుల వలన ధర్మరాజు విన్నాడు. భీమార్జునాదులను పిలిపించినాడు. కౌరవసభ సంగతులు చెప్పినాడు. "అర్జునా! భీష్మాదులు దుర్యోధనునకు తమ శక్తులను వివరించినారు. కర్ణుడు అయిదు రోజులలోనే మన సేనను అంతటిని సంహరింతునని ప్రతిన బూనినాడు. కౌరవ సేనను నిశ్శేషముగా చంపుటకు నీకు ఎంత కాలము పట్టునో వివరింపుము" అని అడిగినాడు.
అర్జునుడు అన్న మాట విన్నాడు. దరహాసోల్లాస భాసిత వదనుండు అయినాడు అన్నాడు.
"అనునానంబదియేల నీ మది మదీయ స్ఫారబాహాబలం
బు నిరూపించ దలంచితేని విను మేవుంజేవ యంజూపి కృ
ష్ణుని తోడ్పాటున జేర్చియే గడగినం జూర్ణంబు గావింతు నొ
క్క నిమేషంబున దేవదానవులతో గూడంద్రిలోకంబులన్.
నీవారిక్కడ వారందక్కువవారే? భీమసేనుండు, గవల, అభిమన్యుండు, ద్రౌపదేయులు, సాత్యకి, విరాట, ద్రుపదులు, దృష్టద్యమ్నుడు, శిఖండి, యుత్తవరాజుండు, యుధామన్యుండు, ఘటోత్కచుండు మొదలైన జగజెట్టులున్నవారు. మరియు ననేకులు వీరులు యట్టివారలు కలరు. వారల నందరం జెప్పనేల యేనుంగువోలె నీలావు నీవెరుంగవు. దివిజులకు నజేయుండవు. నీ యొక్కనికి ద్రిభువనంబు నెదురె! నేవు నిక్కంబలుగవు గాక నీవలిగిన నెవ్వరెట్ల య్యెదరోచూదము. నీ సైన్యంబుల నెవ్వరికి నేమి సేయవచ్చు! మనకు విజయానందంబు సులభంబ".
ఆలోచనామృతము
1. అంబ కథ విచిత్రము, విశిష్టము, ఆసిక్తిదాయకమును అయి ఉన్నది. అంబ ఆడది. అయినను ఎక్కడను అబలత్వము కనిపించనీయలేదు. స్థిర సంకల్పమున ఆమె వీరులను సహితము తలదన్నినది.
స్థిర సంకల్పము, కార్యదీక్ష, కార్య తత్పరత ఉన్నచో మానవుడు స్త్రీ అయినను, పురుషుడు అయినను - ఎంతటి కఠినమయిన కార్యమును అయినను సాధించవచ్చును అని నిరోపించినది.
2. ప్రేమించుటకు కారణము చెప్పుట కష్టము కావచ్చును. ద్వేషించుటకు మాత్రము కారణము ఉండవలెను. అంబ భీష్ముని విషయమున పగబూనుటకు సరియైన కారణము కనిపించదు.
1. అంబ సాల్వుని ప్రేమించిన విషయము కాశీరాజునకు కూడా తెలియనట్లున్నది. తెలిసిన అంబ స్వయంవరము ప్రకటించడు.
2. తెలిసి భీష్ముడు అంబను తేలేదు. తెలిసిన తరువాత ఆమెను పంపినాడు.
3. అంబ సాల్వుని ప్రేమించినది. సాల్వుడు అంబను ప్రేమించినట్లులేదు. వరించిపోయిన దానిని వెళ్ళగొట్టినాడు.
4. భీష్ముడు చేసిన తప్పు కనిపించదు. అమ్బది అకారణ వైరముగా కనిపించుచున్నది.
3. అంబ తన పని కొఱకు పరశురాముని ఆశ్రయించినది. పరశురాముడు భీష్ముని పక్షము వినలేదు. ఏకపక్ష నిర్ణయము చేసినాడు. "సత్యము" తెలుసుకొనుటకు ప్రయత్నించలేదు. అకారణ కోపము వహించినాడు. ఆశ్రయించుటకు వచ్చిన వాని మాట మాత్రమే నిజము అని నమ్ముట సక్రమము కాదు.
4. కుంతి వలెనే గంగ ప్రయత్నించినది. తన కొడుకును, భీష్ముని రక్షించదలచినది. మరుజన్మము నందయిన భీష్ముని వధింతును అన్నది అంబ. మరుజన్మ మానవజన్మ రాకుండా నదివై ప్రవహించమని శపించినది గంగ. అంబ తన తపము చేత గంగను ఓడించినది!
5. అంబ ఈ జీవితము ముగియునంత వరకు ఓపిక పట్టలేకపోయినది. చితిలో దూకి జన్మను అంతము చేసుకొన్నది. ఇది అత్యంత సాహసవంతమయిన కార్యము. పని సాధించదలచిన వారు ప్రాణములను సహితము లెక్కచేయరు!