"విస్తళ్ళు వేస్తున్నారు ..... వడ్డించేస్తారు.....లేచి మడిగట్టుకోండి...."
పార్వతమ్మ వెళ్ళింది. శకుంతల గురించి ఆలోచిస్తూ, జగన్నాథంగారు పరధ్యానంలో పడ్డారు.
5
సూర్యనారాయణ తత్వమేమిటో అన్నేళ్ళుగడిచినా జగన్నాథంగారికి అంతుపట్టనివిషయం. ఆయనమాటదేవుడెరుగు. కట్టుకున్న భార్యకే అది అర్ధంగాలేదు. ఎవరైనా చెపితే అసలు వినదన్న సంగతి మాత్రం శకుంతలకి బాగా తెలిసింది.
సూర్యనారాయణ తల తిక్కమనిషి. అతనివన్నీ కాస్త పురాతన భావాలు! ఆడదంటే వంటచేయడానికి, పిల్లల్ని కనడానికే అని అతని అభిప్రాయం. ఇంట్లో సర్వాధికారాలు మగాడివి. భార్య భర్త చెప్పినదానికి ఎదురాడకుండా పడివుండాలి.
అతని తత్వం కాస్తో కూస్తో చదువుకున్న శకుంతలకి సరిపడ లేదు. చక్కగా యిద్దరో ముగ్గురో పిల్లలతో-పరిమిత కుటుంబంతో వచ్చే ఆదాయంతో ఆదర్శప్రాయంగా యిల్లు దిద్దుకుని, పిల్లలని ఆదర్శంగా పెంచి, పెద్ద చదువులు చదివించాలని ఎంతో ఉండేది ఆమెకు. కాని ఏ విషయంలోనూ ఆమెకు భర్త సహాయసహకారాలు లభించలేదు. సూర్యనారాయణ భార్యకి, భార్యమాటలకి ప్రాధాన్యం యీయడం తన మగతనానికి అవమానం అన్నట్లు, అసలు శకుంతల తన అభిప్రాయాలణు, కోరికలను వెల్లడించే అవకాశమే యిచ్చేవాడు గాడు. కాస్త గట్టిగా శకుంతల ఏదన్నా చెప్పబోతే, ఆమె ఎక్కడుండాలో గిరిగీసి ఆమెను హద్దులో పెట్టేవాడు.
తన కోరికలు, ఆశలు, ఆశయాలు తీరేవికావని తెలుసుకుంది శకుంతల-పెళ్ళయిన ఏడాది, రెండేళ్ళలోపునే. అతన్ని మార్చలేక, మారడని తెలుసుకుని తన అదృష్టం యింతేనని సరిపెట్టుకుని, అతనికి అనుగుణంగా కాపురం చెయ్యడం అలవరచుకుంది. తనకు, తన మాటకు అతని దృష్టిలో ఏ విలువా లేదని తెలుసుకున్నాక, పరిస్థితులతో రాజీపడి నిర్లిప్తంగా బ్రతుకుణు ఈడ్చడం నేర్చుకుంది, కాపురం రట్టు చేసుకోడం యిష్టంలేక.
ముగ్గురు పిల్లలు పుట్టిన దగ్గిరనుంచీ మనకు పిల్లలు చాలు అని చెప్పి చెప్పి విసిగిపోయింది శకుంతల. ఏటేటా కానుపులు, ఎబార్షన్ లు, పిల్లలు పుట్టిపోవడంతో రాబడికి మించిన ఖర్చులయి ఆమెకు మనశ్శాంతి కరువైంది. కుటుంబం పెద్దదయింది, కాని రాబడి పెరగలేదు. ఆర్ధికంగా బాధపడుతున్న భర్తను ఆమె మార్చలేకపోయింది. తనమాట చెల్లదని నిట్టూర్చి ఊరుకుంది.
ఆఖరికి ఒకసారి జగన్నాథంగారే కలుగ జేసుకున్నారు. ఆరోపిల్ల కడుపులో ఉండగా, శకుంతల ఆరోగ్యం క్షీణించింది. అప్పటికే ఐదుగురు పిల్లలు, రెండు ఎబార్షన్ లు, ఒక పిల్లవాడు పుట్టిపోవడం జరిగాయి.
ఏదో సందర్భంలో ఇంటికి వచ్చిన అల్లుడితో "శకుంతల ఆరోగ్యం ఏమీ బాగాలేదు. మొన్న లేడీడాక్టరుకు చూపిస్తే 'ఆరుగురు పిల్లలవుతున్నారు....ఇంకా పిల్లలెందుకు? మీ ఆరోగ్యం బాగాలేదు. ఆపరేషన్ చేయించుకోండి. యిద్దరిలో ఎవరో ఒకరు' అంది. "నీకు యిష్టంలేకపోతే అమ్మాయికే చేయించుతాను యీసారి పురిటికి" అన్నారు జగన్నాథంగారు.
సూర్యనారాయణ ఆమాటలకి తనకేదో అవమానం జరిగినట్లు, తనను అవహేళన చేసినట్లు అభిమానపడి ముఖం గంటుపెట్టుకున్నాడు. మామగారు, పెద్దవాడు అన్న ఆలోచన లేకుండా...."నా స్వవిషయాలు నేను చూసుకోగలను.....ఇందులో ఎవరిసలహాలు నాకు అక్కరలేదు" అన్నాడు పెడసరంగా. ఆయనికీ కోపం వచ్చింది. అల్లుడి పెడసరితనానికి.
"నీకు పిల్లనిచ్చాను కనక. అది నాకూతురు కనక చెప్పి చచ్చింది. దాని మంచిచెడ్డలు, దాని బాధ మాకు కాకపోతే ఎవరికి దాని పరిస్థితి చూసి కల్పించుకోవలసి వచ్చింది."
"మీకు కూతురేకాని. నాకు భార్య! దాని సంగతి నాకంటే ఎవరికీ ఎక్కువగాదు. నాపెళ్ళాం సంగతి నేను చూసుకోగలను?" అంటూ రెచ్చిపోయాడు సూర్యనారాయణ.
అసలు సూర్యనారాయణకి మామగారంటే మొదటినుంచీ కాస్త కోపమే. అదోరకం యిన్ ఫీరియారిటీ ఫీలింగు ఉండేది అతనికి. తనకంటే తన కుటుంబం కంటే మామగారు, బావమరుదులు అత్త వారివైపు అందరూ పెద్దపదవుల్లో ఉండడంచేత తనను చిన్న చూపు చూస్తూ అవమానిస్తున్నట్లు అనుకుంటూండేవాడు. అల్లుడి తత్వం, మూర్ఖత్వం నచ్చక జగన్నాథంగా రతనితో ముభావంగా ఉండేవారు. అదిచూసి తనను కించపరుస్తున్నట్లు బాధపడేవాడు సూర్యనారాయణ. అంచేత సాధారణంగా పండగలకి వాటికి ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళేవాడు కాడు అత్తవారింటికి. ఎప్పుడో వెళ్ళినా అక్కడ ఉన్న రెండు పూటలూ ఎవరితో కలవకుండా అల్లుడి హోదా చూపిస్తూ బిర్రబిగుసుకు కూర్చునేవాడు. అంచేత అందరూ సూర్యనారాయణతో కాస్త దూరదూరంగానే ఉండేవారు. అత్తవారింట్లో తనకు అవమానం జరుగుతూందన్న అక్కసు వుండేది సూర్యనారాయణకి. ఆ కోపం శకుంతలమీద చూపించేవాడు, తన అల్లుడి హోదా నిలబెట్టుకోవాలని. ఇప్పుడు అవకాశం వచ్చిందని తన ప్రతాపం చూపించాడు.
అంతా వింటున్న శకుంతల గబగబ యివతలకివచ్చి, తండ్రిని వారించి ఆ వాగ్యుద్దాన్ని ఆపింది.
"మీనాన్నా నాకు సలహాలు చెప్పడమేనా? తనెలా కన్నాడు ఆరుగురు పిల్లల్ని! ఇంకోళ్ళకి నీతులు చెప్పేముందు తన సంగతి ఆలోచించుకోవద్దూ!" అని లోపలికి వెళ్ళాక, శకుంతల దగ్గిర వెక్కిరింపుగా అన్నాడు సూర్యనారాయణ. శకుంతల తిరస్కారంగా భర్త వైపు చూసింది. జవాబు చెపితే ఎదురుతిరిగే పరిస్థితి తెలిసినా జవాబు చెప్పకుండా ఉండలేకపోయింది ఆరోజు. "మానాన్న మీకంటే ముఫ్ఫయ్యేళ్ళు వెనకటివారు. ఆరోజుల్లో ఆయన మీయిబ్బందులు ఎరగరు. ఆయన ఆరుగురు పిల్లల్ని కన్నారంటే, వాళ్ళను రాజాల్లా పెంచగలిగారు. మూడుమేడలు కట్టించారు. ముగ్గురు కొడుకులకి లక్ష రూపాయలాస్తి యిస్తారు! మీరు ఏ ఆసరా చూసుకొని కంటున్నారు యింతమంది పిల్లల్ని? అన్నారంటే ఆయనదా తప్పు!....." ఉద్రేకంగా అంటున్న శకుంతల చెంప ఫెళ్ళుమనిపించాడు సూర్యనారాయణ.