Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 50


    "విఠలస్వామి' యాలయ ముఖమంటపము నందలి శిల్ప సౌందర్యమును మరచిపోలేము. అందలి సోపానపంక్తుల కిరుప్రక్కల , చెక్కబడి యున్న యేనుగులు నిజముగా నెక్కడికో పరుగెత్తుచున్నట్లే యుండెను. మంటప మెంతో విశాలముగానున్నది. మంటపము పైకప్పు సుందర పద్మములతో నయనానందముగనున్నది. అన్నియు నేకాండపు బండలే! అంత పెద్ద బండలు, అంత పయికెట్లు లేపిరో! వెండిగిన్నె యంచువలె సొగగా చెక్కబడి యున్న ఆ చూరురాతి "పనిపసందు" సేభాసనిపించినది. ఆ మంటపములోని ప్రతి స్థంభమును సుందర శిల్ప విభాసితమే! ఒక స్తంభాములోనే సన్నస్తంభము లనేకములు చెక్కబడి యున్నవి. వానిని మ్రోగించి చూచితిమి. ధ్వనులు వేరువేరుగ శ్రవణానందము గావించినవి. సంగీత విద్యావిశారదుఁడైన మా శాస్త్రి యా స్తంభములను పలుమారు మ్రోగించి వాని యందలి స్వరవిశేషములకు మిక్కిలి యక్కజ మందినాడు. ఆ మంటప స్తంభములకు నాలుగు వైపుల నోరు తెరచుకొని, నిలువు కాళ్ళ మీద ముందుకు దూకుతున్నట్లున్న సింహములుం వానిపై వెనుక కాళ్ళ మీద నిలబడి యున్న గుఱ్ఱములు , వానిపై యశ్వికులు - ఆహా! ఎంత మనోహరముగ జిత్రింపబడినవి! ఈసంగీత స్తంభములు తమ అవ్యక్త మధుర కంఠములతో విద్యానగర ప్రభువుల యశోవైభవమును , శిల్పి బ్రహ్మల శిల్ప కళా సంపదను గానము చేయుటలేదు గదా!! ఎంతసేపు చూచినను ఇంకను చూడ వలయుననియే యనిపించినది. వదిలిపోవుటకు కాళ్ళు రాలేదు. అంతటి హృదయకర్షకమైన శిల్ప సౌదర్య మది!!
    చాలాసేపు "విఠలాలయము" లోనే నలుప్రక్కల తిరిగి చూచిన వానినే తృప్తి లేక మరల మరల చూచి యేట్లో రాత్రికి బసకు చేరితిమి. మరురోజు "ఇంభాపురము"నకు పోయి మాల్యవంతమును, అందలి "రఘునాధస్వామి" వారి దేవాలయమును గాంచితిమి. తరువాత "కమలాపురము" న కరిగి యందలి చెరువును, "పట్టాభిరామాలయము"ను జూచితిమి. ఆ సాయంత్రము తుంగభద్రను దాటి "అనెగొంది" దుర్గమును జూచివచ్చితిమి. అందలి "పంపాసరోవరము"ను గాంచితిమి. ఈ పంపాసరోవరము రామాయణములో మిక్కిలి చక్కగా వర్ణింపఁబడినది. ఇచ్చటనే శబరీ శ్రీరామ లక్షణులకు నెంగిలి పండ్లు విందు చేసినదట. ప్రస్తుత మచ్చట నొక గుహ యున్నది. దానిని "శబరి గుహా" యని పిలుచుచున్నారు.
    ఇంకను మేము తిరుగుచున్నప్పుడు మాకు పడిపోయిన కట్టడములు చాలా కనిపించినవి. కొన్నింటిపై వివరణ నామములు వ్రాసియున్నవి. కొన్నిటిపై లేవు. ఈ విధముగా నీ మూడు దినములు తిరిగి హంపీ క్షేత్రమును దర్శించితిమి. అడుగడుగునకు కనిపించు రాతిగుట్టలను గాంచి కన్నుల నీరు పెట్టుకొంటిమి. ఏ సుందరశిల్పము లిట్లు ముక్కలు గొట్టి కుప్పలు వెయఁబడినవో! ఏ లీలాభవనములు, ఏ విలస సౌధము లిట్లు నేలపాలు గావింపఁబడినవో!! ఎవరు చెప్పగలరు?
    రాత్రికి బసచేరీ , భోజనములు గావించి పరుంటిమి. తిరిగి తిరిగి యుండుటచే హాయిగా నిద్దుర పట్టినది.
    "ఆహా! ఇది యేమి! ఎక్కడిదీ మహాపట్టణము! ఎక్కడి దీ మహా నగరము! ఈ విశాల ఘంటాపదము లేమి! ఈ లీలా భవనము లేమి! ఈ విలస సౌదములేమి! ఆహా! ఈరాజ ప్రాసాదము లెంత యెత్తున్నవి!
    సాగర తరంగములవలె నెగురుచు నీ తరంగము లెంత సుందరముగ నడచి వచ్చుచున్నవి'! ఆహా! అన్నియు పంచకల్యాణి పట్టపు గుఱ్ఱములే! "రాజదర్భారు" వైపు పోవుచున్నవి!!!
    ఓహో వీరెవరు?విద్యారణ్యస్వాములా? ఆహా! ఏ మా ముఖవర్చస్సు! ఏ మా ప్రశాంత గంభీర నేత్రములు! విద్యానగర సంస్థాపనాచార్యా! నమస్కారములు!!!
    ఈయన యెవరు! "సంగమ" వంశమణియగు "హరి హర రాయలు" కాబోలు! ఎంత చక్కని విగ్రహము ! అదిగో వీరబుక్కరాయలు! విజయశ్రీ విరాజమాన మగునాయన ఫాలభాగ మెంత విశాలముగా నున్నది! ఎక్కడికో సేనలతోఁ బోవుచున్నాడు.
    అడుగో ప్రౌడదేవరాయులు! ఆ వచ్చుచున్న దేవరు? శ్రీనాధకవి సార్వభౌములా! రాయల సభలో కనకాభిషేకమందుచున్నాడు. గౌడడిండిమ భట్టు కంచుడక్క డామ్మని బ్రద్దమయినది!
    అదిగో! భువన విజయము! అడుగో కృష్ణదేవరాయలు! వారే కాబోలు అష్టదిగ్గజములు! ఆహా! రాయలు గండపెండెరామును తన సొంత చేతులతో "నల్లసాని పెద్దన్న" పాదమున దొడుగుచున్నాడు. ఆంధ్ర కవితాపితామహ! స్వాగతము. ఆ ప్రక్కన కూర్చుండి యున్నది ముక్కుతిమ్మనార్యుడు కాబోలు! అడుగో తిమ్మరుసు మంత్రి! ఎంత వైభవంగా నున్నది! భువన విజయము! అదుగో! వందిమాగధులూ కాబోలు కైవారములు గావించుచున్నారు. "శ్రీమాన్యహారాజాదిరాజ రాజపరమేశ్వర! మూరురాయరగండ! చిన్నమదేవీ......
    అడుగో అర్వీటీ వంశోద్భవుఁడు రామరాయలు . తళ్లికోట యుద్దమునకు తరలిపోవుచున్నాడు . అమ్మయ్యో! వీరెవరు? ఆయుధములు ధరించి విజయనగరముపై గుంపులు గుంపులుగా వచ్చి పడుచున్నారు! అయ్యో! అయ్యో! ఆ సమ్మెటతో సుందర విగ్రహమును బగులగొట్టవద్దు- వద్దు ...."
    నేను నిద్దురలో ప్రక్కనున్న మా "శ్యామును' గట్టిగా పట్టుకొంటిని. వాఁడులికిపడి లేచినాడు.
    వచ్చిన స్వప్నమునంతయు మరల మరల జ్ఞప్తికి దెచ్చుకొని నిట్టుర్పు పుచ్చితిని! ఆహా విజయనగర వైభవ మంతయు నేటికి నొక మనోహర స్వప్నమే యైనదా!!!
    తెల్లవారగనే ,మరల "హోస్పేట" స్టేషనుకు వచ్చి గృహభిఖుల మైతిమి.
    "హంపీ క్షేత్ర" సందర్శనమున నా జీవితములో నొక క్రొత్త యనుభూతి , క్రొత్త యానందము, క్రొత్త మనస్థితి ననుభవించితిని. సువిశాలాంద్రావనికి విజయపతాకమై వెలసి నేడు శోచనీయ దశలో నున్న ఈ జీర్ణ శిధిలపట్టణమును దర్శించి ,మన పురాతన వైభవమును దలంచుకొని, జీవితమును గ్రొత్త యుత్సాహముతో ముందుకు నడిపించుకొనుట ప్రతి యాంద్రుని కర్తవ్యము.

 Previous Page Next Page