Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 49


    ఈ సభాభవనమునకు సమీపమునే "పెద్ద ఱాతి తొట్టి" కలదు. దీని పొడవు పదునైదు గజములు. లోతు గజము దాదాపున్నది. రాయల సందర్శనమునాకు వచ్చిన రాయబారులు, సామంతులు గొనివచ్చు నేనుఁగులు, గుఱ్ఱములు నీరు త్రాగుట కిది యేర్పఱచినారట.
    దీని కొకింత తూర్పుగ "భూగర్భభవన" మున్నది. లోనికిదిగి చూచితిమి. చీకటిగ నున్నది ఇది యెందులకు నిర్మించిరో? రహస్యలోచనా మందిరమేమో! దీనికొక ఫర్లాంగుదూరములో "మహర్నవమి దిబ్బ" యున్నది. ఇది చాల యెత్తుగా నున్నది. దీనికి "జయమందిర" మని నామాంతరము గలదు. పూర్వము విజయదశమి దినములలో రాయలవారు సభచేయు మహామంటపమట యిది. ఆ కాలములో దసరా పండుగ మహోత్సవము లెంత వైభవముగా జరిగెడివో "ఫేయస్" వ్రాసిన యీ క్రింది వ్రాతలు స్పష్టము చేయును. "ఈ యుత్సవములకు రాజ్యములో నుండేడి యాటకత్తియ లందఱు రప్పింపబడుదురు....... ఉత్కలదేశపు రాజగుప్రతాపరుద్రగజపతిని జయించి వచ్చిన తరువాత గట్టబడినది కావున నీ కట్టడమునకు "జయమందిర" మని పేరు...... ఈ జయమందిరము లోపల నొక మంటపమును , ఆ మంటపములో నొక నరవత్న ఖచిత సింహాసనమును, ఇష్టదేవతా విగ్రహమును గలవు. ఈ యుత్సవ దినములలో రా జిక్కడ గూర్చుండి యాటపాటలను వీక్షించుచుండును. తరువాత గుఱ్ఱముల యొక్కయు, నేనుగుల యొక్కయు నూరేగింపు జరుగును."
    ఈ దిబ్బకు వాయువ్యముగ కొంచెము దూరములో నొక "జలక్రీడ మందిర" మున్నది. చాల విశాలముగ , లోతుగనున్నది. దీనిలో పూర్వము విజయనగరపు రాజకుమారులు స్వేచ్చగా నీదులాడుచుండేడివారు కాబోలు! దానికి మూడు ఫర్లాంగుల దూరములో మరియొక "జలక్రీడ మందిరము" గలదు. కాని దీని కట్టుబడి వేరు, ఇది యొక పెద్ద భవనమువలె నున్నది. అంతఃపురాంగనలకు సంబంధించినది వ్రాసియున్న సూచక ఫలకమువలనఁ దెలసికొంటిమి.
    తరువాత "దివాణము" దర్శించితిమి. అంతయు శిధిలమై నేలమట్టమై యున్నది. దానిచుట్టు ప్రత్యేకముగ ప్రాకార మున్నట్లు గనిపించినది. దానిలో రాణివాసములకు మరియొక ప్రాకారమున్నది. ఇందులోనే కాఁబోలు రాయలవారు , రాణుల పూర్వము నివసించినది. వెలుపలి ప్రకారములో రాజబంధువు లుండియుందురు!
    మొదటి ప్రాకారము దాటి లోపలకు పోయితిమి. అచ్చట నొక చక్కని దేవాలయము నయనపర్వము గావించినది. అదియే "హాజర రామచంద్రాలయము" ఇది ప్రత్యేకముగా దివాణము వారి కొరకును రాణివాస స్త్రీల కొరకును గట్టింపఁ బడియుండవచ్చును. "హజార" మనగా 'దివాణము, గనక దీనికీ నామధేయము వచ్చియుండ వచ్చును. విజయనగరములోని యాలయము లన్నియు నొక ఎత్తు, ఇది యొక యేత్తు. గర్భాలయమునకు ముందున్న నల్లని రాతి స్తంభములు సుందర శిల్పకళానిలయములైయున్నవి. దీని యందలి జాతి జాతీయు శిల్ప నైపుణ్యము మరి యేదేవాలయము నందును గనుపట్టదు. గోడలపై మనోహరమైన దృశ్యములు చెక్కినాఁడు శిల్పి. దీని యందలి కళ్యాణమంటపము మిక్కిలి హృదయంగమము. రామాయణ మహాకావ్య మంతయు నిందు శిల్పములోఁ గానుపించు;చున్నది. దేవాలయము చుట్టును "కృష్ణుడు గోపికలు, యోధులు, యుద్దమునకు పోవుట, వేశ్యా నృత్యము , అశ్వికదళము, గజదళము" మొదలగు చక్కని సజీవములైన శిల్ప దృశ్యములు కన్పించుచున్నవి.
    తరువాత "రాణివాసము" ను దర్శించితిమి. ఆ తరువాత వెలుపల నున్న "యేనుగుల "ను గాంచితిమి ఇందు పూర్వము రాయలవారి పట్టపుటేనుగును గట్టివేయువారట. దానికి గొంచెము సమీపములో నున్న "అష్టముఖ జలక్రీడా మందిరము" జూచితిమి. ఆ పిమ్మట "దండనాయకుని యావరణము" "మావటి వాండ్ర భవనము"ను జూచితిమి. తిరిగి బసకు జేరుకొంటిమి.
    మరునాఁడు విరూపాక్ష దేవాలయమునకు సమీపమందున్న "హేమకూటపర్వతము" పై కెక్కిన జైన దేవాలయములు గాంచితిమి. విరూపాక్షలయమున కెదురుగ నున్న "హంపీబజారు' అను పెద్ద వీధిని చూచితిమి. అది రెండు మూడు ఫర్లాంగుల పొడవును, సుమారు నలుబది గజముల వెడల్పును గలదు. ఈ వీధిలో గొప్ప రాధమొకటి యున్నది. ప్రస్తుత మక్కడ ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పూర్ణిమకు గొప్ప రధోత్సవము జరుగును. అప్పుడు లక్షల కొలది ప్రజలు వచ్చి రధోత్సవమును గాంచి శ్రీవిరూపాక్షస్వామిని దర్శించి పోవు చుందురు.
    తరువాత తుంగభద్ర యొడ్డున నున్న "కోదండరామస్వామి" యాలయమును దర్శించితిమి" దేవాలయమునకు దాపుననే సీతాసరోవర మున్నది. తర్వాత "చూళాయి బజారు" (వేశ్యావాటిక) గాంచితిమి. ఈ వీధి ప్రస్తుతము మాగాణియై కర్షకులు సేద్యము చేయుచున్నారు. ఈ వేశ్య వాటికకు వెనుక అచ్యుతరాయ దేవాలయమున్నది.  ఇందలి చెక్కడపు పని మిక్కిలి యందముగా నున్నది వెలుపలి యావరణములో సుందరమైన "కళ్యాణ మంటప" మున్నది.
    తరువాత "వరాహ పెరుమాళ్ళు దేవాలయము"ను "అనంతశయన దేవాలయము"ను జూచితిమి అనంతశయన దేవాలయములో శ్రీ'మహావిష్ణు విగ్రహము ఏకశిలలోఁ జెక్కబడి మిక్కిలి మనోహరముగా నున్నది. తరువాత తుంగభద్రానది కడ్డముగా కట్టబడి యున్న పెద్ద "ఱాతి వంతెన"ను గాంచితిమి. ఇది చాలా పెద్ద వంతెన. దీని వైశాల్యము సుమారు పది పండ్రెండుగులున్నది.
    అక్కడక్కడ నగరములోని రాతి కాలువలు గాంచితిమి ఈ కాలువల నుండియే తుంగభద్రా నదిలోని నీరు నగరములోనికి వచ్చుచుండేడిదట.
    ఆ సాయంత్రము "విఠలలయము"ను సందర్శించితిమి. ఈ దేవాలయము క్రీ.శ. 1513 సంవత్సరమున శ్రీ కృష్ణదేవరాయలచే నిర్మింపబడెను. ఈ యాలయమునందలి శిల్పము చూచి తీరవలయును. విజయనగరమందలి పెద్ద దేవాలయములలో నిదియొకటి. ఈ దేవాలయమునకు తూర్పున, నుత్తరమున, దక్షిణమున మూడు గోపురములున్నవి. అవి శిదిలములై యున్నను వాని యందలి పనిపసందు దర్శని'యముగా నున్నది, ప్రాకారము చుట్టు యాత్రాపరుల కొరకై మంటప పంక్తులు నిర్మింపబడియున్నవి.
    ఇందలి "కళ్యాణ మంటపము" చాలా అందముగా నున్నది. స్తంభములపై దశావతారములు చేక్కబడి యున్నవి. ఇందలి శిల్ప నైపుణ్యము వర్ణనాతీతము.
    ఈ మంటపమునకు నుత్తరమున దేవాలయమున కెదురుగ నొక చిన్న  రాతి రధమున్నది. రాధమంతయు నేకాండపు రాతితో చెక్కబడినది. దానిపై నెక్కుట కోక రాతి నిచ్చెన యున్నది. రధముపై స్తంభములు , పట్టెలు, బొమ్మలు నన్నియు  నచ్చముగా రధమువలెనే చెక్కినారు. ఏ శిల్పిబ్రహ్మ సునిశిత హస్తములతో నీ శిల్పసౌందర్యము చిందిపోయినదో; ఏ కళాకారుని యద్వితీయ ప్రతిభ కిది నిదర్శనమో!

 Previous Page Next Page