మొత్తం విన్నాడు. విని -
"ఇదేదో సీరియస్ వ్యవహారంలా ఉందే" అంటూ సాలోచనగా పర్నేష్ వేపు చూశాడు.
"నేను చెపుతుంటే విన్నారా? డామ్ సీరియస్ సర్! ఈ న్యూస్ ని సీరియల్ గా వేస్తే చాలా బాగుంటుంది. డైలీ సీరియల్ ని ఎంత ఎక్సయిటింగ్ గా రీడర్స్ చదువుతారో అలా చదువుతారు... నాకా నమ్మకం వుంది."
"నీకు నమ్మకం సరే వాళ్ళు నలుగుర్నీ నువ్వు ప్రతి క్షణం వెంటాడాలి. ఇది సాధ్యమా చెప్పు? వాళ్ళు తిరుపతిలోనే వుంటారనే రూలేం లేదుకదా!"
"అవున్సార్! ఏ ఊళ్ళో వుంటారో, ఎక్కడుంటారో? అయినా సరే నా అయిడియాను చెప్తాను వినండి. వాళ్ళ నలుగురి ఊరూ, పేర్లూ ఏమీ యివ్వొద్దు. నెలకోసారి ఈ వార్తను ఇస్తాం. మళ్ళీ జనవరి ఫస్ట్ న మన పేపరు బ్యానర్ ఇదే సర్! అప్పుడు వాళ్ళ ఎనిమిదిమంది ఫోటోలు, వాళ్ళ ఇంటర్వ్యూలు... గొప్పగా వుంటుంది. హ్యూమన్ ఇంటరెస్టు స్టోరీ సక్సెస్ అయినా అక్కడేకదా సార్!"
"నిజమేనంటావా?"
"నన్నెంకరేజ్ చెయ్యండి సర్! రీడర్స్ గనక దీనిని ఫాలో కాకపోతే మధ్యలోనే డిస్ కంటిన్యూ చేసేద్దాం."
రెండు నిమిషాలు ఆలోచనలో పడ్డాడు రెసిడెంట్ ఎడిటర్.
"నువ్వా పార్టు టైం రిపోర్టర్ వి, వీళ్ళ వెనక తిరగడానికి నీకు టి.ఎ.బిల్లే తడిసి మోపెడంత అయితే మేనేజ్ మెంట్ ఆబ్జక్ట్ చేస్తుందయ్యా."
"ఈ న్యూస్ హిట్టవుతుంది సర్! మేనేజ్ మెంట్ నేనెంత టి.ఎ. అడిగితే అంత యిస్తుంది చూడండి సర్!" చాలా కాన్ఫిడెంట్ గా అన్నాడు పర్నేష్.
"అయితే ఇప్పుడు వార్త ఇస్తానంటావ్?"
తలూపాడు పర్నేష్.
"అయితే రాయి టైమయిపోతోంది" రెసిడెంట్ ఎడిటర్ ఆ మాట అనగానే ఎక్కడలేని ఉత్సాహంవచ్చింది పర్నేష్ కి గబగబా ఆ గదిలోంచి బయటకొచ్చేసి, ఎడిటోరియల్ డస్క్ లోని ఓ సీట్లో కూర్చున్నాడు.
ఆ వార్తని రాయడానికి గంట పట్టింది. సంత్రుపతిగా చూసుకుని రెసిడెంట్ ఎడిటర్ గదిలో కెళ్ళాడు.
రెసిడెంట్ వార్తను అందుకుని, గబగబా చదివి ఒకసారి పర్నేష్ వేపు చూసి "బాగా రాసావ్ హెడ్డింగ్ మంచిది పెట్టావ్" అంటూ బెల్ కొట్టి బాయ్ ని పిల్సిహి కంపోజింగ్ సెక్షన్లో ఇమ్మని ఇచ్చాడు.
ఇప్పుడు రిలాక్సడ్ గా వున్నాడు పర్నేష్.
"అయిపోయింది గదా ఇప్పుడో జోకు చెప్పవోయ్" అని అనగానే గుండెలు బాదుకున్నాడు పర్నేష్.
"అర్ధరాత్రిపూట జోకులేమిటి సర్! ఉండండి ఆ వార్త లేఅవుట్ పెట్టించొస్తాను" ఆయన బారినుండి తప్పించుకుని గదిలోంచి బయటి కొచ్చి లే అవుట్ సెక్షన్ వేపు పరుగెత్తాడు.
* * * * *
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నలుగురు యూనివర్సిటీ అమ్మాయిల అద్భుత ప్రయోగం.
తిరుపతి, జనవరి 1 (తెలుగు న్యూస్) :
ప్రతి మగాడి అభివృద్ధి వెనుక ఒక స్త్రీ వుంటుందన్న మాట ప్రపంచవిదితం. దీనికి ఎన్నెన్నో ఉదాహరణలు మనకు చరిత్రలో కనిపిస్తాయి. ఎంతో మంది శాస్త్రజ్ఞుల పరిశోధనల వెనక, ఎంతో మంది దేశనాయకుల ప్రణాళికల వెనక, ఎంతోమంది వైతాళికుల అద్బుతకృషి వెనుక, ఎంతోమంది ఆధ్యాత్మిక వేత్తలు, మహావ్యక్తుల ఆచరణల వెనుక పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఒక స్త్రీ ప్రోత్సాహం, ఒక స్త్రీ ఆలోచన, ఒక స్త్రీ మార్గదర్సకత్వం వుంటుందనే విషయం సర్వసాధారణ గొప్ప విషయం.
ఆయా వ్యక్తులు ప్రపంచంలో గుర్తింపు పొందాక, ఆ గుర్తింపు వెనకనున్న స్త్రీల విషయం తెలియడం యిప్పటివరకూ జరుగుతున్న సంగతి కానీ యిందుకు భిన్నంగా ఆంద్రప్రదేశ్ లోని తిరుపతి యూనివర్శిటీకి చెందిన నలుగురు అమ్మాయిలు ఒక రహస్య ప్రయోగానికి సకల్పించడం, అందుకు చిత్తశుద్దితో ఆచరణకు పూనుకోవడం మా విలేఖరి దృష్టికొచ్చింది.
అపరిచితులు, భిన్న, భిన్న మనస్థత్వాలకు చెందిన నలుగురు దారితప్పిన యువకులను ఎంచుకుని వారిని ఒక ఏడాదిలోగా సమాజానికి పనికివచ్చే అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతామని ఆ నలుగురు అమ్మాయిలు సంకల్పించడం విచిత్రం. ఆ నలుగురు కుర్రవాళ్ళని ఆధునిక స్వయంవరం ద్వారా తిరుమల కొండమీద ఎన్నిక చేసుకున్న విషయం కూడా మా దృష్టికొచ్చింది.
నిజంగా ఆ అమ్మాయిలు తమ ప్రయోగాన్ని సఫలీకృతం చేసుకుంటారా? ప్రపంచ మహిళాలోకానికే ఒక ఆదర్శంగా నిలిచే ఈ ప్రయోగం చేపట్టడానికి అసలు కారణం ఏమిటి?
ఇంతకీ ఎవరా అమ్మాయిలు? వారెంచుకున్న అబ్బాయిలు ఎవరు? ఎలాంటివారు?
డియర్ రీడర్స్!
మీరే ఆ అమ్మాయిలైతే మీరేం చేస్తారు? మీ అభిప్రాయాలకు పంపించండి.
ఉత్తమమైన అభిపరయల్ని ప్రచురించి బహుమతులు కూడా ఇస్తాం. ఈ శీర్షికను స్పాన్సర్ చేసేందుకు కొన్ని కంపెనీలు అప్పుడే ముందుకు వచ్చాయి. ఈ సదవకాశాన్ని మా పాఠకులు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.
మా దినపత్రికలో ఒక సంవత్సరంపాటు ప్రతీనెలా ఒకటవ తేదీన ఈ నలుగురు అమ్మాయిల వార్తను ప్రచురిస్తామని, వచ్చే ఏడాది ఒకటవ తేదీన ఆ అమ్మాయిలు, అబబాయిల పూర్తి వివరాలు, ఫోటోలతో సహా ప్రచురిస్తామని మనవి చేస్తున్నాం?
ఆ నలుగురు అమ్మాయిలు ఎవరెవరు ఏ మేరకు విజయం సాధించారో వాళ్ళ అనుభవాల్ని ఇంటర్వ్యూ రూపంలో నూతన సంవత్సర కానుకగా అందజేస్తాం.
మళ్ళీ మరిన్ని వివరాలు ఫిబ్రవరి ఒకటో తేదీ సంచికలో.
అంతవరకూ శెలవ్.
'ఆంద్రవార్త' దినపత్రిక మొదటి పేజీలో 'త్రిబుల్ కాలమ్' లో వచ్చిన ఆ వార్త రాష్ట్రంలో విపరీతమైన సంచలనం సృష్టించింది.
ముఖ్యంగా మహిళలు, మహిళా సంఘాలు, యువతులు, కాలేజీ, యూనివర్సిటీ అమ్మాయిలు ఆయా సెంటర్లలో వున్నా ఆ దినపత్రిక కార్యాలయాలకు ఫోన్ చేయడం ప్రారంభించారు.
మూడు రోజుల కాలపరిమితిలో 'ఆంధ్రావార్త' యూనిట్ ల కార్యాలయాలకు ఆ అమ్మాయిల వివరాల కోసం వచ్చే ఫోన్లు ఎక్కువకావడం, ఆ అమ్మాయిల గురించి ఏరోజు ఏ వార్త వేస్తారోనన్న ఉత్సాహం పెరగడంతో-
ఆంద్రవార్త సర్క్యులేషన్ కూడా అంచెలంచెలుగా పెరగసాగింది. ఈ అమ్మాయిల 'ఇన్ ఫర్ మేషన్ సెల్' ను ప్రారంభించారు.
తను అనుకున్నట్టుగానే ఈ వార్త సంచలనం సృష్టించడంతో పర్నేష్ అనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది.
తన ఇమేజ్ మేనేజ్ మెంట్ లెవెల్లో ఇంకా పెరగడంతో రెసిడెంట్ ఎడిటర్ కనబడిన ప్రతివాడినీ కొత్త జోకులు చెప్పమని వెంటపడడం ప్రారంభించాడు.
ఇదిలా వుండగా-