Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 29
అనంతరము హిమవత్పర్వతము జేరి తత్ర్పాంత దేశాధీశ్వరుల నెల్ల జయించి ధనకనక వాహనాదులు గాన్కగా నందుకొని, క్రమ క్రమముగా బూర్వ దక్షిణ దేశములపై దాడివెడలి వంగ మగధాది దేశాధిపతుల వశపరచుకొని, విదర్భచేది దేశేశ్వరులను నరిగాపులఁ గావించుకొని, పాండ్య కేరళ దేశనాయకుల స్వాధీన మొనర్చుకొని, యవంతీశ్వరుని సామంతునిచేసికొని వారి వారినుండి కప్పములను గైకొనెను. అటుపిమ్మట పశ్చిమ దిగ్విజయ యాత్ర కారంభించి మాళవ యవన దేశాధిపతుల గెలిచి వారి నుండి కానుకల గ్రహించెను.
ఇట్లు నలుదెసలనుండి యవనీపతుల లోఁబఱచుకొని అసంఖ్యాకములగు కానుకలను సేకరించి హస్తినాపురమునకు దిగ్విజయమునకు మిక్కిలి మెచ్చుకొని చేరిన కర్ణుని యుచిత బహుమానములచే రారాజతని నలంకరించెను. కర్ణుఁడును తనచే జయింపఁబడిన సమస్త భూమిని దుర్యోధనునకు బహూకరించి గాంధారీ ధృతరాష్ట్రులకు నమస్కరించి వారి మన్ననల నందుకొని దుర్యోధనునిచేఁ బాండవులు చేసిన రాజసూయమును మించిన వైష్ణవమను మహాయజ్ఞమును జేయించెను.
ఇట్లు దుర్యోధనుఁడు దిగంత విశ్రాంత యశోవంతుఁ డగు రాధేయుని సాహాయ్యమున రారాజై రాజ్యమును మహావైభవముతోఁ బరిపాలించు చుండెను. జగద్విఖ్యాతములైన రాధేయుని శస్త్రాస్త్ర విద్యానైపుణ్యమును, నసమాన వదాన్యతా వైభవమును, సహజ కవచకుండల మహిమా విశేషంబును దమకు హృదయశల్యంబులై బాధింప ధర్మరాజాదులైన పాండవులు "వనవాసాజ్ఞాత వాసానంతరమున కర్ణునెట్లు జయింతుమా" యని భీతమనస్కులగు చుండిరి. అర్జునుఁడు కర్ణుని జయింపఁగలడా యనియు వానిమేన వజ్రకవచ ముండునంతవరకు దివ్యతేజస్సంపన్నుఁడగు నాతఁ డజేయుఁ డనియుఁ దలంచుచుండరి. దేవతల ప్రభువైన యింద్రుఁడు నిజాంశసంభూతుఁడగు పార్థునియందుఁ బక్షపాతము గలవాఁ డగుటచే నెట్లయిన కర్ణుని కవచకుండలము లపహరించి పాండవులకుఁ బ్రియంబాచరింప వాంఛించుచుండెను.
4
ఒకానొక దినమునఁ బ్రభాకర నందనుఁడు నిజప్రాసా దాంగణము నందలి లతామండపమున నాసీనుఁడై సూర్యోపాసన చేయుచుండెను. అంతలో సేవకు డొకఁడు వచ్చి "ప్రభూ! ద్వారమున బ్రాహ్మణుఁ డొకఁడు తమ సందర్శనార్థమై నిరీక్షించు చున్నాఁ"డని విన్నవించుకొనెను. రాధేయుఁడు బ్రాహ్మణశబ్ద మాకర్ణించినంతనేభక్తి పరవశుఁడైలోనికిఁ బ్రవేశపెట్టుమని ద్వారాపాలకున కాజ్ఞ యిచ్చెను. కొలదిసేపున కొక మహీసురుఁడు కర్ణుని సమ్ముఖమ్మునకు వచ్చి నిలిచెను. వాని ముఖములో సందేహమును కన్నులలోఁ జంచలత్వమును గనిపించుచుండెను. రుద్రాక్ష మాలా విభూషిత కంధరుండును, గంగాజల పూర్ణ కమండలు హస్తుండను, భుజావలంబి ధవళ యజ్ఞోపవీతుండు నగునవ్విప్రునింగని రాధేయుఁడు భక్తిపూర్వకముగా నమస్కరించి "స్వామీ! దయచేయుఁడు" అని యాసనము జూపించెను. ఆకుహనామహీదేవుఁడును గూర్చుండ నొల్లక హస్తముల సాచి "భిక్షాందేహి" యని మిన్నకుండెను. దానవీరుఁడగు కర్ణుఁడు "మహానుభావా! ఏమికావలయునో తెలుపుదు లలితలీలా విలాస సమేతలగు లలనామణులా! సమస్త వస్తుభరితములైన గ్రామములా సువర్ణ మణిభూషణ భూషితములైన గోబృందములా! మంజులతర మహోన్నత ప్రాసాదములా! ఏమి వాంఛింతురు?"
కర్ణుఁడిట్లు పలుకుచున్న కొలఁది బ్రాహ్మణుని వదనము వివర్ణమగుచుండెను. తుట్టతుద కాతఁడు హృదయమును బిగబట్టుకొని "రాధేయా! నీ దానధర్మ ప్రశస్తి నాలకించి బహుదూరము నుండి వచ్చితిని. తప్పక నా వాంఛితమును దీర్చెదనని మాట యిచ్చిన నడుగుదు"ననెను. ఆ మాటలు విని కర్ణుఁడు నవ్వుచు "ఆర్యా! తమ రెఱుంగరు కాబోలు. ప్రతిదినము మధ్యాహ్నము వరకు సూర్యోపాస్తి చేయు సమయమున నెవ్వరేది యడిగినను లేదన కిచ్చుట కీ కర్ణుఁడు సంసిద్ధుఁడై యుండును. సంకోచ మెందులకు? మీ వాంఛిత మెద్దియో ప్రకటింపుడు" అనెను. బ్రాహ్మణుఁడు సందేహించుచు "ప్రతిజ్ఞా భంగము సేతురేమో" యని పలికిన సూర్యతనయుండు "స్వామీ! కర్ణుని దానవ్రతము మీకు దెలియక మాటలాడుచున్నారు. కర్ణుఁడసత్యమాడిన సూర్యభగవానుఁడు పశ్చిమదిశ నుదయించును; ఆకాశము విరిగి పడును; పర్వతములు సంచలించును. సంతోషముతో నర్థింపుడు. సందేహము వీడుడు. రాధేయుని కృతార్థుని గావింపుడు" అని వేడుకొనెను. అప్పుడా కపట విప్రుఁడు కర్ణునిఁజూచి గద్గకంఠముతో "నీ రత్నకుండలములును వజ్ర కవచంబును వాంఛనీయము"లనెను.
ఆ మాటలు విని కర్ణుఁడొకింత సంభ్రమపడి వెండియు హృదయమును పదిల పఱచుకొని నవ్వుచు, "బ్రాహ్మణోత్తమా! ఇందులకా యింత సందేహించితిరి? ఇదిగో యిచ్చుచున్నాను. గైకొనుఁడు" అని ఖడ్గము నందుకొని తొలుదొలుత కర్ణములందలి కుండలములను ఖండించి యిచ్చి యనంతరము నిర్వికారుఁడై నిస్సంకోచముగా నిజశరీరము నందలి వజ్ర కవచమును గత్తితో నొలిచి కపట భూసురుని కరములలో నుంచెను.
కర్ణుని సాహసమునకును, ధైర్యమునకును, వదాన్యతకును మెచ్చుకొని దివినుండి దేవతలు పుష్పవృష్టిఁ గురిపించిరి. కన్న కుమారుని కష్టమును జూడలేక గాఁబోలు కమల బాంధవుఁ డొక మేఘశకలము మాటునకుఁ బోయెను. రాధేయుని శరీరము నుండి రక్తధారలు స్రవింపఁ దొడంగెను. బ్రాహ్మణుఁడు కవచకుండలము లట్లే పట్టుకొని లజ్జా వినమ్ర ముఖుఁడై నిలిచియుండెను.
కర్ణుడు తన యుత్తరీ యాంచలమున నెత్తురు నొత్తుకొనుచు "మహానుభావా! తమరింకను నట్లే నిలిచి యున్నారు. మరేమైనా కోరుదురా?" యనిన నవ్విప్రుఁడు "రాధేయా! నీవు ధన్యుఁడవు! నీ వదాన్యత యనన్య సామాన్యము! నీ త్యాగ సంపద యశ్రుత పూర్వము! గుణనిధీ! నేను స్వార్థపరుఁడనై నీ కవచ కుండలములు గ్రహించి నిన్ను సర్వనాశనము గావించితిని. నీవు నన్ను గుర్తింపవైతివి. నేను దేవేంద్రుఁడను" అనుచుండ దిననాథ నందనుఁడు పురందరునిఁగాంచి "నాకేశ్వరా! నీ కుమారుఁడగు నర్జునుని కొఱకై నీవీ కార్యమును సాధింప వచ్చెదవని నే నెఱుఁగుదును. నా యారాధ్య దైవమగు సూర్యభగవానుఁడు రాత్రి స్వప్నమునఁ గనిపించి నాకీవృత్తాంత మంతయు వచించినాఁడు. నీకుఁ గవచ కుండలములను దానమా చేయవల దనియు ప్రబోధించినాఁడు. కాని త్రిలోకాధి నాథుఁడవును, సమస్తదేవతా సార్వభౌముఁడవును, గరుడగంధర్వ కింపురుష విద్యాధర బృంద వందిత పాదార విందుఁడవును నైన నీవు స్వర్గమునుండి దిగివచ్చి "భిక్షాందేహి" యని యీ కర్ణుని ముందు గరమ్ములు సాచి నిలఁబడితివనుట కంటె నాకుఁ గావలసిన దేమున్నది? ఏ మహాత్మునియింట అమృత కలశ మలరారు చున్నదో, ఏ మహానుభావుని పెరటి తోఁటలో సమస్త వాంఛాప్రదాయి యగు కల్పవృక్షము వెలయుచున్నదో, ఏ మహిమామయుని గృహాంగణ భాగమునఁ గామితార్థ ప్రదాయిని యగు కామధేనువు కట్టివేయఁబడి యున్నదో యా స్వర్గలో కాధీశ్వరుఁడు యాచకుఁడై నేను దాత నగుటకన్న నా జీవితమునకు వాంఛనీయ మెయ్యది? సురసార్వభౌమా! భవదీ యాగమనముచే నన్ననుగ్రహించి నా యశస్సౌధమును జిరస్థాయి చేసిన నీ యుపకారమును మఱవఁగలనే?" యని కొనియాడుచుండ నాఖండలుడు "అంగరాజా! నా యంతరంగమున నొక సందియము బాధించున్నది ఇట్టి మహాదాతవగు నీ చెంత నుండి యీ యమూల్య కవచ కుండలములఁ గొనిపోవుచు దీనికి బ్రతిఫలముగా నేదేని యొసఁగకుండ నెట్లుపోగలను? దయయుంచి నీకు వలసిన దాని నడుగు మొసఁగెద" ననుటయు గర్ణుడు "దేవరాజా! అంగరాజు పరుల కిచ్చుటయే గాని పరులనుండి పుచ్చుకొనుట యెఱుఁగడు. నాచేత వ్రతభంగము నేల చేయింతు" రని పలికెను.
Previous Page
Next Page