శ్రావణంలో సోమవారం, శనివారం ప్రత్యేకత ఏంటి... ఏ పూజ చేస్తే మంచిది!!

జ్యోతిష్యాన్ని నమ్మేప్రతిఒక్కరూ శ్రావణమాసం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. శ్రావణమాసం ప్రారంభం రోజున శ్రావణ సోమావతి అమావాస్య కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు కొన్ని పూజలు చేస్తే కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, మనశ్శాంతి, కోరికన కోరికలు నెరవేరడంతోపాటు అనుకున్న పనులన్నీ జరుగుతాయని చాలామంది నమ్మకం. పండితులు కూడా ఈరోజు పూజలు చేస్తే అంతామంచి జరుగుతుందని చెబుతుంటారు. అయితే శ్రావణమాసంలో వచ్చే సోమవారం, శనివారం ఈ రెండు రోజులకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శివుని అనుగ్రహం కోసం భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటారు. విష్ణుమూర్తి ఆశీస్సులు పొందేందుకు శనివారం ఉపవాసం ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజు శ్రావణమాసంలో వచ్చే సోమవారం, శనివారం గల ప్రాముఖ్యతను తెలుసుకుందాం. 

శ్రావణ సోమవారం ఎందుకంత ప్రత్యేకమైంది: 

మన సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ మాసాన్ని పూజల మాసం లేదా శుభాల మాసం, లేదా పండగల మాసం అని పిలుస్తుంటారు.  ఈ నెలలో ఈరోజు...ఆ రోజు అని కాకుండా అన్ని రోజులూ శుభకరమే. ఈ మాసంలో ప్రతి ఇంట్లో పూజలు జరుగుతుంటాయి. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. శ్రావణమాసంలో వచ్చే ప్రతిరోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ మాసమంతా శ్రవణనక్షత్రం ఉండటమే దీనికి కారణమని పండితులు చెబుతుంటారు. అయితే శ్రావణమాసంలో వచ్చే ప్రతిసోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముక్తిప్రధాత ముక్కంటి శివుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరమైంది. ఈరోజు శివుడిని పూజిస్తే స్వామి కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన ఆ దేవదేవుడిని అభిషేకాలు, అర్చనలతో ప్రార్థిస్తే...శుభాలు కలిగి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతుంటారు. 

శివపార్వుతుల అనుగ్రహం: 

శ్రావణమాసంలో శివపార్వతుల అనుగ్రహం భక్తులకు లభిస్తుంది. భక్తులు తాము చేసిన తప్పులను మన్నించమని మనస్పూర్తిగా ఆ శివయ్యను ప్రార్ధించినట్లయితే...జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారని పురాణాలు చెబుతున్నాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులన్నీ సానుకూలంగా జరుగుతాయి.  ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి...స్నానమాచరించి శివాలయాలను దర్శించుకోవాలి. శివుడికి పాలు లేదా గంగా నీళ్లతో అభిషేకం చేసి, బిల్వపత్రం, విభూది సమర్పించాలి.  అనంతరం ఓం నమఃశివాయ అంటూ మంత్రాన్ని జపించాలి. మీకు తోచిని మేరకు పేదలకు దానం చేయాలి. ఇలా శ్రావణమాసంలో వచ్చే సోమవారం చేస్తే మంచిఫలితం ఉంటుంది. 

శ్రావణ శనివారం ప్రాముఖ్యత: 

ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో  అవతరించే వరకు ఎన్నో రూపాల్లో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించేందుకు భూలోకానికి వస్తాడు. అలాంటి రూపాల్లో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవేకంటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం. కాబట్టి ఈనెలలో వచ్చే శనివారాల్లో శ్రవణనక్షత్రం రోజుల్లో శ్రీవేంటేశ్వరస్వామిని ఆరాధిస్తే అనంతఫలాలు వస్తాయి.  పూర్వం నుంచి శ్రావణ శనివారాల్లో వ్రతాలు చేయడం, పూజలు, ఉపవాసాలు వంటి ఆచారాలు మన దగ్గర ఉన్నాయి. 

ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఇలవేల్పుని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోతే..కనీసం ఒక్క శనివారమైనా..పూజా విధానాన్ని ఆచరించడం అన్నివిధాలా మంచిది. ముఖ్యంగా కలియుగదైవమైన ఆ వేంకటేశ్వరుడికి ఆరాధన అనేది అత్యంత శక్తివంతం. శనివారాల్లో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపిపదార్థాలు ప్రసాదంగా సమర్పించాలి. పిండి దీపాలతో స్వామివారిని ఆరాధించాలి. ఉపవాసం ఉండాలి. ఇలాంటి అన్ని చేసినట్లయితే విశేష ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. 


 


More Sravana Masam - Varalakshmi Vratam