సంక్రాంతి పండుగ రోజు ఈ పనులు చేస్తే శని దోషం తొలగిపోతుందట..!
హిందూ క్యాలెండర్ ప్రకారం 2025, జనవరి 14 వ తేదీన మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజు గంగాస్నానం చేయడం, నువ్వుల లడ్డు, కొన్ని ప్రాంతాలలో గుమ్మడికాయ వండటం చేస్తారు. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు. ముగ్గుల మధ్య గొబ్బిళ్ళు, గొబ్బిళ్ళ మీద గుమ్మడి పువ్వులు.. సంక్రాంతి పిండి వంటలు, గాలి పటాల సంబరాలు.. ఇవన్నీ చాలామందికి ఎంతో సంతోషాన్ని చేకూరుస్తాయి. అయితే సంక్రాంతి పండుగ రోజు కొన్ని పనులు చేస్తే శని దోషం తొలగిపోతుందట. జీవితంలో శని దోషం ఎదుర్కునేవారు, శని దోషం వల్ల బాధలు పడుతున్నవారు సంక్రాంతి రోజు కింద చెప్పుకునే పనులు చేయాలి.
నల్ల నువ్వులు..
మకర సంక్రాంతి రోజు నదీ స్నానం చేయడం శ్రేయస్కరం. వీలైన వారు పారే నీటిలో స్నానం చేస్తుంటారు. స్నానం చేసిన తరువాత నల్ల నువ్వులను నీటిలో వదలాలట. నువ్వులు శని దేవుడికి ప్రీతికరం అని చెబుతారు. అందుకే స్నానం తరువాత నువ్వులను నదిలో వదిలితే శని దేవుడు ప్రసన్నం అవుతాడట.
శివాభిషేకం..
శివుడికి అభిషేకం చేయడం వల్ల శని బాధలు తగ్గుతాయని అంటారు. అయితే మకర సంక్రాంతి రోజు గంగాజలంలో నల్ల నువ్వులు కలిపి శివుడికి నువ్వుల నీటితో అభిషేకం చెయ్యాలి. ఇలా చేస్తే కేవలం శని బాధలు తొలగడమే కాకుండా గ్రహ బాధలు తొలగడం, తలపెట్టిన పనులు పూర్తీ కావడం, శివుడి అనుగ్రహం కలుగుతాయి.
రావి చెట్టు..
జాతకంలో శని దోషం ఉంటే మకర సంక్రాంతి రోజు రావి చెట్టును పూజించడం, రావి చెట్టు దగ్గర ఆవనూనెతో దీపం వెలిగించడం చేయాలి. అలాగే రావి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తే శని దోషం తొలగిపోతుంది.
అర్ఘ్యం..
సంక్రాంతి రోజు సామాన్యంగా గంగాస్నానం చేస్తారు. ఇలా స్నానం చేసిన తరువాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా మంది చేస్తారు. మకర సంక్రాంతి రోజు అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో సూర్య స్థానం బలపడుతుందట. దీనివల్ల తలపెట్టిన పనులలో విజయం కూడా సాధించగలరట. శని దోషాలు కూడా తొలగిపోతాయట.
దానం...
సంక్రాంతి పండుగ రోజు బెల్లం, నువ్వులు, పొంగలి, నూలు వస్త్రాలు, దుప్పట్లు మొదలైనవి పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని ప్రబావం తగ్గి జీవితంలో చాలా విషయాలు అనుకూలంగా మారతాయి.
*రూపశ్రీ.
