కైలాస వైకుంఠాలు మనకెంత దూరంలో ఉన్నాయ్!


మనిషిని సన్మార్గం వైపు నడిపించేది, క్రమశిక్షణ జీవితాన్ని ప్రసాదించేది దేవుడు. ఆ దేవుడు మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణితి తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో ఎంతో మంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటారు. మరికొందరు ఆ శివ, విష్ణువులను వారి వారి లోకాలు, నివాస ప్రాంతాలైన కైలాసం, వైకుంఠం లో వారున్నారని చెబుతుంటారు. మన భక్తి, మన పిలుపు అంత దూరం చేరాలి కదా అని అంటుంటారు చాలామంది. 

కానీ ఆ భగవంతుడికి భక్తుడికి మధ్య దూరం ఎంత?? ఆ భగవంతుడు నివసించే లోకాలకు, భక్తుడి పిలుపుకు మధ్య ఆంతర్యం ఎంత?? ఈ విషయాన్ని వివరించే ఓ ఉదాహరణ..

ఒక గురువు తన చుట్టూ కూర్చున్న శిష్యులను చూస్తూ 'ఇక్కడ నుండి కైలాసం ఎంత దూరం? వైకుంఠం ఎంత దూరం?' అని ప్రశ్నించాడు.

శిష్యులందరూ వెంటనే తమ బుద్ధికుశలతను ఉపయోగించి శాస్త్రప్రమాణములను సంగ్రహించి లెక్కలువేయడం మొదలుపెట్టారు.

అప్పుడు ఆ గురువు తన శిష్యుల అతి ఉత్సాహాన్ని చూసి చిరునవ్వుతో 'కైలాసం చేతికందే దూరంలోనూ, వైకుంఠము పిలుపుకందే దూరములోనూ ఉన్నాయి' అని చెప్పాడు. 

శిష్యులు తమ గురువు మాటలు విని నివ్వెరపోయారు. "అదెలా గురుదేవా!! విషయం వివరంగా చెప్పండి". అని అడిగారు.  

“యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలను హరించడానికి వచ్చినప్పుడు అతడు. శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు కైలాసం నుండి శివుడు వచ్చి యమధర్మ రాజును శిక్షించి, మార్కండేయుణ్ణి రక్షించాడు. అంటే కైలాసం చేతికి అందినంత దూరంలో ఉన్నట్లే కదా! అదేవిధంగా తటాకములో మొసలి నోటికి పట్టుబడిన గజేంద్రుడు ఎలుగెత్తి 'నారాయణా' అని పిలిచాడు. వైకుంఠంలో ఉన్న ఆ శ్రీహరి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆర్తితో పిలిచిన భక్తుని పిలుపు వైకుంఠానికి వినబడిందంటే, మరి వైకుంఠం పిలుపు వినిపించే అంత దూరంలో ఉన్నట్లే కదా!” అని వివరించాడు గురువు.

గురువు మాటలు విన్న శిష్యులకు సందేహం తొలగిపోయింది. భగవంతుడిని ఆర్థిగా, భక్తితో, విశ్వాసంతో పిలిస్తే తప్పకుండా పలుకుతాడని వారు అర్థం చేసుకున్నారు.

                                      ◆నిశ్శబ్ద.    


More Purana Patralu - Mythological Stories