LATEST NEWS
నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమౌతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం కేంద్రం నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని అంటున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు కేంద్రం నిర్ణయం మింగుడుపడటం లేదన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.   కేంద్రం తాజా లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుండి 816కి, అసెంబ్లీ స్థానాలు 4,123 నుండి 6,185కి పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి, అలాగే ఇప్పుడున్న పాతిక లోక్ సభ స్థానాలు   38కి పెరగనున్నాయి.  ఈ మార్పు వైసీపీకి రాజకీయంగా తేరుకోలేని దెబ్బగా పరిణమించడం ఖాయమని అంటున్నారు. నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గతంలో నియోజకవర్గాల  పునర్విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలను అనుకూలంగా మార్చుకున్నారు. సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆ ప్రక్రియలో తెలుగుదేశం  కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాలు ముక్కలయ్యాయి. అప్పట్లో వైఎస్ వేసిన ఆ పునాదులే తర్వాతి కాలంలో వైసీపీకి పెట్టని కోటలుగా మారాయి. అయితే  ప్రస్తుతం పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం భాగస్వామి. అంతే కాకుండా కేంద్రంతో చంద్రబాబుకు ఇప్పుడు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  రాష్ట్రంలోనియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. గతంలో వైసీపీకి అనుకూలంగా ఉండేలా మలచబడిన నియోజకవర్గాల సరిహద్దులు ఇప్పుడు చెల్లాచెదురు అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  అలాగే సీట్ల సంఖ్య పెరగడం వల్ల కూటమిలోని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కూడా బోలెడంత ప్రయోజనం చేకూరుతుంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందులు కనీస స్థాయికి తగ్గిపోతాయి. ఇది ఆ పార్టీలు మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుంది.   కూటమి పార్టీలు బలపడటం అంటే వైసీపీ బలహీనపడటమేననడంలో సందేహం లేదు.  మొత్తానికి, 2024 ఎన్నికల ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తున్న వైసీపీకీ, ఆ పార్టీ అధినేత జగన్ కు నియోజకవర్గాల పునర్విభజన అంశం తేరుకోలేని దెబ్బగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం  సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 73 మంది రిటర్నింగ్ అధికారులను  తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి   వచ్చేనెల 23, 29 తేదీలలో   రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒకే సారి భారీగా ఆర్వోల తొలగింపు నిర్ణయం సంచలనం సృష్టించింది.   భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.  అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్నికల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈ తొలగింపు జరిగిందని తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఈ అధికారులను ఎందుకు తొలగించిందనే దానిపై స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. బీజేపీ వంటి పార్టీలు అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నందునే 72 మంది ఆర్వోలపై ఎన్నికల సంఘం వేటు వేసిందని అంటున్నారు.   
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పొత్తుపొడుపులు కొలిక్కి వస్తున్నాయి.  ప్రతిపక్ష  అన్నాడీఎంకే నేతృత్వంలోని జాతీయ ఎన్డీయే మధ్య ఇంత కాలం కుదరని సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.  సోమవారం (మార్చి 23) చెన్నైలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల  భేటీలో  పార్టీల  మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కూటమి.. ఏయే పార్టీలు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తాయన్న విషయాన్ని వెల్లడించింది.   కూటమిలోని పార్టీలు పోటీ చేసే సీట్ల వివరాలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో  వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. సీట్ల సర్దుబాటుపై తాము పూర్తి సంతృప్తితో ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన  ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.   వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది.  ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. అయితే టీవీకే అధినేత విజయ్ ఒంటరి పోరుకే మొగ్గు చూపడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ అన్నాడీఎంకేను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నది పరిశీలకుల విశ్లేషణ.   మొత్తానికి   ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుపాట్లు ముగిసి ఏకాభిప్రాయం సాధ్యమైంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో  అన్నాడీఎంకే సింహభాగం సీట్లను తన వద్దే ఉంచుకుంది.  ఆ పార్టీ  178 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ 27 స్థానాలలో పోటీ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గత ఎన్నికలలో ఇదే పొత్తులో భాగంగా బీజేపీ కేవలం 20 స్థానాలలో మాత్రమే పోటీ చేసింది. ఈ సారి మరో ఏడు స్థానాలను అదనంగా దక్కించుకుంది.  ఇక కూటమిలోని ఇతర పార్టీలలో,  అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని పీఎంకే  18 స్థానాల్లోనూ,  టీటీవీ దినకరన్ సారథ్యంలోని ఏఎంఎంకే11 స్థానాలలోనూ పోటీ చేస్తుంది.    అదలా ఉంటే పీఎంకేలో చీలిక వచ్చింది. ఆ పార్టీ అధినేత రామదాసు తన వర్గంతో కలిసి శశికళ కూటమితో చేతులు కలపడం ఆసక్తి కరంగా మారింది.  ఇక పోతే.. అధికార డీఎంకే కూటమిలో  సీట్ల సీట్ల సర్దు ‘పాట్లు’ ఇంకా కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం తమిళట   డీఎంకే కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే, విజయ్ టీవీకే పార్టీ,   శశికళ కూటముల మధ్య చతుర్ముఖ పోటీ  ఉన్నప్పటికీ.. అందరి ఆస క్తీ టీవీకే  ఈ ఎన్నికలలో చూపే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో  జరుగుతాయి. మే 4న ఫలితాలు విడుదల  అవుతాయి. 
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన  ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.  దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ విశాఖలో ఏర్పాటు కావడం వెనుక ఉన్నది చంద్రబాబు కృషీ చిత్తశుద్ధేనని అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.  అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ఈ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఆ కంపెనీలు   రూ.1,47,162 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. రెండు దశల్లో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యం. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా  65 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డ్ చేరింది. భారత రాజకీయ చరిత్రలోనే గతంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. అయన పీఎంగా  అత్యున్నత స్థానంలో  అత్యధిక రోజులు కొనసాగిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఇక నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అదెలా ఉంటే  నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు.  దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి  8932  రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు  రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా  మోడీ కొత్త రికార్డు సృష్టించారు.    వివరాల్లోకి వెడితే.. 2001 అక్టోబ‌ర్ 7న గుజ‌రాత్ సీఎంగా తొలిసారి గా బాధ్య‌త‌లు చేపట్టిన ఆయన సుమారు 13 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు.  అనంతరం.. 2014, మే 26న భార‌త ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం  చేశారు. నాటి  నుంచి నేటి వ‌ర‌కూ ఆయ‌న భారత ప్రధానిగా సేవలందిస్తున్నారు. అంటే గుజరాత్ సీఎంగా నాలుగు సార్లు, ప్రధనిగా మూడు సార్లు వరుస ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా మోడీ  సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్ర‌భుత్వాధినేత‌గా   కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మోడీ 2002, 2007, 2012 ఎన్నిక‌ల‌ను ముఖ్య‌మంత్రిగా విజ‌యం సాధించ‌డం మాత్ర‌మే కాదు.. 2014, 19, 24 ఎన్నిక‌ల‌ను ప్ర‌ధానిగా విజ‌యం సాధించ‌డం  కూడా ఒక రికార్డే. ప్ర‌ధానిగా వ‌రుస‌గా  మూడు ఎన్నిక‌ల విజ‌యం సాధించ‌డం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్లాల్  నెహ్రూ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టారు. అత్య‌ధిక కాలం  పీఎంగా ఉండి  మజీ ప్రధాని ఇందిరా  గాంధీ రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు.  అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ఉన్న రెండో పీఎం మోడీయే. అంతే కాదు ముఖ్య‌మంత్రిగా ఎక్కువ కాలం అనుభ‌వం ఉన్న ప్ర‌ధాని కూడా మోడీయే. కాగా మోడీ రికార్డులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించి ప్రధానికి అభినందనలు తెలిపారు. మోడీ ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు, పాలనాదక్షతకు ఇది నిదర్శనమని ప్రస్తుతించారు.  24 ఏళ్లకు పైగా ఎక్కడా విరామం లేకుండా దేశానికి సేవ చేయడం ఒక అరుదైన ఘ‌న‌త‌గా కీర్తించారు.  2029 లో కూడా మోడీయే ప్ర‌ధాని అయితే ఇది మ‌రో ఘ‌న‌త కూడా అవుతుంది.  నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి నాలుగు సార్లు ప్ర‌ధాని అయిన ఈ రికార్డును వ‌చ్చే రోజుల్లో మ‌రే నేత కూడా బ్రేక్ చేసే ఛాన్సే లేద‌ని అంచ‌నా వేస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ తన కొత్త సినిమా 'దేత్తడి'(Dethadi)తో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఊర మాస్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయడం ఖాయమనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఆశిష్ తన లుక్, యాటిట్యూడ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గూస్ బంప్స్ తెప్పించే సీన్లు ఈ గ్లింప్స్‌లో ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంది. ఆశిష్ మాస్ ఎంట్రీనే అదిరిపోయింది. 'బ్యాండోళ్ళం అన్న.. గట్టిగ కొట్టుడు అలవాటైపోయింది" అని చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. డైరెక్టర్ ఆదిత్య రావు గంగసాని మేకింగ్ స్టైల్ చాలా ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా, మాస్ ఆడియన్స్‌కు కావాల్సిన హై-వోల్టేజ్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో జాతర వాతావరణం కట్టిపడేసింది. అదిరిపోయే విజువల్స్, బిజిఎమ్ టెక్నికల్ పరంగా 'దేత్తడి' గ్లింప్స్ టాప్ నాచ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉండి, తెలంగాణ సంస్కృతిని, ముఖ్యంగా బోనాల జాతరను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవల్‌లో ఉంది. డ్రమ్స్, ఫోక్ బీట్స్ మిళితం చేసిన సంగీతం వింటుంటేనే బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇది ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ అని విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. కథ ఏంటి? ఈ గ్లింప్స్‌లో ఆశిష్ ఒక బ్యాండ్ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, ఇందులో ఏదో ఒక పవర్‌ఫుల్ స్టోరీ కూడా దాగి ఉందనే హింట్స్ కనిపిస్తున్నాయి. ఆశిష్ కళ్లలో కనిపించే కసి సినిమా కథపై ఆసక్తిని పెంచుతోంది. ఈ గ్లింప్స్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆశిష్ మేకోవర్, అతని ఎనర్జీ చూసి ఫిదా అవుతున్నారు. ఇటీవల తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ‘దేత్తడి’ కూడా ఆ లిస్టులో చేరుతుందేమో చూడాలి.
- ఆదుర్స్ 2పై వినాయక్ క్లారిటీ.. ఫ్యాన్స్ షాక్! - స్టార్ డైరెక్టర్లు ఎందుకు సినిమాలు చేయడం లేదు - టాలీవుడ్ సీనియర్ దర్శకుల రూటు మారుతుందా?  - వినాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా, మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు అందరికీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ వి.వి.వినాయ‌క్‌ సొంతం. అయితే వినాయక్ మెగా ఫోన్ పట్టి చాలా కాలమే అవుతోంది. కేవలం ఆయనే కాదు, ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన పలువురు స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అసలు ఈ సీనియర్ దర్శకులు ఎందుకు సినిమాలు చేయడం లేదు? గ్యాప్ ఎందుకు వస్తోంది? అనే ప్రశ్నలకు వినాయక్ తాజాగా తనదైన శైలిలో సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినాయక్ అభిప్రాయం ప్రకారం.. మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వర్కవుట్ అయిన పాత ఫార్ములాలనే పట్టుకుని ఇప్పుడు సినిమాలు తీస్తామంటే కుదరదని ఆయన కుండబద్దలు కొట్టారు. వినూత్నమైన ఐడియాలు లేనప్పుడు పాత పద్ధతుల్లోనే సినిమాలు తీసి ఫెయిల్ అవ్వడం కంటే, మౌనంగా ఉండటమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆడియన్స్ కంటెంట్ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారని, వారికి ఏదో ఒకటి ఇచ్చేద్దామనుకుంటే రిజల్ట్ దారుణంగా ఉంటుందని వినాయక్ విశ్లేషించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆదుర్స్ 2' సీక్వెల్‌పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. 'ఆదుర్స్' సినిమా ఒక అద్భుతమని, దాన్ని అక్కడితో వదిలేయడమే గౌరవప్రదమని ఆయన చెప్పుకొచ్చారు. బలవంతంగా సీక్వెల్ తీసి ఆ సినిమాకున్న క్రేజ్‌ను పాడు చేయడం తనకు ఇష్టం లేదని, ఒకవేళ తీసినా మొదటి పార్ట్ రేంజ్‌లో మెప్పించగలమా అన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో 'ఆదుర్స్ 2' కోసం వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానులకు కొంత నిరాశ ఎదురైనప్పటికీ, వినాయక్ నిజాయితీని అందరూ అభినందిస్తున్నారు. వినాయక్ కెరీర్ విషయానికి వస్తే.. 'ఆది', 'ఠాగూర్', 'దిల్', 'ఖైదీ నంబర్ 150' వంటి భారీ విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే 'అఖిల్', 'ఇంటలిజెంట్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఆయనను కొంత ఇబ్బందికి గురిచేశాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్‌తో హిందీలో చేసిన 'ఛత్రపతి' రీమేక్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినాయక్ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం వినాయక్ మాత్రమే కాదు, శ్రీను వైట్ల వంటి పలువురు దర్శకులు కూడా ప్రస్తుతం ఇదే తరహా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కొత్త తరం దర్శకులు సరికొత్త పాయింట్లతో వస్తుండటంతో, సీనియర్లు తమను తాము అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ గ్యాప్ తర్వాత వినాయక్ ఏదైనా పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం ఆయన మాటలు చూస్తుంటే మాత్రం, సరైన కథ దొరికే వరకు కెమెరా ముందుకు వచ్చేలా కనిపించడం లేదు.
    -సుస్మిత కొణిదెల చేతుల మీదుగా అందచేత  -ఏడిద బాబీ ఎవరు  -సేవాకార్యక్రమాలు మరింత ముందుకి  చిరంజీవి(chiranjeevi),పవన్ కళ్యాణ్(Pawan Kalyan),రామ్ చరణ్(Ram Charan)తో పాటు మెగా హీరోలందరికీ మెగా ఫ్యాన్స్ ఎంత బలమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్ళ నుంచి మెగా హీరోలపేరుపై పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తు మెగా హీరోలు అంటే ఆన్ ది స్క్రీన్ తో పాటు ఆఫ్ ది స్క్రీన్ కూడా హీరోలని తెలియచేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి అభిమాన సంఘాలు ఎంతగా సంఘటితం అవుతాయో తెలిసిందే. ఇప్పుడు సదరు సంఘాలు సరికొత్త రూపుని  సంతరించుకోనున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం. చిరంజీవి పెద్ద కూతురు, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెల(Sushmita Konidela)రీసెంట్ గా 'మెగా యూత్ ఫోర్స్‌'(Mega Youth Force)ని నేషనల్ స్థాయిలో అధికారకంగా లాంచ్ చేయడం జరిగింది. యువ మెగా అభిమానులని ఏకం చేసి, వారి శక్తిని సామాజిక సేవ వైపు మళ్లించడమే యూత్ ఫోర్స్ ప్రధాన ధ్యేయం. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన బాబీ ఏడిద మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్‌గా నియమితులయ్యాడు. ఈ మేరకు బాబీకి నియామక పత్రాన్ని సుస్మిత తన చేతుల మీదుగా అందచేసింది. దీంతో మెగా అభిమానులు బాబీకి కంగ్రాట్స్ చెప్తున్నారు. also read: Sri satya: మా నాన్న, నేను కలిసి మందు తాగుతాం.. బిగ్ బాస్ బ్యూటీ వెల్లడి సుస్మిత రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara varaprasad Garu)తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ తోనే ఆగిపోలేదు. తొలి సినిమాతోనే లోకల్ తెలుగు సినిమాలోనే హయ్యెస్ట్ కల్లెక్షన్స్ అందుకున్న తొలి ప్రొడ్యూసర్ గా నిలవడంతో పాటు ఎంటైర్ తన తండ్రి నాలుగున్నర దశాబ్డల కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా కూడా నిలిపింది.     
'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తాండవం ఆడుతోంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగులోనూ భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు డైలాగ్ రైటర్ వి.ఎస్. వెంకటేశన్ (V.S. Venkatesan) 'తెలుగువన్'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడంలో అన్నపూర్ణ స్టూడియోస్, డైలాగ్ రైటర్ వి.ఎస్. వెంకటేశన్ కీలక పాత్ర పోషించారు. వెంకటేశన్ కేవలం డైలాగులను తర్జుమా చేయడమే కాకుండా, ఆ పాత్రల ఎమోషన్‌ను స్వయంగా అనుభవించి తెలుగులో ఎక్స్‌ప్రెస్ చేశారు. ముఖ్యంగా ఉర్దూ, సింధీ భాషల ప్రభావం ఉన్న సంభాషణలను తెలుగు మూలాలకు దగ్గరగా, ప్రేక్షకులకు అర్థమయ్యేలా రాయడం ఆయనకు ఒక గొప్ప సవాలుగా నిలిచింది. డైలాగ్స్ వెనుక అసలు కష్టం ఈ సినిమాకు సంబంధించి వి.ఎస్. వెంకటేశన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. సాధారణంగా యాక్షన్ సినిమాలకు డైలాగ్స్ రాయడం అంటే కేవలం పవర్ ఫుల్ పంచ్ లు ఇవ్వడమే అనుకుంటారు. కానీ 'ధురంధర్' విషయంలో ఆదిత్య ధర్ కోరుకున్నది 'రియలిస్టిక్' అని ఆయన వెల్లడించారు. "మాటలు తక్కువగా ఉండాలి, కానీ ఇంపాక్ట్ మాత్రం భారీగా ఉండాలి" అన్నది దర్శకుడి కండిషన్ అని, దానికోసం తాను పడ్డ కష్టం అంతా ఇంతా కాదని ఆయన చెప్పుకొచ్చారు. రణవీర్ సింగ్ క్యారెక్టర్ గురించి ఈ చిత్రంలో రణవీర్ సింగ్ క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉందని చెప్పారు. ఇప్పటివరకు మనం చూసిన రణవీర్ కంటే, ఈ సినిమాలో ఆయన చాలా తీవ్రమైన, గంభీరమైన పాత్రలో కనిపించారని పేర్కొన్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా, తెలుగు నేటివిటీ మిస్ కాకుండా డైలాగ్స్ రాయడం ఒక సవాల్‌తో కూడుకున్న పని అని వెంకటేశన్ అన్నారు. ఇండస్ట్రీపై వెంకటేశన్ అభిప్రాయం ఒక రైటర్‌గా తను ఎదుర్కొన్న సవాళ్లను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఒక రచయితకు దక్కాల్సిన గుర్తింపుపై ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి కథలు, సంభాషణలు రాసే వారికి అవకాశాలు దొరకడం ఒక ఎత్తు అయితే, వాటిని తెరపైకి సమర్థవంతంగా తీసుకురావడం మరొక ఎత్తు అని ఆయన విశ్లేషించారు. తన కెరీర్‌లో 'ధురంధర్' ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని చెప్పారు. మరిన్ని ఆసక్తికరమైన సినీ అప్‌డేట్స్, ఇంటర్వ్యూల కోసం మా తెలుగువన్(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
మన టాలీవుడ్ తారలు కేవలం కెమెరా ముందే కాకుండా, వెండితెర వెనుక వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించడంలోనూ ముందుంటున్నారు. ముఖ్యంగా ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగంపై మక్కువ చూపుతున్న మన స్టార్లు, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విలాసవంతమైన రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. అభిమానులకు తమ అభిమాన హీరోలకు సంబంధించిన ప్రదేశాల్లో భోజనం చేయడం ఒక మధురానుభూతిని ఇస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 'మినర్వా కాఫీ షాప్' భాగస్వామ్యంతో 'ఏఎన్ (AN)' రెస్టారెంట్‌ను ప్రారంభించారు. దక్షిణ భారత రుచులతో పాటు మల్టీ కుజైన్ వంటకాలకు ఇది పెట్టింది పేరు. ప్యాలెస్ తరహా ఇంటీరియర్స్ ఇక్కడ వచ్చే వారికి రాజసం అనుభూతిని కలిగిస్తాయి. కేవలం నటుడిగానే కాకుండా మల్టీప్లెక్స్ రంగంలోనూ మహేష్ ఇప్పటికే తన ముద్ర వేశారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే, జూబ్లీహిల్స్ ప్రాంతంలో అంతర్జాతీయ బ్రాండ్ 'బఫెలో వైల్డ్ వింగ్స్' ఫ్రాంచైజీని నడుపుతున్నారు. స్పోర్ట్స్ ప్రేమికులకు, చిల్ అవుట్ అవ్వాలనుకునే యువతకు ఇది ఫేవరెట్ స్పాట్. మరోవైపు అక్కినేని నాగార్జున 'ఎన్ గ్రిల్', 'ఎన్ ఏషియన్' వంటి పేర్లతో ఏళ్ల తరబడి రెస్టారెంట్ రంగంలో తన సత్తా చాటుతున్నారు. నాగ చైతన్య సైతం 'షోయు' అనే ఏషియన్ రెస్టారెంట్‌తో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా జపనీస్ రుచుల కోసం నగరవాసులు ఇక్కడికి క్యూ కడతారు. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీకి చెందిన 'వన్8 కమ్యూన్' హైటెక్ సిటీలో యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే మన 'లోకల్ బాయ్' మహ్మద్ సిరాజ్ బంజారాహిల్స్‌లో 'జోహార్ఫా' పేరిట సరికొత్త రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశారు. రాణా దగ్గుపాటి 'శాంక్చురీ', 'బ్రాడ్‌వే' వంటి సోషల్ హ్యాంగవుట్ ప్లేసెస్‌లో భాగస్వామిగా ఉంటూ హైదరాబాద్ నైట్ లైఫ్‌కు కొత్త కళను తీసుకొచ్చారు. వీరితో పాటు సందీప్ కిషన్ 'వివాహ భోజనంబు' పేరిట తెలుగు వారి సంప్రదాయ భోజనాన్ని వడ్డిస్తుంటే, నితిన్ 'టీ గ్రిల్' ద్వారా, విజయ్ దేవరకొండ 'గుడ్ వైబ్స్ ఓన్లీ' కెఫేతో ప్రేక్షకులకు చేరువయ్యారు. హెల్త్ కాన్షియస్ ఉన్న వారి కోసం రకుల్ ప్రీత్ సింగ్ 'ఆరంభ్' పేరుతో మనికొండలో తన కేంద్రాన్ని నిర్వహిస్తోంది. సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్లతో బిజీగా ఉన్నప్పటికీ, మన తారలు ఇలా వినూత్న వ్యాపారాలతో ప్రేక్షకులను పలకరిస్తుండటం విశేషం. కేవలం స్టార్ హోదానే కాకుండా, క్వాలిటీ మరియు రుచి విషయంలోనూ రాజీ పడకుండా ఈ రెస్టారెంట్లను నడుపుతుండటంతో వీటికి ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్తులో మరికొంతమంది స్టార్లు కూడా ఇదే బాటలో పయనిస్తూ కొత్త రెస్టారెంట్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. సో.. మీరు కూడా మీ ఫేవరెట్ స్టార్ రెస్టారెంట్‌లో ఒక్కసారైనా భోజనం చేసేయండి!
  - శ్రీ సత్య మాటలు వైరల్  -ఇంతకీ ఆమె ఆవేదన ఏంటి! -షేక్ అవుతున్న సోషల్ మీడియా  ఊహల పల్లకిలో ఉరేగించనా... ఆశల వెల్లువై రాగం పలికించనా.. అనే సాంగ్ లో ఎంత స్వచ్ఛత, మాధుర్యం ఉందో సినిమా కూడా అంతే స్వచ్ఛమైనది, మాధుర్యమైనది. ఆ విషయంలో ఎలాంటి డౌట్స్ ని మైండ్ లోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది నటులు, నటీమణులు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో  శ్రీ సత్య(Sri satya)కూడా ఒకటి. బిగ్ బాస్ 6 తో పాటు పలు సీరియల్స్ తన ఖాతాలో ఉన్నాయి. రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో ఆమె మాట్లాడిన సినీ, వ్యక్తిగత  మాటలు వైరల్ న్యూస్ కి కూడా ఒక టైం అనేది వస్తుందని  నిరూపిస్తున్నాయి. మరి ఆ వైరల్ మాటలేంటో చూద్దాం. ఇండస్ట్రీలో  క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది నిజం. అందుకే నేనే ఉదాహరణ. నాకు టాలెంట్ ఉన్నా అవకాశాలు రావడం లేదు. పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. ఫోటో షూట్లు చేసి, ఆ తర్వాత వేషం లేదని చెప్పేస్తారు. ఒకసారి నేను మేకప్ వేసుకుంటుంటే, నా బ్యాగుని రూమ్ బయట పడేశారు. ఎవరితో పడితే వాళ్లతో రూమ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినందుకు నన్ను ఘోరంగా అవమానించారు. ఆస్తి, అంతస్తుల కోసమే నా లవర్ నాకు బ్రేకప్ చెప్పాడు. ఆ బాధని తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాను. దాంతో మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఫలితంగా మాట పడిపోయింది. ఏడాది పాటు ట్రీట్ మెంట్ చేయించినా ఫలితం లేదు.  also read: స్టార్ హీరోలు ఉన్నా విలన్ వల్ల బ్లాక్ బస్టర్ అయిన మూవీస్.. మళ్ళీ ఆ విలన్ వస్తాడా! బతికి ఉన్నంత కాలం అమ్మ అలానే ఉండాలి" నా మూతి కొంచెం ముందుకు ఉండాలని లిప్ సర్జరీ చేయించుకున్నాను. డాక్టర్ వద్దు అని చెప్పినా వినకుండా చేయించుకున్నా. కానీ అది నా ముఖానికి సెట్ కాలేదు. పెళ్లికి ముందు సహజీవనం చేయడం నాకు ఇష్టం లేదు. పెళ్లి అనే బంధానికి  చాలా గౌరవం ఇస్తాను. నాకు మద్యం సేవించే అలవాటు ఉంది. మా నాన్న ఏ బ్రాండ్ తెస్తే దాన్నే ఇద్దరం కలిసి తాగుతాం. మేము తండ్రీకూతుళ్లం మాత్రమే కాదు, మంచి స్నేహితులం. నాన్నకి బ్రేకప్ అయ్యింది, నాకు బ్రేకప్ అయ్యింది.. ఆ బాధలు మర్చిపోవడానికి ఇద్దరం కలిసి తాగుతామని చెప్పుకొచ్చింది.  
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన అందానికి, నటనకు ఫిదా అవ్వని వారుండరు. అయితే కేవలం వెండితెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా మహేశ్ ఒక రియల్ హీరో అని ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కొనియాడారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'కోహ్రా' సిరీస్ సెకండ్ సీజన్‌లో నటిస్తున్న నీరూ సెహగల్, మహేశ్‌బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నీరూ సెహగల్ గతంలో మహేశ్‌బాబుతో కలిసి ఒక కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఆ సమయంలో ఆయనతో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. మహేశ్ బాబు సెట్‌లో ఎంత సింపుల్‌గా ఉంటారో వివరించింది. షూటింగ్ స్పాట్‌లో ఆయన ప్రవర్తన, పని పట్ల ఆయనకున్న అంకితభావం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని ఆమె చెప్పుకొచ్చింది. సాధారణంగా అంత పెద్ద స్టార్ అంటే సెట్‌లో కాస్త హడావుడి ఉంటుందని ఊహిస్తాం, కానీ మహేశ్ విషయంలో అది పూర్తిగా భిన్నమని ఆమె పేర్కొంది. మహేశ్‌బాబు టైమ్ మేనేజ్‌మెంట్ గురించి నీరూ ప్రత్యేకంగా ప్రశంసించింది. "ఆయన సెట్‌లోకి వస్తే కేవలం పనిపైనే దృష్టి పెడతారు. అందరితో ఎంతో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తిస్తారు. షూటింగ్ సమయంలో ఆయన చూపించే క్రమశిక్షణ ఒక గొప్ప పాఠం లాంటిది" అని నీరూ తెలిపింది. ఒక పెద్ద స్టార్ హోదాలో ఉన్నప్పటికీ, తోటి నటీనటులకు ఆయన ఇచ్చే కంఫర్ట్ లెవల్స్ చూసి తాను ఫిదా అయ్యానని ఈ నార్త్ బ్యూటీ మురిసిపోయింది. ప్రస్తుతం నీరూ సెహగల్ 'కోహ్రా 2' అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది. మొదటి సీజన్ భారీ విజయం సాధించడంతో, ఈ రెండో భాగంపై ఓటీటీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె మహేశ్‌బాబు గురించి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఈ వార్తను తెగ షేర్ చేస్తూ.. "మా అన్న ఎప్పుడూ ఇంతే.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేశ్ బాబు తన క్రమశిక్షణతో, హుందాతనంతో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా, ఉత్తరాది నటీనటుల మనసులను కూడా గెలుచుకుంటుండడం విశేషం. రాజమౌళి సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లోపు మహేశ్ వ్యక్తిత్వం గురించి ఇలాంటి పాజిటివ్ వార్తలు రావడం ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
'ధురంధర్-2'తో సంచలనం సృష్టిస్తున్న ఆదిత్య ధర్ ఆయన భార్య ప్రముఖ హీరోయిన్  తెలుగులో చేసిన సినిమాలు తెలుసా? ప్రస్తుతం ఇండియా వైడ్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్(Aditya Dhar) పేరు మారుమోగిపోతోంది. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు 'ధురంధర్: ది రివెంజ్'(Dhurandhar: The Revenge)తో సంచలనం సృష్టిస్తున్నారు. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ ఎప్పుడూ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. అనవసరమైన హంగులు లేకుండా కథలోని ఆత్మను పట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకే ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. కేవలం తన దర్శకత్వ ప్రతిభతోనే కాకుండా, తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా హీరోయిన్ యామీ గౌతమ్‌తో తనకున్న అందమైన ప్రేమ కథతో కూడా ఆయన తరచుగా చర్చల్లో ఉంటారు. ఆదిత్య ధర్ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే 'ఉరి' సినిమా ఆయన తలరాతను మార్చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆదిత్యకు, యామీ గౌతమ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి, చివరికి ప్రేమగా దారితీసింది. అయితే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా చాలా రహస్యంగా ఉంచారు. ఆడంబరాలకు వెళ్లకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత సాదాసీదాగా వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2011లో వచ్చిన 'నువ్విలా' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె.. 'గౌరవం', 'యుద్ధం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. 'ఉరి' సినిమా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. యామీ గౌతమ్ తన భర్తకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి 'ఉరి', 'ఆర్టికల్ 370', 'ధూమ్ ధామ్' వంటి సినిమాలకు పనిచేశారు. ముఖ్యంగా 'ఆర్టికల్ 370' సినిమాలో యామీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  సోషల్ మీడియాలో కూడా ఆదిత్య, యామీల ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా, తన కుటుంబాన్ని ప్రయారిటీగా చూసుకోవడం ఆదిత్య ధర్ నైజం. యామీ కూడా తన కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూనే ఆదిత్య ప్రాజెక్టులకు మద్దతుగా నిలుస్తున్నారు.  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ ఫిల్మ్.. 2026 సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశపరిచింది. అయితే తాజాగా ఈ సినిమాపై ఆర్ట్ డైరెక్టర్‌ రాజీవన్(Rajeevan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న 'బైకర్' మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 'రాజా సాబ్' సినిమా గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రాజా సాబ్' సినిమాలో కీలకమైన 'ప్యాలెస్ సెట్' కోసం ఆయన ఏకంగా 50కి పైగా విభిన్నమైన డిజైన్లు చేశారట. ఒక భారీ బడ్జెట్ సినిమాకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంత కీలకమో చెబుతూ.. సినిమా బడ్జెట్‌లో దాదాపు 15 నుంచి 18 శాతం వరకు ఖర్చు ఆర్ట్ వర్క్ కోసమే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇక ప్రభాస్ లుక్ గురించి రాజీవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ గారు చాలా కష్టపడ్డారని, మొదట కొంత బరువు పెరిగినా.. కథా దృష్ట్యా మళ్ళీ బరువు తగ్గారని వెల్లడించారు. బైకర్ గురించి మాట్లాడుతూ.. ఇది బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా అని చెప్పారు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు, ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్‌లను చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. మలేషియా వంటి దేశాల్లో షూటింగ్ చేయడం ఒక కొత్త అనుభవం అని రాజీవన్ గారు వివరించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.  మరిన్ని ఆసక్తికర సినీ అప్‌డేట్స్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
  -ఎక్కడరా ఆ విలన్  -అసలు ఎందుకు రావడం లేదు  -హిట్ స్టేటస్ ఎంత  తెలుగు సినిమా(Telugu Cinema)ఎవడి సొత్తు కాదనే మాట అక్షరాలా ఎంత నిజమో.. తెలుగు సినిమా కథాంశం హీరో సొత్తు మాత్రమే కాదు విలన్ ది కూడా. ఎంతలా అంటే విలన్ రోల్ హీరో రోల్ ని డామినేషన్ చేసేంతలా. హీరో అభిమానులు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. బలమైన విలనిజం వల్లే చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ విషయం తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి సినీ సాక్ష్యాలతో సహా  నిరూపితమవుతూ వస్తుంది. అందుకు ఉదాహరణలు చూపించని సినీ మనిషంటూ ఉండడు. మరి అందులో కొంతమందిని మచ్చుకైనా మరోసారి గుర్తు చేసుకోవడం సినిమాలని ప్రదర్శించే సైట్ గా మన ధర్మం. మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. లేడీస్ ఫస్ట్ అనే సూత్రం ఒకటి పుట్టింది కాబట్టి లేడీ విలనిజం దగ్గరకి వస్తే సూర్యకాంతం, ఛాయాదేవి అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించి, హీరో, హీరోయిన్ ల కోసమే రిపీట్ ఆడియన్స్ రారు మా కోసం కూడా వస్తారని చాటి చెప్పారు. ఆ తర్వాత ఆ స్థాయిలో లెగసిని కంటిన్యూ చేసే భాగ్యం 'నరసింహ' మూవీ ద్వారా రమ్యకృష్ణకి వచ్చింది.    రజనీకాంత్ కి ధీటుగా  నీలాంబరి క్యారక్టర్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సినిమా విజయం రేంజ్ ని పెంచడంతో పాటు నీలాంబరిగా తన హావభావాలు, రూపురేఖలు ప్రేక్షకుల మస్తిష్కాల్లో శాశ్వతం అని నిరూపించింది. ఆ తర్వాత సినీ అభిమానులకి ఎలాంటి దిష్టి తగిలిందో ఏమో గాని తన క్యారక్టర్ తోనే సినిమా హిట్ రేంజ్ ని పెంచేంత లేడీ సినీ విలన్ రాలేదు. రావుగోపాలరావు, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు కంటిన్యూ చేసి తెలుగు సినిమా, ప్రేక్షకుల ఆరాధ్య సినీ నాయకుల్లా మారారు.    మళ్ళీ చాలా ఏళ్ళకి ఇప్పుడు హీరోగా దూకుడు ప్రదర్శిస్తున్న  గోపీచంద్ 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో అదిరిపోయే విలనిజాన్ని ప్రదర్శించి మనోడ్ని బీట్ చేసాడురా బాబు అని హీరో ఫ్యాన్స్ అనుకునేలా చేసాడు. నిజం తప్ప మిగతా రెండు సూపర్ హిట్స్ గా నిలిపాడు. సోనూసూద్ 'అరుంధతి'లో పోషించిన 'పశుపతి' గురించి ఎంత చెప్పినా తక్కువే. తన పెర్ఫార్మ్ తో ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించాడు. అరుంధతి భారీ విజయంలో పశుపతి క్యారక్టర్ సింహభాగంతో పాటు నేటికీ పశుపతి కోసం అరుంధతిని చూసే వాళ్ళ సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుంది. also read: Mohanlal: ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మోహన్ లాల్.. ఎక్స్ వేదికగా కీలక ప్రకటన బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా రానా చూపించిన శారీరక దారుఢ్యం, కుతంత్రాలు ప్రభాస్ పాత్రకు సరైన జోడీగా నిలిచాయి. ఒక్కడులో ప్రకాష్ రాజ్ పండించిన విలనిజం ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక గత కొంత కాలం నుంచి హీరోని బీట్ చేసిన సినిమాలు గాని, విలన్ వల్లనే హిట్ అయిన సినిమాలు గాని రాలేదు. ఆ రోజులు మళ్ళీ వచ్చి అసలైన సినీ మజా సెల్యులాయిడ్ పై సాక్షాత్కారం అయితే మాత్రం ప్రేక్షకుడు నయా పుణ్యం చేసుకున్నట్లే.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి.  దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు,  కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు.  ఎలా తిన్నా దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  మార్కెట్లలో దోసకాయలకు డిమాండ్  కూడా పెరిగే కాలం ఇది.  అయితే దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే చేదు దోసకాయలను ఎంపిక చేస్తుంటారు.   చేదు దోసకాయలు  అటు తినలేము, ఇటు డబ్బు కూడా వృధా అవుతుంది.  అలా కాకుండా మార్కెట్లో దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చేదు దోసకాయలు కాకుండా అన్నీ మంచి దోసకాయలు ఎంచుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. చేదు దోసకాయలు అవాయిడ్ చేసి మంచి దోసకాయలు ఎంచుకునే టిప్స్.. రంగు,  ఆకారం..  దోసకాయల రంగు,  ఆకారం ను  బట్టి చేదు దోసకాయను సులభంగా గుర్తించవచ్చు. దోసకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాజాగా ఉన్నట్లు. అది లేత పసుపు, తెలుపు రంగులో లేదా మచ్చలతో ఉంటే, అది పండిందని అర్థం, అలాగే  లోపల చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. నొక్కడం.. దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటే ఫర్వాలేదు, అదే అది మెత్తగా లేదా స్పాంజిలాగా అనిపిస్తే అది చెడిపోయినది,  చేదుగా కూడా ఉండవచ్చు. దోసకాయ నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఆకారం.. దోసకాయ ఆకారాన్ని చూసి  సులభంగా అది చేదు దోసకాయ లేదా మంచి దోసకాయ అనేది చెప్పవచ్చు. మందంగా లేదా పసుపు రంగులో ఉండే దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉండే దోసకాయలను మంచిగా ఉంటాయి. వాసన.. వాసనను బట్టి సులభంగా దోసకాయ చేదు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు.   దోసకాయ  తాజాగా ఉంటే లోపల కూడా తాజాగా ఉంటుంది.  దాని వాసన వింతగా లేదా ఘాటుగా ఉంటే, అది  లోపల చేదుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాండం.. దోసకాయ కొనుగోలు చేసినప్పుడు దోసకాయ కాండం దగ్గర కట్ చేయాలి. ఆ కాండం భాగాన్ని  దోసకాయ మిగిలిన భాగంలో రుద్దితే తెల్లని నరుకు వస్తే దోసకాయ చేదు ఉండే అవకాశం ఉంటుంది.  ఈ నుగురు బాగా బయటకు వెళ్లిపోతే దోసకాయలో చేదు తగ్గిపోతుందని చెబుతారు. అందుకే చాలామంది దోసకాయను కట్ చేసేటప్పుడు మొదట కాండం దగ్గర కట్ చేసి  రుద్దుతారు.  దీని వల్ల దోసకాయలో ఉండే చేదు పోతుందని చెబుతారు.                                 *రూపశ్రీ.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.