![]() |
![]() |

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పుష్ప: ది రైజ్' 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా రూపొందుతోన్న 'పుష్ప: ది రూల్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుందనే అంచనాలున్నాయి. అయితే పుష్ప-2 వసూళ్లకు ఇతర పరిశ్రమలకు చెందిన బడా సినిమాలు గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'పుష్ప-2' (Pushpa 2) సినిమాని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే అదే తేదీపై ఇతర భాషలకు చెందిన పలు సినిమాలు కన్నేశాయి. హిందీ చిత్రం 'సింగం ఎగైన్' ఆగస్టు 15నే విడుదల కానుంది. అజయ్ దేవ్గణ్, డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో రూపొందే సింగం సిరీస్ కి నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. పైగా అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమా కారణంగా నార్త్ లో 'పుష్ప-2' వసూళ్లపై ప్రభావం పడే అవకాశముంది.
తమిళనాట రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డం దళపతి విజయ్ సొంతం. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తాయి. అలాంటి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'ను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కమల్ హాసన్- శంకర్ ల క్రేజీ ప్రాజెక్ట్ 'ఇండియన్-2' సైతం అదే తేదికి వచ్చే అవకాశముందని సమాచారం. అదే జరిగితే తమిళనాట 'పుష్ప-2'కి కావాల్సినన్ని థియేటర్లు దొరక్కపోవడంతో పాటు, కలెక్షన్లకు భారీ గండి పడే ఛాన్స్ ఉంది.
నార్త్, తమిళనాడుతో పాటు కర్ణాటకలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తున్న 'భైరతి రణగల్' మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. 'ముఫ్తి'కి ప్రీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కారణంగా కర్ణాటకలో 'పుష్ప-2' వసూళ్లపై ప్రభావం పడనుంది అనడంలో సందేహం లేదు.
పాన్ ఇండియా సినిమాలకు సోలో రిలీజ్ అవసరం. అప్పుడే ఆ హైప్ కి తగ్గట్టుగా భారీ వసూళ్లతో సంచలనం సృష్టించే అవకాశం ఉంటుంది. కానీ 'పుష్ప-2'కి హిందీ, తమిళ, కన్నడ మలయాళ భాషలకు చెందిన భారీ సినిమాల నుంచి పోటీ ఎదురుకానుంది. మరి 'పుష్ప-2' వీటిని దాటుకొని సత్తా చాటుతుందేమో చూడాలి.
![]() |
![]() |