![]() |
![]() |

సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్స్ లో పాల్గొనబోమని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్.. ఇప్పటికే ఉన్న కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నామని తెలిపింది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొంది.
మరోవైపు నిర్మాతలు కూడా ఫెడరేషన్ కి ధీటైన జవాబు ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే షూటింగ్ కోసం ఏకంగా ముంబై నుంచి సినీ కార్మికులను తీసుకొనివచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది మైత్రి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ షూటింగ్ జరుగుతోంది. అయితే వేతనాల పెంపు డిమాండ్ తో తెలుగు సినీ కార్మికులు నేటి నుంచి బంద్ కు పిలుపునివ్వడంతో.. మైత్రి ఊహించనివిధంగా ముంబై నుండి కార్మికులను తెప్పించి షూటింగ్ నిర్వహిస్తోంది. దీనిపై తెలుగు సినీ కార్మికులు మండిపడుతున్నారు. మన కార్మికులు కష్టం హీరో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ కూడా.. వేతనాల పెంపు డిమాండ్ తో కార్మికులు బంద్ కు పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు. సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే ఎక్కువ పే చేస్తున్నామని, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కంటే కూడా వీరికి వేతనాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
ఈ విషయంపై నిర్మాత SKN సైతం ఆవేదన వ్యక్తం చేశారు. "ఇప్పటికే ధియేటర్స్ కి ఆడియన్స్ దూరం. ఇప్పుడు అదనపు వేతనాల భారం. ఓటీటీ శాటిలైట్స్ అగమ్య గోచరం. పైరసీ పుండు మీద కారం.పేరుకే వినోద పరిశ్రమ.. నిర్మాతల శ్రమ విషాదమే" అని అన్నారు.
ఏది ఏమైనా వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా లేరని అర్థమవుతోంది. 30 శాతం అంటే మరీ ఎక్కువ అని.. 5-10 శాతం పెంపు అయితే సాధ్యమయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |