![]() |
![]() |

కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో.. థియేటర్లు రీఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు రీఓపెన్ చేయవచ్చని అనుమతి ఇచ్చినా.. ఎప్పటి నుంచి రీఓపెన్ చేయాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడంతో.. కొత్త సినిమాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్ల రీఓపెన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సినిమా ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వల్ల మూతపడ్డ థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 శాతం ఆక్యూపెన్సీతో జూలై 8 నుంచి థియేటర్లు నడిపించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా చిత్రీకరణలు, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మళ్లీ జోరందుకుంటున్నాయి. తాజాగా ఏపీలో థియేటర్లకు అనుమతి రావడంతో దర్శకనిర్మాతలు విడుదల తేదీలపై సమాలోచనలు చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం జూలై 8 నుంచి థియేటర్లు రీఓపెన్ చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కానీ ఏపీలోని సినిమా థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో తెరుచుకోనుండగా, తెలంగాణలో మాత్రం 100% ఆక్యుపెన్సీతో తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా భయం కారణంగా ఇప్పట్లో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తారనేది అనుమానమే. మరోవైపు బడా సినిమాల నిర్మాతలు కూడా ఇరు రాష్ట్రాల్లోనూ థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో తిరిగి ఓపెన్ అయితే తమ సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు.
![]() |
![]() |