![]() |
![]() |

తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు. ఆయన ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్య సమస్యలే మరణానికి కారణం. ఆయన మరణవార్త తెలియగానే టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
దీంతో సినీ ప్రముఖులు,రాజకీయ నేతలు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. పద్మారావు మృతి చెందడం ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. గొట్టిముక్కల పద్మారావు తెలుగు చిత్రసీమలో 'పద్మప్రియ ఆర్ట్స్' (Padma Priya Arts) అనే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థని స్థాపించి, వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను నిర్మించారు. సీనియర్ హీరో సుమన్తో ఆయన నిర్మించిన 'కంచు కవచం' అనే భారీ యాక్షన్ మూవీ అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కామెడీ జోనర్లోకి అడుగుపెట్టి నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన 'జోకర్' చిత్రంతో పాటు, నేటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఏప్రిల్ 1 విడుదల' వంటి ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత పద్మారావు గారిది. సినీ రంగానికే పరిమితం కాకుండా, ఆయన ప్రజాసేవపై ఆసక్తితో రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీలో చేరి 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి, 56,688 ఓట్లను సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనది ద్వితీయ స్థానం. ప్రజా ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా సమాజంలో ఎంతో మందికి సహాయం అందించి ఆదరణ పొందారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్ట్రీ వర్గాలు ప్రార్థిస్తున్నాయి. పద్మారావు గారి వయసు 77 సంవత్సరాలు
![]() |
![]() |