![]() |
![]() |
గత రెండు వారాలుగా హాట్ టాపిక్గా మారిన అంశం బెంగళూరు రేవ్ పార్టీ. మే 20న బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొన్నారనే సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పార్టీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా వుండడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదంటూ కొన్ని వీడియోలు చేసి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది హేమ. అయితే రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ ఫోటోను రిలీజ్ చెయ్యడంతో తన కథ అడ్డం తిరిగిందని గ్రహించింది. ఆ తర్వాత పోలీసులు పార్టీలో చాలా మంది డ్రగ్స్ సేవించారని తెలియడంతో 105 మంది బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు పోలీసులు. వారిలో 86 మందికి పాజిటివ్ వచ్చింది. వారందరికీ పోలీసులు సమన్లు జారీ చేశారు. పోలీస్ విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. నటి హేమకు రెండు సార్లు నోటీసులు పంపించినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో మూడో నోటీసు కూడా పంపారు. దానికి కూడా హాజరు కాకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించిన హేమ సోమవారం పోలీసుల ఎదుట హాజరైంది. ప్రస్తుతం హేమ పోలీసుల అదుపులో ఉంది. డ్రగ్స్ వాడకం విషయంలో పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ తీసుకోవడం ఇదే మొదటిసారైతే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసే అవకాశం ఉంది. అలా కాకుండా అంతకుముందు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే చర్యలు కఠినంగా ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ విచారణలో పోలీసులు ఏం తేల్చనున్నారనే విషయం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
![]() |
![]() |