![]() |
![]() |

2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్'(Tillu Square). సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా.. బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.
తాజాగా 'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. చిత్ర బృందాన్నిఅభినందించడం విశేషం. 'డీజే టిల్లు' తనకు బాగా నచ్చిన చిత్రమని, ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కూడా ఎంతగానో నచ్చిందని చెప్పిన చిరంజీవి, చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.
చిరంజీవి మాట్లాడుతూ.. "డీజే టిల్లు నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా చూసి ముచ్చటేసి, సిద్ధుని ఇంటికి పిలిపించుకొని అభినందించాను. ఇప్పుడు సిద్ధు 'టిల్లు స్క్వేర్'తో మళ్ళీ మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. సినిమా హిట్ కి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ మూవీ టీం అంతా కలిసి ప్రేక్షకులు మెచ్చేలా సీక్వెల్ ని అందించడంలో విజయం సాధించారు. అదే ఉత్కంఠ, అదే సరదా, అదే నవ్వులతోటి ఈ 'టిల్లు స్క్వేర్'ని ఎంతో ఎంజాయ్ చేశాను. నటుడిగా, కథకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ప్రధాన కారణమైన సిద్ధు జొన్నలగడ్డని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే దర్శకుడు మల్లిక్, నిర్మాత వంశీ, ఎడిటర్ నవీన్ ని అభినందిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడగల బలమున్న మనిషి వంశీ. మంచి సినిమాలను నిర్మిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతూ ఉత్తమ యువ నిర్మాతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు వంశీ. అలాగే 'మ్యాడ్' సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న కళ్యాణ్.. ఈ సినిమా రచనలో సహకారం అందించాడని తెలిసింది. ఇది యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా అని కొందరు అంటున్నారు. కానీ ఇది అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా. నేను ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి." అన్నారు.
'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించిన ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి పాటలు స్వరపరచగా, భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు.
![]() |
![]() |