Home  »  News  »  'ఆడవాళ్ళు మీకు జోహార్లు' మూవీ రివ్యూ

Updated : Mar 4, 2022

సినిమా పేరు: ఆడవాళ్ళు మీకు జోహార్లు
తారాగ‌ణం: శర్వానంద్, రష్మిక, కుష్బూ, రాధిక, ఊర్వశి 
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: కిషోర్ తిరుమల 
విడుదల తేదీ: మార్చి 4, 2022

కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో శర్వానంద్ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. కుష్బూ, రాధిక, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులు నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? ఈ సినిమాతోనైనా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:
క్రికెట్ టీమ్ లా పదిమందికి పైగా ఆడవాళ్ళు ఉన్న కుటుంబంలో ఒక్కడే మగ సంతానం కావడంతో చిరంజీవి(శర్వానంద్)ని చాలా ప్రేమగా, పద్ధతిగా పెంచుతారు ఆ ఇంటి ఆడవాళ్ళు. అయితే వారి అతి ప్రేమే చిరంజీవి పెళ్లికి అడ్డంకిగా మారుతుంది. ఏదోక వంక చెప్పి వచ్చిన పెళ్లి సంబంధాలు అన్ని రిజెక్ట్ చేస్తుంటారు. వయస్సు పెరిగిపోతుంది, ఇక తనకి పెళ్లి కావడం కష్టమే అనుకొని నిరాశలో ఉన్న చిరంజీవికి ఆద్య(రష్మిక) పరిచయమవుతుంది. అప్పటిదాకా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే చాలని నానా ప్రయత్నాలు చేసిన చిరంజీవి.. ఆద్య పరిచయంతో ఆమెతో ప్రేమలో పడి, ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆద్య మాత్రం తాను పెళ్లి చేసుకోలేనని, తనకి తన తల్లి పెళ్లి చేయదని చెబుతుంది. దీంతో చిరంజీవి కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఆద్య తల్లి ఎవరు? ఆమె ఆద్యకి పెళ్లి ఎందుకు చేయదు? ఆమెని ఒప్పించి చిరంజీవి ఆద్యని పెళ్లి చేసుకున్నాడా? తెలియాలంటే సినిమా చూడాలి.

ఎనాలసిస్:
కిషోర్ తిరుమల సినిమాలు అంటే ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ కలగలిసి ఉంటాయి. ఆ ఫార్ములాతోనే 'నేను శైలజ', 'చిత్రలహరి' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాతో 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' తీశాడు. కానీ అనుకున్న ప్లాట్ చిన్నది కావడం, కథనంలో కొత్తదనం లేకపోవడంతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

సుకుమార్ వాయిస్ ఓవర్ తో చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని క్రికెటర్స్ ద్రావిడ్, సచిన్, ధోని తో పోల్చుతూ పాత్రల పరిచయం అయితే బాగానే చేశారు కానీ ఆ పాత్రలను బలంగా రాసుకోలేకపోయారు. పద్మమ్మగా ఊర్వశి పాత్ర మాత్రమే గుర్తుండిపోయేలా ఉంది. రాధిక పాత్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మిగతా పాత్రలైతే కొన్ని సన్నివేశాల్లో ఒకరి తరువాత ఒకరు తలొక డైలాగ్ చెప్పడానికి పరిమితమయ్యారు. దీంతో కొన్ని సన్నివేశాలు టీవీ సీరియల్ ని తలపించాయి.

ఇంట్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటే అబ్బాయికి పెళ్లి కూతురుని ఎంపిక చేయడం ఎంత ఆలస్యం అవుతుందో అనే పాయింట్ తో కథ ప్రారంభమవుతుంది. అయితే ఆ ఎపిసోడ్ మొత్తాన్ని ఒక సాంగ్, రెండు మూడు సీన్లలో చూపించేసి.. ఆద్య రాకతో కథ ట్రాక్ మారుతుంది. అప్పటిదాకా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలని తిరిగిన చిరంజీవి అప్పటి నుంచి ఆద్య ప్రేమ కోసం తిరుగుంటాడు. కానీ చిరు, ఆద్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా లేవు. చాలా నిదానంగా సాగిన ఫస్టాఫ్ ఆద్య చిరుని పెళ్లి చేసుకోలేకని చెప్పడంతో ముగుస్తుంది.

సెకండాఫ్ కూడా చాలా సాదాసీదాగా సాగిపోయింది. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ప్రేమ/పెళ్లికి వ్యతిరేకం కావడం, హీరో అబద్ధం చెప్పి వాళ్ళ ఇల్లు/ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ మనసు గెలిచే ప్రయత్నం చేయడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసీ చూసీ ఉన్నాం. కిషోర్ తిరుమల మళ్ళీ ఈ సినిమాని అదే దారిలో నడిపించి విజయానికి దూరమయ్యాడు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా ఫ్లాట్ గా సాగిపోయింది. సాధారణంగా కిషోర్ తిరుమల సినిమాల్లో అంతో ఇంతో కామెడీ ఉంటుంది. కానీ ఈ సినిమాలో కామెడీ అంతగా వర్క్అవుట్ కాలేదు. రెండు మూడు సన్నివేశాల్లో మాత్రం కాస్త నవ్వుకుంటాం. ఎమోషనల్ గానూ కనెక్ట్ అయ్యే సీన్స్ అంతగా లేవు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో మాత్రం మాటలు అద్భుతంగా ఉన్నాయి.

కిషోర్ తిరుమల, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. కానీ ఈసారి ఈ కాంబినేషన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సాంగ్స్ పర్లేదు కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేదు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో మరీ తేలిపోయింది. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
నటీనటులు
మాటలు
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
ఆకట్టుకోని కథనం
బ‌ల‌మైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డం

నటీనటుల పనితీరు:
చిరంజీవి పాత్రలో శర్వానంద్ చక్కగా ఒదిగిపోయాడు. తన పాత్రకి వంద శాతం న్యాయం చేశాడు. ఆద్య పాత్రని రష్మిక చాలా సులువుగా చేసేసింది. శర్వా తల్లిగా రాధిక, రష్మిక తల్లిగా కుష్బూ ఆకట్టుకున్నారు. అయితే వీళ్లు ఎంత బాగా నటించినా సన్నివేశాల్లో బలం లేకపోవడంతో తేలిపోయింది. ఇక పద్మమ్మ పాత్రకి ఊర్వశి పూర్తి న్యాయం చేశారు. ఇంటర్వెల్ కి ముందు నవ్వించారు. క్లైమాక్స్ లో కంటతడి పెట్టించారు. వెన్నెల కిషోర్, సత్య ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు. బ్రహ్మానందం ఒక్క సన్నివేశంలో మెరిసి అలరించారు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
చాలా రోజుల తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' ప్రేక్షకులను అలరించడంలో సగమే విజయం సాధించింది. దీంతో కొంతకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ కి మరికొంతకాలం విజయం కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

రేటింగ్: 2.25/5

-గంగసాని






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.