![]() |
![]() |

పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ పై పోసాని విరుచుకుపడటం.. పోసానిపై పవన్ ఫ్యాన్స్ దాడికి యత్నించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ స్పందించారు. ఆ ఆరుగురు నిర్మాతలు డబుల్ గేమ్ ఆడటమే పవన్, పోసాని మధ్య వివాదానికి కారణభూతమైందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.
శుక్రవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నట్టికుమార్ మాట్లాడుతూ.. పవన్ తో సినిమాలు తీస్తున్న కొందరు నిర్మాతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే.. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఆలా మాట్లాడారని చెప్పారు. ఏపీ మంత్రి పేర్ని నానిని కలసిన సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు అక్కడ మాట్లాడిన విషయాలను స్పష్టంగా పరిశ్రమకు తెలియజేయకపోవడం కూడా అనేక అపోహలకు దారితీసింది అన్నారు. అక్కడ ఏం మాట్లాడి వచ్చింది పరిశ్రమ నుంచి వెళ్లిన ఆ పెద్ద మనుషులు బయటకు వెల్లడించకపోగా పవన్ ను రెచ్చగొట్టేలా డబుల్ గేమ్ ఆడారని ఆరోపించారు. రాజకీయాల గురించి పవన్ ఏవైనా మాట్లాడుకోవచ్చు. కానీ పెద్ద స్టార్ అయిన పవన్ సినీరంగం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవిక విషయాలు తెలుసుకుని మాట్లాడితే బావుండేది అన్నారు.
ఎవరైనా సరే ఫ్యామిలీస్ ను తిట్టడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అన్నారు నట్టి కుమార్. అలాగే, పోసాని ఇంటిపై పవన్ ఫ్యాన్స్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఆ సమయంలో పోసాని ఉంటే చంపేసేవారని, అందుకే అలా దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనసేన తెలంగాణ ఇంచార్జ్ మాట్లాడుతూ పోసానిని చంపేస్తామంటూ బెదిరించినందువల్ల అతనిపై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలన్నారు. తమ నాయకుడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై దాడులు చేయడమనేది హేయమైన చర్య అని.. పవన్ తన ఫాన్స్ ను అదుపులో పెట్టుకుని, వారికి దిశానిర్దేశం చేయాలని సూచించారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని.. చిరంజీవి గారు కూడా సీరియస్ గా తీసుకుని ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని కోరారు. ఇది చిలికి చిలికి గాలి వానగా మారకముందే ఇలాంటి వివాదాలకు ఫుల్ స్టాఫ్ పడేవిధంగా సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలని నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |