మాస్ మహారాజా రవితేజ - టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రిది చార్ట్ బస్టర్ కాంబినేషన్. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` (2001) వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత ఈ ఇద్దరి కలయికలో వచ్చిన రెండో సినిమా `ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!`. సీనియర్ దర్శకుడు వంశీ రూపొందించిన ఈ సినిమా మ్యూజికల్ గా మెప్పించడమే కాకుండా కమర్షియల్ గానూ మంచి విజయం సాధించింది. అలాగే వంశీకి కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది. `శేషు` (2002)తో తెలుగు తెరకు నాయికగా పరిచయమైన కళ్యాణి.. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో తొలి సక్సెస్ అందుకుంది. అంతేకాదు.. `ఉత్తమ నటి`గా నంది పురస్కారం సొంతం చేసుకుంది.
ప్రసన్న, కోట శ్రీనివాసరావు, బెనర్జీ, మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి, సూర్య, కృష్ణ భగవాన్, జయప్రకాశ్ రెడ్డి, కొండవలస, ప్రీతి నిగమ్, జీవా, ఎల్బీ శ్రీరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించిన ఈ చిత్రానికి గూడురు విశ్వనాథ శాస్త్రి కథను అందించగా.. వంశీ స్క్రీన్ ప్లే సమకూర్చారు.
చక్రి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``రా.. రమ్మని``, ``వెన్నెల్లో హాయ్ హాయ్`` చార్ట్ బస్టర్స్ గా నిలవగా - ``నాలో నేను``, ``ఎన్నెన్నో వర్ణాలు``, ``పొగడమాకు అతిగా``, ``ఏమి ఈ భాగ్యం``, ``నూజివీడు సోనియా`` గీతాలు కూడా అలరించాయి. మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేశ్ నిర్మించిన `ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!`.. 2002 ఆగస్టు 2న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 19 వసంతాలు పూర్తిచేసుకుంది.