![]() |
![]() |

సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఏడాది నుంచి సినిమా థియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని మంత్రికి వివరించారు. సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా థియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని.. ఈ కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా సినిమా థియేటర్లు మూతపడిన సమయంలో ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, ఎస్జీఎస్టీ ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు. జీఓ 75ను పునరుద్దరించాలని, షూటింగ్ అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
వినతిపై స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్ గౌడ్, బాల గోవింద్ రాజ్ తాడ్ల, టీఎస్ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు తదితరులు ఉన్నారు.
![]() |
![]() |