![]() |
![]() |

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత బీఏ రాజు కన్నుమూసారు. అనారోగ్యంతో హైదరబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చిక్సిత పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. నాలుగు దశాబ్ధాలుగా సినీ రంగంలో రాణిస్తున్న ఆయన, సూపర్హిట్ సినీ పత్రిక ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలకు, వందలాది చిత్రాలకు బీఏ రాజు పీఆర్వోగా పనిచేశారు. 2003లో నిర్మాతగా మారి ఆయన భార్య బి.జయ దర్శకత్వంలో ‘చంటిగాడు’ చిత్రం నిర్మించారు. ఆ తర్వాత గుండమ్మగారి మనవడు, లవ్ లీ, వైశాఖం చిత్రాలను నిర్మించారు.
బీఏ రాజు మరణం పట్ల సినీ ప్రముఖులు, సినీ జర్నలిస్ట్ లు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ‘‘బీఏ రాజు గారు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను. ఆయన నిబద్ధతతో పనిచేసేవారు. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అంటూ మహేష్బాబు ట్వీట్ చేశారు.
బీఏ రాజు మరణవార్త తెలియగానే షాక్ కి గురయ్యానంటూ జూనియర్ ఎన్జీఆర్ ట్వీట్ చేశారు. పీఆర్వోగా, జర్నలిస్ట్ గా ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్పసేవలు అందించారని గుర్తుచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో బీఏ రాజు మృతి పట్ల నివాళులర్పించారు.
![]() |
![]() |