![]() |
![]() |

అనారోగ్యంతో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే మహా నటుడు, గొప్ప నిర్మాత అయిన కృష్ణంరాజు మరణిస్తే ఆయనకు నివాళిగా ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపకపోవడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్స్ తో సినీ ప్రముఖులపై విరుచుకుపడ్డారు.
"భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.
"కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహనబాబుగారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్ కి, పవన్ కి, చరణ్ కి, అల్లు అర్జున్ కి, ఎన్టీఆర్ కి, రాజమౌళికి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది" అంటూ టాలీవుడ్ స్టార్స్ ని ట్యాగ్ చేస్తూ వర్మ సంచలన ట్వీట్స్ చేశారు.
![]() |
![]() |