![]() |
![]() |

టాలీవుడ్ లో ఐటీ దాడులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, ఫైనాన్సియర్ సత్య రంగయ్య ఇలా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ లిస్టులో ప్రముఖ దర్శకుడు, నిర్మాత సుకుమార్ కూడా ఉన్నారు. (Director Sukumar)
సుకుమార్ ఇంట్లో నిన్న ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయని సమాచారం. ఎయిర్ పోర్ట్ నుండి సుకుమార్ ను ఐటీ అధికారులు ఇంటికి తీసుకెళ్లి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే, మరోవైపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అలాగే ఆయన దర్శకత్వం వహించే సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన 'పుష్ప-2' చిత్రం విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ సహ నిర్మాత. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఐటీ రైడ్స్ జరుగున్నట్లు తెలుస్తోంది.
కాగా, రెండేళ్ల క్రితం 2023 ఏప్రిల్ లో కూడా టాలీవుడ్ లో ఐటీ రైడ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు సుకుమార్ పై కూడా ఐటీ రైడ్స్ జరగడం విశేషం. లెక్కల మాస్టర్ గా పేరున్న దర్శకుడు సుకుమార్ లావాదేవీలన్నీ కరెక్ట్ గా ఉన్నట్టున్నాయి. ఆ సమయంలో ఆయనపై ఎటువంటి ఆరోపణలు రాలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యే అవకాశముంది.
![]() |
![]() |