![]() |
![]() |
బుల్లితెర రంగంపై సుదీర్ఘ కాలంగా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి 'ఈటీవీ ప్రభాకర్'. ఆయన నటవారసత్వాన్ని పుచ్చుకుని ఇప్పటికే కుమారుడు చంద్రహాస్ హీరోగా టాలీవుడ్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ కూడా వెండితెరకు హీరోయిన్గా పరిచయం అవుతూ గ్లామర్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
దివిజ ప్రభాకర్ కథానాయికగా అరంగేట్రం చేస్తున్న ఈ సరికొత్త ఫ్యామిలీ డ్రామా చిత్రానికి “వెంకట్రామయ్య గారి తాలూకా” అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకోగా, రాబోయే జూలై నెలాఖరున ఈ సినిమాను థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.
కోమలి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ జానపద గాయని (ఫోక్ సింగర్) కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత కోమలి సినిమా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. చిత్ర పరిశ్రమపై ఉన్న ఫ్యాషన్తో ఎన్నో ఒడుదుడుకులను, రాత్రుళ్లు నిద్రలేని క్షణాలను అనుభవిస్తూ ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేశామని, ఒక గాయనిగా నన్ను ఆదరించినట్లే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు గుండెలకు హత్తుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయతలు, అనుబంధాలతో పాటు కన్నవారి విలువను చాటిచెప్పే హృదయపూర్వకమైన కుటుంబ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో టైటిల్ పాత్రల్లో సీనియర్ నటులు మురళీధర్ గౌడ్, సుధా అద్భుతమైన నటన కనబరిచారు. వీరితో పాటు కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలకమైన పాత్రలను పోషించారు.
బుల్లితెరపై ప్రభాకర్కు ఉన్న విపరీతమైన క్రేజ్ నేపథ్యంలో, ఆయన కుమార్తె దివిజ ఎంట్రీపై టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాతో పరిచయం అవుతుండటంతో ఈ స్టార్ కిడ్కు టాలీవుడ్లో మంచి బ్రేక్ లభిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ లాంచ్ మరియు ఆడియో విడుదల తేదీలను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.
![]() |
![]() |