![]() |
![]() |

తెలుగు సినీ పరిశ్రమలో దివంగత నటుడు శ్రీహరికి ఎంతో గొప్ప పేరుంది. ఎదుటివారికి సాయం చేయడంలో ఆయనెప్పుడూ ముందుండే వారు. ఎందరికో డబ్బు సాయం, మాట సాయం చేసి అండగా నిలబడ్డారు. అలాంటి శ్రీహరి కుటుంబాన్ని కొందరు మోసం వేసి, విలువైన ఆస్తులను కొట్టేశారు. ఈ విషయాన్ని శ్రీహరి సతీమణి డిస్కో శాంతి స్వయంగా చెప్పడం విశేషం.
తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీహరి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు శాంతి. "బావ(శ్రీహరి) ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉన్నా కూడా.. అర్థరాత్రి 2-3 గంటల వరకు మేల్కొని ఎందరో సమస్యలను పరిష్కరించిన రోజులు ఉన్నాయి. ఆయన దానం చేస్తుంటే నేనెప్పుడూ వద్దని చెప్పలేదు. ఎందుకంటే ఆయన చేస్తుంది మంచే కదా. మనం మంచి చేస్తే.. దేవుడు మనల్ని మంచిగా చూసుకుంటాడని నేను నమ్ముతాను." అని శాంతి అన్నారు.
శ్రీహరి ఆస్తుల గురించి శాంతి మాట్లాడుతూ.. "సినిమాల్లో శ్రీహరి బాగానే సంపాదించారు. వాటిలో మా అవసరాలకు ఉంచుకొని.. ఎక్కువగా దానం చేసేవారు. నేను కూడా తినడానికి, ఉండటానికి ఉంటే చాలని చెప్పేదాన్ని. ఆస్తుల్లో సగానికి పైగా స్నేహితులే మోసం చేసి కొట్టేశారు. ఎవరి పాపాన వాళ్ళే పోతారని వదిలేశాను. శ్రీహరి గారు చనిపోయాక ఇబ్బందులు పడ్డాము. ఇక్కడి ఆస్తుల విలువ మాకు తెలియకపోవడంతో.. తక్కువ ధరకే కొందరు కాజేశారు. కొంతకాలం తిండికి కూడా కష్టమైంది. బంగారం తాకట్టు పెట్టాను. మా అన్నయ్య ఖర్చులకు డబ్బులు పంపారు." అని చెప్పారు.
"మేము ఆస్తులు కూడపెట్టుకున్నామని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కువగా దానాలే చేశాము. శ్రీహరి చనిపోయాక డబ్బులు ఇవ్వాల్సిన కూడా ఇవ్వలేదు. ఇప్పుడు లైఫ్ పరవాలేదు. జాగ్రత్తగా ఉంటున్నాము. ఉన్నది కాపాడుకుంటున్నాము. భవిష్యత్ లో మా పిల్లలు మళ్ళీ సంపాదించుకుంటారు." అంటూ శాంతి చెప్పుకొచ్చారు.
![]() |
![]() |