![]() |
![]() |

పద్మభూషణ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇలా ఘనతలు సాధిస్తూ దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. మరో అరుదైన ఘనత సాధించారు. ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశం ఆయనకు లభించింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణ భారత నటుడు బాలకృష్ణ కావడం విశేషం. (Nandamuri Balakrishna)
ఈ అరుదైన అవకాశం లభించడంపై స్పందించిన బాలకృష్ణ, తన సంతోషాన్ని పంచుకున్నారు. "ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో చిరస్మరణీయ, మరపురాని ఘట్టం. ఈ రోజు నేను, మా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE India సందర్శించడం జరిగింది. ఆ సందర్భంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు చూపిన ఆత్మీయత, ఇచ్చిన గౌరవం నా హృదయాన్ని తాకింది. ప్రత్యేక ఆహ్వానం ఇచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారు. దక్షిణ భారతీయ నటుడిగా, హీరోగా ఈ వేదికపై బెల్ మోగించిన మొదటి వ్యక్తిగా నిలవడం నాకు గర్వకారణం మాత్రమే కాదు… ఇది నా తెలుగు ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల ప్రతిఫలమని భావిస్తున్నాను. ఈ క్షణం నాకు మరపురానిది. ఇది వ్యక్తిగత ఘనత కాదని.. మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నాను." అంటూ బాలకృష్ణ తన ఆనందాన్ని పంచుకున్నారు.

![]() |
![]() |