![]() |
![]() |

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆకెళ్ల పేరుతో పలు సినిమాలకు రచయితగా పని చేసిన ఆకెళ్ల సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆకెళ్ల.. ఆరోగ్యం విషమించి హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. (Akella Suryanarayana)
ఆకెళ్ల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. చిన్నతనం నుండే నటుడిగా నాటకరంగంలో రాణించారు. ఆ తర్వాత రచయితగా ప్రయాణం మొదలుపెట్టారు. మొదట్లో చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు వ్రాసి పంపేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత మొదటి నవల రచించారు. ఆకెళ్ల సుమారు 200 కథలు, 20 నవలలను రచించారు. వీటిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్దాయి. 'కాకి ఎంగిలి', 'అల్లసాని పెద్దన', 'రాణి రుద్రమ', 'రాణాప్రతాప్' లాంటి నాటకాలు రాశారు. టీవీ సీరియల్స్కి కూడా పనిచేశారు.
సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు ఆకెళ్ల. రచయితగా ఆయన తొలి చిత్రం మగమహారాజు. స్వాతిముత్యం, శ్రుతిలయలు, సిరివెన్నెల, శ్రీమతి ఒక బహుమతి, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, ఔనన్నా కాదన్నా వంటి చిత్రాలకు రచయితగా పని చేశారు. 'అయ్యయ్యో బ్రహ్మయ్య' అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. 80కి పైగా సినిమాలకు కథలను, మాటలను అందించిన ఆకెళ్ల.. 15 ఏళ్ల పాటు తెలుగు రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆకెళ్లకు ఎన్నో అవార్డులు లభించాయి. 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకోవడం విశేషం. కాకి ఎంగిలి నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
ఆకెళ్ల మృతి పట్ల తెలుగు పరిశ్రమ నుంచి పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు శనివారం హైదరాబాద్లోని హఫీజ్పేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
![]() |
![]() |