ఎవరి ఇష్టానిష్టాలతో జీవితానికి సంబంధం ఉండదు. జీవితం దారి జీవితపుది.
మనం జీవితాన్ని శాసించలేం. జీవితం మనసు శాసిస్తుంది. ఈ శాసించే దాన్నే "విధి" అంటాం.
నరసింహాచార్యులవారు - అమ్మా - నేను ఎద్దులబండిలో బయలుదేరాం. మా తాతయ్య, అమ్మమ్మ కన్నీరు రాల్చడం - అమ్మ ఏడవడం - ఏటిదాకా వచ్చి తాతయ్య సాగనంపడం జరిగిపోయాయి.
ఎల్లంపేట ఊళ్లో సీతాఫలాల గంప - గంప సహితంగా పావలాకుకొన్నారు. ఎల్లం పేట బస్సు స్టేజిలో బస్సెక్కి ఖమ్మం చేరుకున్నాం.
ఖమ్మంలో ఇంటి వాతావరణం మారింది. నాయనమ్మ మమ్ములను చూచింది. ముక్కు విరిచింది. లోనికి వెళ్లిపోయింది. నాయన నరసింహాచార్యులవారికి స్వాగతం చెప్పారు. అమ్మ వసారాలో కూలబడింది. అమ్మ పక్కన నేను నుంచున్నాను. తాను సామానుగదికి తాళం వేయడం లేదనీ ఇంకేమేమో నాయన నరసింహాచార్యులవారికి వివరించారు. వారు వెళ్లిపోయారు. మమ్ములను పలకరించినవారు లేరు.
అమ్మ మెల్లగా లేచింది. లోనికి వెళ్లింది. సామాను గదికి తాళం లేదు. కాని గదిలో బస్తాలు, డబ్బాల కొద్ది ఉన్నదంతా కాళీ. బియ్యం పప్పులు మరీ కొద్దిగా ఉన్నాయి. అమ్మ స్నానం చేసి మడి కట్టి వంటచేసింది. అందరికి పెట్టింది. తాను తిన్నది. ముడుచుకుని పడుకుంది.
అమ్మ - తన ఇంట్లో పరాయిదానిలా, పనిమనిషిలా కాలం వెళ్లబుచ్చుతున్నది.
కాలానికి కళ్లులేవు. మనసులేదు. అది కరవాలంకన్న కరకు అయింది. అది దేనికోసమూ ఆగదు. సాగిపోవడమే దాని పని.
కాలం గడిచిపోయింది. సంవత్సరమో, రెండు సంవత్సరాలో కావచ్చు. ఒకనాడు నాయన, నాయనమ్మ, అన్నయ్య మూటలు సర్దుకుని ప్రయాణమై పోయారు. రోజూ ఏదో గొడవలూ - తగాదాలు - అమ్మను కొట్టడాలు - అమ్మ ఏడ్పులు మామూలు అయిపోయాయి! ఈ ప్రయాణం ఏ తగాదా పరిణామమో తెలియదు.
అప్పటికి కుటుంబానికి మరో ఇద్దరు చెల్లెళ్లు చేరారు. ఇంట్లో సరకులు లేవు. డబ్బులేదు. నలుగురికి గడవాలి! ఉపవాసాలు - ఉప్పిళ్లు. ఉన్నది మాకు పెడ్తుంది అమ్మ. తన పిల్లల ఆకలి ఓర్చలేదు తల్లి! తాను ఉపవాసం ఉంటుంది. ఒక్కొక్కసారి అందరమూ ఉపవాసమే! అయినా, నేను స్కూలుకు మాత్రం వెళ్లేవాణ్ణి. అమ్మ కష్టాలు చూడడం శక్యం అయ్యేది కాదు. అల్లాఉద్దీన్ దీపం లాంటింది, ఆలీబాబా ఖజానా లాంటిది దొరకాలనిపించేది. ఆలోచనులు నా వయసుకు మించిపోయేవి. కష్టాల్లో మనిషి కాకలు తీరుతాడు!
ఎలాగో మా నాయన విజయవాడలో ఉన్నారనే సమాచారం సాధించింది అమ్మ. బెజవాడ ప్రయాణం అయినాం.
ఆ రోజుల్లో రైళ్లు ఆవిరి ఇంజనుతో నడిచేవి. ఇంజనులో రాక్షసిబొగ్గు మంట - ఆకలి మంటలను మించి - భగ భగ మండుతుండేది. బొగ్గుమనిషి పారతో బొగ్గు మంటలో వేస్తుంటాడు. పొగ కక్కుకుంటూ - ఆవిరి చిమ్మకుంటూ - కూత కూసుకుంటూ రైలు సాగుతుంది. రైలు మొత్తం అయిదారు పెట్టెలకు మించి ఉండేవి కాదు. ఒకటే లైను. ఎదురు బండి వస్తే స్టేషనులో ఆగిపోవాలి. అది సాగిపోయాక - ఇది కదలాలి. మద్రాసు -ఢిల్లీల మధ్య నడిచే జి.టి. ఎక్స్ ప్రెస్ తప్ప - మిగతా రెండు పాసింజర్లే. అన్ని స్టేషన్లలో ఆగుతాయి. బెజవాడ వరకు N.S.R. నిజాం స్టేట్ రైల్వే. బెజవాడ నుంచి M.S.M. - మద్రాసు సదరన్ మహారాష్ట్ర రైల్వే. బెజవాడలో N.S.R.కు గుర్తింపులేదు. దానికి స్వంత ప్లాట్ ఫారం ఉన్నా గంటల తరబడి వంటిరెక్క దగ్గర నిలిపివేసేవారు.
అది నాకు తొలి రైలు ప్రయాణం. ఎంతో ఉద్వేగం కలిగించింది. చెట్లు గుట్టలు వెనక్కు పోవడం - పట్టాలమీద రైలు లయబద్ధ ధ్వని - రైలు కూత - ఆగడం - సాగడం - అన్నీ వింతగా - వినోదంగా - విచిత్రంగా ఉన్నాయి. రైలు టిక్కెట్టు ఖమ్మం నుంచి బెజవాడకు రూపాయి పావలా.
మేము బెజవాడలో దిగాం. ఆ ప్లాటుఫారం సందడి - ఆ రైళ్లు - అక్కడి దుకాణాలు - నాకు కొత్తలోకంలా అనిపించింది. బయటికి వస్తే జన సందోహం - గుర్రబ్బళ్లు - అంతా వింతగా ఉంది.
గుర్రబ్బండిలో కొత్త గుళ్ల దగ్గరి రామానుజ కూటం చేరుకున్నాం. అన్నయ్య ఎదురు వచ్చి మూటలు అందుకున్నాడు. నాయన, నాయనమ్మ బిగుసుక్కూర్చున్నారు. అమ్మకు గత్యంతరం లేదు. ఇంట్లోకి వెళ్లింది. కొళాయికింద కాళ్లు కడుక్కుంది. నాయననూ నాయనమ్మనూ పలకరించింది.
అన్నయ్య నాకు రామానుజ కూట భవనం చూపిస్తున్నారు. అలాంటి భవనం అంతకు ముందు నేను చూడలేదు. గోడలకు కరెంటు - కొళాయి చూడ్డం నాకు అదే మొదలు. లైటు వెలిగించడం - ఆర్పటం ఒక వింత!
అది నిడుముక్కల సుబ్బారావు రామానుజకూటం - అంటే శ్రీవైష్ణవుల సత్రం. ఎందరు శ్రీవైష్ణవులు వచ్చినా మూడురోజులు ఉచిత భోజనం లేదా మనిషికి పావలా చొప్పున ఇచ్చి వసతి వంటపాత్రలూ ఇచ్చేవారు.
అక్కడ అమ్మకు హాయిగా ఉండింది. కట్టెల వంట అనుమతించేవారుకాదు. బొగ్గుల వంట - పొగ తప్పింది - పంపునీళ్లు - నీళ్లు చేదడం, ఏటినుంచి తేవడం తప్పింది. పాత్రలకు మసి ఉండదు. మసి తోమడం తప్పింది. ఊడవడం, చల్లడం తప్పాయి. అమ్మ కాస్త నవ్వుతూ కనిపిస్తే నాకు ఎంతో ఊరట!
అన్నయ్యా నేనూ లాకుల దగ్గర కూర్చునేవాళ్లం. పడవ రావడం - కాల్వ తలుపులు తెరవడం - పడవదాటగానే. మళ్లీ మూయడం - ఎంత చూచినా తనివి తీరదు - కృష్ణ కట్టమీదినుంచి పడుతున్న జలపాతం - దూరంగా రైల్వే బ్రిడ్జిమీద రైళ్ల దాకా పొగలు అన్నీ ఏదో చిత్రంలా ఉండేవి.
కాళేశ్వర రావు మార్కెటు కనుల పండుగ. కూరగాయలు - పండ్లూ - పూలూ వాటి పరిమళం అద్భుతం. దమ్మిడీకి ఏదయినా కొనవచ్చు. కానీకి మూడు దమ్మిడీలు. తాటాకు బుట్టలనిండా పచ్చని కూరలు పట్టుకెళ్లేవాళ్లు! మార్కెటు ముందు సిమెంటు గొడుగుకింద ఎర్రటోపీ పోలీసు. అంతే. అది దాటిపోలేదు. గవర్నరుపేట చూడలేదు.
ఈ సంబరం ఎన్నాళ్లుందో లెక్కలు లేవు కాని, నాకు త్వరగా ముగిసింది అనిపించింది. అందరు ఖమ్మం చేరుకున్నాం.
బెజవాడ రైలెక్కేప్పుడు అమ్మను చూస్తే మెడ బోసిగా ఉంది. తరువాత తెలిసిన విషయం ఏమంటే - నాయన అమ్మను కృష్ణకు తీసికెళ్ళారు. తన కండువా చాపి, అమ్మ నగలన్నీ అందులో వేస్తేనే అమ్మతో ఖమ్మం వస్తానన్నారు. అమ్మ మెడలోని నగలు తీసి ఇచ్చింది. చెవుల దిద్దులు, ముక్కుపుడకలూ ఇచ్చి, పుల్లలు పెట్టుకుంది. చేతికి ఉన్న నాలుగు జతల గాజులు రాలేదు. నాయన సబ్బు పెట్టి తీశారు. తన వెంట తెచ్చిన గిలేటు గాజులు వేశారు.
అమ్మ పద్మములేని లక్ష్మీవలె - వీణలేని సరస్వతివలె అనిపించింది. అమ్మ భర్త ఆదరం నోచుకోని గృహిణి!
కాలగమనం ఆగదు. నగలన్నీ వలిచి ఇచ్చి కలతలు దూరం చేసుకుందామనుకున్న అమ్మ కల చెదిరిపోయింది. కలతలు మరింత పెరిగాయి. జగడాలు తప్పలేదు. అమ్మకు తన్నులు తప్పలేదు. ఇల్లు నరకం అయింది.
ఒకనాడు అమ్మ ప్రాణం విసిగింది. బావిలో పడటానికి ఉరికింది. పిల్లలం గొల్లుమన్నాం. పిల్లల ఆర్తనాదం విని ఏ తల్లి చావగలదు? మమ్ములను పట్టుకొని కంటికి కడివెడుగా ఏడ్చింది. మేము అసమర్థులం! ఏడవడం తప్ప ఏం చేయగలం?
నాయన మమ్ములను వదిలి నెలలు తరబడి వెళ్లిపోయేవారు. నాయనమ్మకు నల్లమందుకు మాత్రం డబ్బిచ్చి వెళ్లేవాడు. మళ్లీ అర్ధకళ్లు - ఉపవాసాలు - చిరిగిన బట్టలు. ఇల్లు భయం భయంగా ఉండేది.
అన్నయ్య ఒకటి రెండు ట్యూషన్లు - నేను రెండూ చెప్పే వాళ్ళం. విచిత్రమైన పరిస్థితిలో హమాలి లింగయ్యతో నాకు పరిచయం అయింది. లింగయ్య - తాను చెమటోడ్చి సంపాదించిందాంట్లో - నాకు రోజూ బేడ ఇచ్చేవాడు. లింగయ్య ఎంత ఇచ్చాడని కాదు. బేడా కూడా ఆ రోజుల్లో ఎక్కువే - శేరు బియ్యం వచ్చేవి. నా కష్టాలు చూచి అతను స్పందించిన విధం దొడ్డది!
నాయన ఎప్పుడో వచ్చేవారు. మెరుపులా వచ్చేవారు. తనకు కావలసినన్ని తెచ్చుకునేవారు. సబ్బులు - వాసన నూనెలు - వెండి వరఖు జరదా తాంబూలాలూ - గ్లాస్కో పంచెలూ - కాశ్మీర్ శాలువలు! వారు ఉన్నన్నాళ్లు ఇల్లు ఆడంబరంగా - సందడిగా వైభోగంగా ఉండేది. అదిమాత్రం చూచిన వారికి మా బాధలు కల్లలుగానే కనిపించేవి.
ఈ వెలుగు చీకట్లమధ్య - నాయన లేనపుడు, మా అన్నయ్య - మా అమ్మ పెద్ద తెలుగు పంచకావ్యాలు - అప్పకవీయం చదువుకున్నాను. అష్టకష్టాల్లోనూ కవితను వివరించేప్పుడూ - విశ్లేషించేప్పుడూ - మా అమ్మ ముఖంలో ఆనందం తొణికిసలాడేది! సుకవితా యద్యస్తిరాజ్యేనకిం? సుకవితయె యున్న రాజ్యమది ఏల - అన్న భర్తృహరి మాట నిత్యసత్యం అనిపిస్తుంది.
ఒకసారి నాయన మందీమార్బలంతో అట్టహాసంగా దిగారు. ఆ వచ్చింది శ్రీమద్రామానుజుల తిరునక్షత్రం - జన్మదినం జరపడానికి. ఏర్పాట్లుకూడా అట్టహాసంగా జరిగాయి. వంట మనుషులు వచ్చారు. బండితో వంటచెరుకు దిగింది. కొట్టేవాళ్లు గొడ్డళ్ళతో కొట్టారు. బస్తాలు, డబ్బాలతో సామగ్రి దిగింది. పాలు, పెరుగు బిందెలతో చేరాయి. వైష్ణవులు వందలకొలది వచ్చారు.