ఇన్ని అడ్డంకులు - ఆటంకాలు - సహాయ నిరాకరణలమధ్య ఖమ్మంలో మూడవ ఆంధ్రమహాసభ విజయవంతంగా జరిగింది. సభకు రెండు వేలవరకు ప్రతినిధులు వచ్చారు. సాయంత్రం 5.00 గంటలకు పురవీధులనుంచి - నినాదాలు ప్రతిధ్వనించగా - ఊరేగింపు జరిగింది. ఈ ఉరేగింపు మధ్యలో ఛాందసులు ఒకటి రెండు వందల మంది కలిశారు.
ఈరేగింపు సభాస్థలికి చేరింది. సభ ప్రారంభం అయింది. ఆహ్వాన సంఘాధ్యక్షులు అయితరాజు జీడికంటి రామారావుగారు వారి ఉపన్యాసం చదవడం ప్రారంభించారు.
సభను విచ్ఛిన్నం చేయడానికి వచ్చినవారు లేచి, ఉపన్యాసంలో తమకు అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయనీ, చదవరాదనీ అభ్యంతరం చెప్పారు. సభలో గందరగోళం నివారించదలచి, ఆహ్వాన సంఘాధ్యక్షులు ఉపన్యాసం చదవడం మానేశారు.
ఈ సభకు పులిజాల వేంకట రంగారావుగారు అధ్యక్షత వహించారు.
ఈ సభ విశేషం ఏమంటే - ఎర్రుపాలెం నుంచి వచ్చిన గురునాథ శర్మగారి వేదమంత్ర పఠనంతో ప్రారంభం అయింది. అంతకుముందు జరిగిన సభల్లో వేదమంత్ర పఠనం జరగలేదు. ప్రతిపక్షుల వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవడానికి దీనిని ప్రవేశపెట్టినట్లున్నారు.
అధ్యక్షోపన్యాసాన్ని అధ్యక్షులవారు గంభీరంగా, ఉత్సాహంగా చదివారు. ప్రేక్షకులకు ఆంధ్రాభిమానం - ఉత్సాహం కలిగించారు.
సభ ముగిసింది. రాత్రి పదకొండు గంటలకు విషయ నిర్ణాయక సభ ప్రారంభం అయింది. అప్పుడు కలెక్టరుగారు తహసీల్దారును పంపారు. హనుమంతరావుగారిని - బూర్గుల రామకృష్ణరావుగారిని పిలిపించారు. వారు కలెక్టరు దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే ప్రతిపక్ష నాయకులు - మరికొందరు అధికారులు అక్కడ ఉన్నారు. కలెక్టరుతోనూ, ఛాందసులతోనూ మూడు గంటలు చర్చలు జరిగాయి. వారి వత్తిడి ఫలితంగా 6 వ తీర్మానం చర్చలేకుండా ఆమోదించడానికి - 13, 20, 21 తీర్మానాలు విరమించడానికి అంగీకరించక తప్పిందికాదు.
`ఆ తీర్మాలను గురించి తెలుసుకుంటే - ఈనాడు - అపహాస్యం అనిపిస్తుంది.
6 వ తీర్మానం ప్రభువువారికి కృతఙ్ఞతలు చెప్పేది. 13 దేవాలయాలలో హింసను నివారించడానికి, 20 బాల్య వివాహాలు, వరకట్న వ్యతిరేకపుది. 21 హరిజనుల అభ్యుదయానికి సంబంధించింది.
రెండవనాటి సభలో మిగతా తీర్మానాలు ఆమోదించబడినాయి.
మహిళా సభ ఎల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షతన జరుగుతున్నది. సభాస్థలము మహిళలతో కిటకిటలాడుతున్నది. చాట్రా పతి లక్ష్మీనరసమ్మగారు మున్నగువారు ఉపన్యసిస్తున్నారు.
కలెక్టరుగారు మరల ఛాందస మహాశయులను వెంటనిడుకొని, రవి తేజము లలరగ - సభాస్థలికి విజయము చేసినారు. ఆంధ్రమహాసభ కార్యదర్శి మాడపాటి హనుమంతరావుగారిని పిలిపించినారు. వెంటనే మహిళా సభను నిలుపుచేయించవలసినదని ఆదేశము అనుగ్రహించినారు.
హనుమంతరావుగారు సాధు స్వభావులు, సాధారణంగా ఆవేశపడరు. కార్యము సాధించుట వారి స్వభావము. కయ్యం కొనుక్కోవడం కాదు.
అలుగుటమే యెరుంగని మహామహితాత్ముడు - ఆంధ్రపితామహుడు అలిగినాడు!
"అయ్యా! ఈ సభకు తమరు ఎన్నియో విధముల ఆటంకములు, చిక్కులు కల్పించుచున్నారు. జరుగుచున్నది స్త్రీల సభ. నేను దానిలోనికి ప్రవేశించజాలను. మీరు అవలంబించు విధానమేదియో నిరభ్యంతరముగ అవలంబించవచ్చును. నన్ను తమరు అరెస్టు చేసి, తగిన చర్యలు గైకొనవచ్చును" అని తమ కోపాన్ని గుమ్మరించారు.
వచ్చిన కలెక్టరు - ఛాందసులు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. దడుచుకున్నారు. కారులో పడ్డారు. తోక ముడిచారు!
అట్లు లేని తోకలు ఎందుకు ముడిచారనగా - గోరంతలను కొండంతలు చేసిన - సర్కారువారి ఆగ్రహాగ్నిలో భస్మము కావలసివచ్చునుకదా!
ఆవిధంగా ఖమ్మంమెట్టులో తృతీయ ఆంధ్రమహాసభలు - ఆటంకాలు, అవరోధాలు, అహంకారాలు, అసమ్మతులు, విరోధాలు, కుట్రలు, కుహకాల మధ్య - విజయవంతంగా కాకున్నా, ప్రశాంతంగా ముగియడానికి నిర్వాహకుల కార్యదీక్ష, కార్యదక్షత మాత్రమే కారణాలు. తుదకు వారు కత్తిమీద నడిచి సర్కసు చేయవలసి వచ్చింది.
పరిస్థితి అతి సున్నితమైంది. సభకు విఘాతం జరుగుతే ప్రజలలో ఇంత కాలంగా ఏర్పరచిన విశ్వాసం కూలిపోతుంది. ప్రజల్లో నిరాశా నిస్పృహలు వ్యాపిస్తాయి. ప్రభుత్వం చంకలు గుద్దుకుంటుంది. అందువల్ల ఎన్నిటికో లొంగి సభలు నిర్వహించాల్సి వచ్చింది.
తదనంతర కాలంలో దీనికి మితవాదం అని ముద్ర వేసినవారు గ్రహించవలసిన విషయం ఏమంటే - ఆనాటి మితవాదం లేకుంటే అపరిమితవాదం ఉండేది కాదు. మితవాదపు భుజాల మీదనే అమిత వాదం నిలిచింది. ఒక రాజకీయ ఎత్తుగడగా మితవాదాన్ని నిందించవచ్చు. ఈనాడు మితవాదంగా ముద్రపడిందే ఆనాడు 'అతివాదం' అనే విషయం చారిత్రక సత్యం.
ఒక సభమాత్రం జరుపుకోవడానికి 'ముసలినక్క' మీర్ ఉస్మాన్ ఇన్ని చిక్కుల పాలుచేసిన 1934లో బ్రిటిషిండియాలోని నేషనల్ అసెంబ్లీలో ప్రజల ప్రాతినిధ్యం ఉంది. ఆనాటి ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రజల ప్రాతినిధ్యం ఇలా ఉంది:
కాంగ్రెస్ పార్టీ 44, కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీ 11, ఇండిపెండెంట్ పార్టీ 22, యూరోపియన్ గ్రూపు 11, అధికారులు 26, నామినేటెడ్ అనధికారులు 13.
1935 భారత శాసనం ప్రకారం అధికారం ప్రజలకు వప్పగించే దిశకు బ్రిటిషు ప్రభుత్వాన్ని మళ్ళించిన మహాత్ముని మహోద్యమం నడిచిన భారతదేశపు నడిబొడ్డున నిరంకుశ ప్రభువు ప్రజల కనీసపు సమావేశ హక్కును దిగమింగిన మధ్య యుగాలనాటి కరాళ కర్కశ విధానం కొనసాగింది!
ఇంత అక్కసు, ఇంత దౌర్జన్యం, ఇంత కుట్ర ఎందుకు? రెండో మహాసభలో - ప్రజలు సమావేశపు హక్కును మింగిన - గస్తీ నిషాన్ తిర్దన్ ఉపసంహరించుకోవలసిందని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినందుకు!
ఆ తీర్మానంతో ప్రభుత్వం బెదిరిపోయింది. పిచ్చికుక్కలా వ్యవహరించింది.
సభ జరుపుకోవడానికి మంత్రిమండలి అనుమతి కావలసిరావడం ఎక్కడయినా ఉందా?
'సభ జరపుకోనివ్వం' అని ప్రధానమంత్రి ఆదేశం పంపించి బెదిరించడం ఎక్కడయినా ఉందా?
హిందువులే పనికి రారని తురకలను రెచ్చగొట్టిన ప్రభుత్వం, హిందూ సనాతనులను ఆశ్రయించడం ఎక్కడయిను ఉందా?
సభలు బాగా జరుగుతున్నాయని ఈగంతో సనాతనులు అనే తొత్తులను చంకన పెట్టుకొని ఆడవాళ్ళ సభను ఆపుచేయ ప్రయత్నించడం ఎక్కడయినా ఉందా?
దీనితో స్పష్టంగా తేలిన విషయం ఏమంటే - జన్మ జన్మాల బూజు నిజాం రాజుకు మతంతో కాదు సంబంధం - అతనికి అధికారంతో సంబంధం! అది నిలుపుకోవడానికి అతడు ఏ మతాన్నయినా, ఏ ధర్మాన్నయినా ఆశ్రయించగలడు. ఎంతటి నీచానికయినా పాల్పడగలడు. ఎవరినయినా ఆశ్రయించగలడు. ఎవరికయినా దాస్యం చేయగలడు. చాకిరి చేయగలడు.
నిజాం పిశాచపు ప్రథమ లక్ష్యం అధికారం!
అసలు అధికారమే అలాంటిదేమో!
అది పులిని ఎక్కడం లాంటిది.
పులిని ఎక్కడం తేలికే!
ఎక్కింతరువాత భయం - భయం - భయం.
ఇహ దిగడం తేలిక కాదు.
దిగుతే పులి మింగుతుంది!
ఏడు
కలతల కుటుంబం:
గోవర్థనం నరసింహాచార్యులవారు ఖమ్మం దగ్గరి పోలేపల్లి అగ్రహారీకులు. అగ్రహారం అంటే జాగీరులాంటిది. బ్రాహ్మణుల జాగీరును అగ్రహారం అంటారు. వారు సంపన్నులు. మామిళ్ల గూడెం దారిలోని రైల్వేగేటు పక్కన అతి విశాలం అయిన స్థలంలో చాల పెద్ద బంగళా ఉండేది. ఆ రోజుల్లో గ్రామోఫోనులు కూడా అతి తక్కువ. అవీ పెద్ద బూరతో ఉండేవి. వాళ్ళ ఇంట్లో గ్రామోఫోను ఉండేది.